రాజన్న సిరిసిల్ల, మే 26 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని పలు మండలాల్లో శనివారం సృష్టించిన ఈదురుగాలుల బీభత్సానికి రూ.లక్షల్లో నష్టం వాటిల్లింది. సిరిసిల్ల పట్టణంతోపాటు తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, కోనరావుపేట మండలాల్లో అతివేగంగా వచ్చిన ఈదురుగాలులకు అనేక ఇండ్ల పైకప్పులు లేచిపోయి, ఇండ్లు దెబ్బతిన్నాయి. రోడ్లవెంట ఉన్న భారీ వృక్షాలు నేలకూలాయి. వందలాది విద్యు త్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు పడిపోయి విద్యుత్ వైర్లు తెగి కిందపడ్డాయి. ఒక్కటి కాదు రెండు కాదు రెండు వందలకు పైగా విద్యుత్ స్తంభాలు విరిగి పోవడంతో పల్లెల్లో గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచి పోయింది.
ప్రకృతి విపత్తు తెచ్చిన నష్టాన్ని పూరించేందుకు సెస్ సంస్థ రంగంలోకి దిగింది. చైర్మన్ చిక్కాల రామారావు, ఎండీ సూర్యచంద్రారావు, డీఈ రాంసుబ్బారెడ్డి ఆధ్వర్యం లో 150 మంది సిబ్బంది రంగంలోకి దిగారు. ఇల్లంతకుంట, తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట, చం దుర్తి, కోనరావుపేట, సిరిసిల్ల మండలాల్లో విద్యుత్ స్తం భాలు దెబ్బతిన్నా యి. సుమారు 150 స్థంభాల్లో ట్రాన్స్ఫార్మర్లు కూడా ఉన్నందున రూ.50 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. విరిగిపడ్డ విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్తవాటిని ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని మండలాల్లో శనివారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకు కరెంటు సరఫరా కాలేదు. గృహాలకు మాత్రం కరెంటు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకున్నారు.
గాలి దుమారం తాకిడికి దాదాపు 50 ఇండ్ల పైకప్పులు లేచిపోయినట్లు అధికారుల ప్రాథమిక సమాచారం. వీటి నష్టం సుమారు రూ.50 లక్షలకు పైనే ఉంటుందని తెలిపారు. కాగా కోళ్ల ఫారాల్లోని రేకుల షెడ్లు సైతం దెబ్బతిన్నాయి. నష్టంపై రెవెన్యూ, సెస్ సిబ్బంది గ్రా మాల్లో సర్వేలు చేస్తున్నారు. రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో జరిగిన నష్టంపై సమాచారం అందే అవకాశాలున్నాయి. కాగా విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు సెస్ అధికారులు, రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. పంటచేలు, చెరువు గట్ల పక్కన పెద్దఎత్తున ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు పడిపోయి విద్యుత్ వైర్లు తెగి కిందపడ్డాయి. వాటిని సరిచేస్తున్నారు. విద్యుత్ సరఫరా అందించే ప్రయత్నాలు చేస్తున్నారు.