కోల్సిటీ, డిసెంబర్ 11 : అందరి పిల్లల్లా చలాకీగా తోటివారితో ఆడుకోవాల్సిన చిన్నారి రెండేండ్ల క్రితం తీవ్ర అస్వస్థతకు గురైంది. దవాఖానకు తీసుకెళ్లగా 22 రోజులు కోమాలోనే ఉండిపోయింది. పరీక్షలు చేసిన వైద్యులు చిన్నారి మెదడులో కణితి(బ్రెయిన్ ట్యూమర్) ఉందని తేల్చడంతో కన్నవారిని షాక్కు గురిచేసింది. అస్థిపాస్తులమ్మి, అప్పోసప్పో జేసి రూ. 15 లక్షలు వెచ్చించి హైదరాబాద్లో చికిత్స చేయించినా ఆరోగ్యం కుదుటపడలేదు. ప్రస్తుతం కృత్రిమశ్వాసతో దినదినగండంగా బతుకువెళ్లదీస్తున్నది. బిడ్డ దయనీయస్థితిని చూసి కన్నపేగు తల్లడిల్లుతున్నది. దాతలు ముందుకువచ్చి మా పాపకు ప్రాణభిక్ష పెట్టాలని దీనంగా వేడుకుంటున్నది.
గోదావరిఖని శివారులోని జనగామ గ్రామానికి చెందిన గడ్డం మల్లేశ్-శ్రావణి నాలుగేండ్ల క్రితం కూతురు సాత్విక (4) జన్మించింది. అందరి పిల్లల్లాగే ఆటపాటలతో సందడి చేస్తుంటే తల్లిదండ్రులు సంబురపడేది. ఆ చిన్నారి చెప్పే చిట్టిపొట్టి మాటలు విని మరిసిపోయేది. ఇంతలో సాత్విక రెండేళ్ల క్రితం తీవ్ర జ్వరం వచ్చి కోమాలోకి వెళ్లింది. తల్లిదండ్రులు హాస్పిటల్కు తీసుకవెళ్తే 22 రోజులు కోమాలోనే ఉన్నది. ఆ తర్వాత స్కానింగ్ చేసిన వైద్యులు మెదడులో ఇబ్బంది ఉందని అసలు విషయం చెప్పారు. నెల రోజుల పాటు కరీంనగర్లోని ప్రైవేట్ దవాఖానలో చికిత్సకు రూ.6లక్షల వరకు ఖర్చు చేశారు. ఆ తర్వాత ఎవరూ పట్టలేదు. తప్పని పరిస్థితిల్లో హైదరాబాద్కు తీసుకవెళ్తే బ్రెయిన్ ట్యూమర్ వ్యాధిగా నిర్ధారించారు. పాప శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందని గ్రహించి గొంతుకు రంధ్రం చేసి కృత్రిమ శ్వాస అందిస్తున్నారు.
మెరుగైన వైద్యం చేయిద్దామంటే చేతిలో డబ్బులు లేక పాపను తీసుకొని ఇంటికి వచ్చారు. వారం వారం దవాఖానకు తీసుకవెళ్లి పాపను బతికించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు చికిత్స కోసం రూ.15లక్షల వరకు ఖర్చు చేశారు. గోదావరిఖనికి చెందిన నీడ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు పల్లెర్ల రమేశ్ గౌడ్, సభ్యుడు పవన్ రూ. లక్ష దాకా ఆర్థిక చేయూతనందించారు. అయితే బిడ్డ దయనీయస్థితిని చూసి మెరుగైన వైద్యమందించలేక కన్నీళ్లపర్యంతమవుతున్నారు. దాతలు దయతలచి పాప వైద్యానికి సాయం చేయాలని చేతులు జోడించి వేడుకుంటున్నారు. సాయం చేయాల్సి వారు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతా నంబర్ 006810100135507 (బెల్లంపల్లి)లో జమచేయాలని, 8179385410 ఫోన్ పే నంబర్ ద్వారా నగదు అందజేయాలని అర్థిస్తున్నారు.