అభివృద్ధిని ఏనాడైనా పట్టించుకున్నడా?
స్వప్రయోజనాలే చూసుకున్నడు
పాదయాత్ర ఎందుకు చేస్తున్నడో చెప్పాలి
పేదల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ పెంచిండు
ఆలోచించండి..అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాం lమంత్రి గంగుల కమలాకర్
హుజూరాబాద్, జూలై 25: అభివృద్ధి విషయంలో బీజేపీ నేత ఈటల రాజేందర్వి అన్నీ తప్పులేనని, ఏ రోజూ ఇక్కడి ప్రజల గురించి, పనుల గురించి ఆలోచించలేదని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. పదిహేడేండ్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రి గా ఉండి కూడా అభివృద్ధిని ఏనాడూ పట్టించుకోలేదని, స్వప్రయోజనాలే లక్ష్యంగా పనిచేశారని మండిపడ్డారు. ఆత్మగౌరవం అంటూ మాట్లాడుతున్న ఈటల.. పాదయాత్ర ఎందుకు కోసం చేస్తున్నాడో చెప్పాలని ప్రశ్నించారు. సానుభూతి కోసం తప్ప, ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడానికి ఎంత మాత్రం కాదని ఎద్దేవా చేశారు. ఇన్నేండ్ల కాలంలో ఏ ఒక్కరోజూ ప్రజలపై కనిపించని ప్రే మ కొత్తగా ఎందుకు పుట్టుకువచ్చిందో అర్థం చేసుకోవాలని సూచించారు. ఆదివారం హుజూరాబాద్ పట్టణంలోని సిటీ సెంట్రల్ హాల్లో కేబుల్ ఆపరేటర్లు, రజక, హమాలీ, టీఆర్ఎస్యూత్ నాయకుల సమావేశంలో మాట్లాడారు. ఇన్నాళ్లూ హుజూరాబాద్ ప్రాంత అభివృద్ధిని మరిచిన ఈటల, ఒకవేళ గెలిస్తే ఏం చేస్తాడో చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్కు ఓటు వేస్తే అభివృద్ధికి పట్టం కట్టినట్లేనని, బీజేపీ వైపు మొగ్గు చూపుతే అభివృద్ధి అగిపోతుందని సూచించారు. బడుగు జీవుల ఆత్మగౌరవాన్ని పెంచేందుకు సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేశారని, ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడని గుర్తు చేశారు.
అన్నివర్గాలకూ ప్రాధాన్యం..
రాష్ట్రంలో అన్నివర్గాలకు సీఎం కేసీఆర్ సమ ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. ఈటల ఆత్మగౌరవం అని మాట్లాడడం ఒట్టి బూటకమని, అందరి ఆత్మగౌరవమే కేసీఆర్ లక్ష్యమని, ప్రతి కు లానికి ఆత్మీయ భవన నిర్మాణానికి నిధులు, స్థలం ఇచ్చి తన యొక్క చిత్తశుద్ధిని చాటుకున్నారని కొనియాడారు. నియోజకవర్గ అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగలేదని, టీఆర్ఎస్ను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామని స్పష్టం చేశారు.
రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తాం
ఉప ఎన్నికల్లో ఆశీర్వదిస్తే రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామని, అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తామన్నారు. మన రాష్ట్రంలోని రైతు బంధు, రైతు బీమా, 24గంటల కరెంటును బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు ప్రవేశపెట్టలేదో ప్రజలకు వివరించి ఓట్లు అడిగే దమ్ము వాళ్లకు ఉందా చెప్పాలని ప్రశ్నించారు. పేద ప్రజల కోసం ఎన్నో పథకాలు అందిస్తున్న కేసీఆర్ అడుగుతుంది కేవలం ఒక ఓటు మాత్రమేనని, అందరూ కట్టుబడి ఉండి కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్రూం అందిస్తామని ఈసందర్భంగా కేబుల్ ఆపరేటర్లకు హామీ ఇచ్చారు. అదేవిధంగా పోలు ట్యాక్స్ రద్దు విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తానని పేర్కొన్నారు. సమావేశంలో మేయర్ సునీల్రావు నాయకులు పొనగంటి మల్లయ్య, తాళ్లపల్లి శ్రీనివాస్, రమేశ్, టంగూటూరి రాజ్కుమార్ సుబ్రమణ్యం ఉన్నారు.