సిరిసిల్ల: బీఆర్ఎస్ ప్రభుత్వంలో నేత కార్మికులకు ఉపాధి ఉండేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఇప్పుడు నేతన్నలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ వల్ల తెలంగాణకు ఒక్క రూపాయి కూడా లాభం జరుగలేదని విమర్శించారు. పార్టీ నేతలు తుల ఉమ, సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ కలిసి సిరిసిల్ల పట్టణంలో కేటీఆర్ ఎన్నికల ప్రచారం చేశారు. కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ను గెలిపించాలని కోరారు. సిరిసిల్లలో బీజేపీ ఏం అభివృద్ధి చేసిందే చెప్పాలన్నారు. మతం పేరుతో రాజకీయం చేసేవాళ్లను నమ్మొద్దని, వారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఇంతకు ముందు బ్రిడ్జి కింద నీళ్లు ఉండేవని, కాంగ్రెస్ వచ్చింది నీళ్లు లేకుండా పోయాయని విమర్శించారు. కాళేశ్వరం, మిడ్మానేరు ప్రాజెక్టులను కట్టించింది కేసీఆరేనని గుర్తుచేశారు.
అంతకు ముందు పట్టనంలోని రైతుబజార్లో ప్రచారం నిర్వహించారు. రైతులు, వ్యాపారులతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తాము కూర్చుని కూరగాయలు అమ్ముకునేలా షెడ్లు, మంచినీటి సౌకర్యం కల్పించాలని రైతులు కోరారని చెప్పారు. దీంతో 24 గంటల్లోపు వారికి తాత్కాలిక వసతి కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుందని, కేసీఆర్ ప్రభుత్వం పోయిన తర్వాత తమ వాగుల్లో నీళ్లు పోయాయని, ఓ నెల పింఛన్ కూడా రాలేదని ఆవుదర వ్యక్తంచేశారని తెలిపారు. మళ్లీ కేసీఆర్ వస్తేనే పేదలకు బాగుంటుందని అంతా అన్నారని చెప్పారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తమను పట్టించుకోవడం లేదని రైతులు వాపోయారని, రుణమాఫీ జరగలేదని, రైతుబంధు ఇంకా సరిగా రాలేదన్నారని తెలిపారు. వారి స్పందన చూస్తుంటే కరీంనగర్ ఎంపీగా బోయినపల్లి వినోద్ మంచి మెజార్టీతో గెలుస్తారని నమ్మకముందని చెప్పారు.