శ్రీనగర్: జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదాను రద్దు చేయకపోవడం, రాష్ట్ర హోదాను కేంద్రం తొలగించకపోయి ఉంటే పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) ప్రజలు జమ్ముకశ్మీర్లో విలీనం కావడానికి తిరుగుబాటు చేసేవారని అన్నారు. (Omar Abdullah) శనివారం శ్రీనగర్లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో ఒమర్ అబ్దుల్లా మాట్లాడారు. 1947లో పాకిస్థాన్ నుంచి దండెత్తి వచ్చిన గిరిజన దుండగులకు వ్యతిరేకంగా పోరాడి, భారతదేశంలో భాగం కావాలని ఎంచుకున్న కశ్మీర్ ప్రజల నిర్ణయాన్ని పీవోకేలోని ప్రస్తుత పరిస్థితులు సమర్థిస్తున్నాయని తెలిపారు. ప్రజాస్వామ్య హక్కులను కోరినందుకు పీవోకేలో డజన్ల కొద్దీ ప్రజలు మరణించారని, వందలాది గాయపడటం, జైలు పాలు కావడం తనను తీవ్రంగా బాధించిందని చెప్పారు.
కాగా, 1947లో భారత సైన్యం కశ్మీర్కు రాకముందే, పాకిస్థాన్ దుండగులకు వ్యతిరేకంగా పోరాడి, తమ మాతృభూమిని కాపాడుకోవడానికి కశ్మీర్ ప్రజలకు నాయకత్వం వహించిన తన తాత, జమ్ముకశ్మీర్ మొదటి ప్రధానమంత్రి షేక్ మహమ్మద్ అబ్దుల్లాకు ఒమర్ అబ్దుల్లా నివాళులర్పించారు. ఇప్పుడు సరిహద్దు అవతల పరిస్థితిని చూసినప్పుడు, ‘దాడి చేసేవారికి జాగ్రత్త, మేం కశ్మీరీలం సిద్ధంగా ఉన్నాం’ అని మన పూర్వీకులు చెప్పింది నిజమేనని తనకు అర్థమవుతోందని తెలిపారు. ‘పీవోకేలోని పరిస్థితిని చూసి నాకు చాలా బాధగా ఉంది. 2019లో జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదా, ప్రత్యేక హోదాను రద్దు చేయకపోయి ఉంటే, ఈ రోజు పీవోకే ప్రజలు జమ్ముకశ్మీర్లో తమ పునరేకీకరణ కోసం తిరుగుబాటు చేసేవారని నేను ఖచ్చితంగా చెప్పగలను’ అని అన్నారు. ఎప్పటికైనా ఈ సీట్లు భర్తీ అవుతాయనే ఆశతో అసెంబ్లీలో అవతలి పక్షం కోసం ఆ సీట్లను ఖాళీగా ఉంచినట్లు స్పష్టం చేశారు.
మరోవైపు 2019 ఆగస్ట్ 5న కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదా, ఇతర రాజ్యాంగ హామీల పునరుద్ధరణపై పోరాడటానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఒమర్ అబ్దుల్లా పునరుద్ఘాటించారు. ఈ లక్ష్యాలను నెరవేర్చడానికి తాము కృషి చేస్తామని ఆయన అన్నారు.
#WATCH | Srinagar: In his Independence Day address, Jammu and Kashmir Chief Minister Omar Abdullah says, “… .When I look across the border and across the Line of Control (LoC) today at their prevailing conditions, I realise that the decision taken by our leaders for us 80 years… pic.twitter.com/kefwGGyxIy
— ANI (@ANI) August 15, 2026