కరీంనగర్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పదేండ్ల కిందటి చీకటి రోజులు మళ్లీ వస్తాయని జిల్లా రైతులు అంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ కోసం తాము పడ్డ కష్టాలను ఇప్పటికీ మర్చిపోలేక పోతున్నామని స్పష్టం చేస్తున్నారు. దొంగ రాత్రి కరెంట్ ఇస్తే చలనకా, వాననకా బాయిల కాడనే పడుకునెటోళ్లమని, పాములు కుట్టి, కరంట్ షాకులు కొట్టి ఎంతో మంది చనిపోయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. పదేండ్ల కింద అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఒక్కనాడన్నా తమ గురించి పట్టించుకోలేదని, ఎట్లున్నరు.. ఎట్ల బతుకుతున్నరని ఒక్కనాడన్నా అడిగింది లేదని వాపోతున్నారు.
ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అలాంటి పరిస్థితులు పునరావృతం అవుతాయని అంటున్నారు. అలాంటి చీకటి రోజులు తలుచుకుంటే భయమేస్తున్నదని ఆందోళన చెందుతున్నారు. 24 గంటల కరెంట్, ఏటా రెండు పంటలకు సరిపడా నీళ్లు, పెట్టుబడికి రైతుబంధు, దురదృష్ట వశాత్తు ఎవరైనా రైతు చనిపోతే రూ.5 లక్షల బీమా సదుపాయం కల్పించిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో తమకు జరుగుతున్న ప్రయోజనాలపై చర్చించుకుంటున్నారు. ఎట్టి పరిస్థితిలో కాంగ్రెసోళ్లను నమ్మేదే లేదని, నమ్మితే గోస పడుతామని చెబుతున్నారు. తమకు అన్ని విధాలుగా అండగా ఉంటున్న బీఆర్ఎస్కే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.
కాంగ్రెస్ పొరపాటున అధికారంలోకి వస్తే ఇక కరెంట్ కోసం గతంలోలాగా రోజంతా ఎదురు చూడాల్సిందే. గతంలో వ్యవసాయం కోసం మోటరు పంపుసెట్లు పనిచేయక, సింగిల్ ఫేజ్ కరెంట్తో బావుల వద్ద ఎన్నో తిప్పలు పడ్డం. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కరెంట్ పుల్లుగా ఉంటున్నది. సీఎం కేసీఆర్ సారు పుణ్యాన కరెంట్ కష్టాలు తీరాయి. 24 గంటలు విద్యుత్ ఇస్తున్నరు. నాకు 4 ఎకరాల భూమి ఉన్నది. పొద్దున్నే పొలం కాడ మోటరు చాలు చేసి వస్తే మధ్యాహ్నం కల్లా చెలక మొత్తం పారుతది. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సమయంలో గ్రామాలకు వచ్చి అది చేస్తాం.. ఇది చేస్తమని గొప్పలు చెప్పుకుంటున్రు. వారి మాటలను నమ్మితే మోసపోతం. ఆగం పట్టిస్తరు. మూడు గంటల కరెంట్ ఇస్తే ఏ మూలన పారుతది. కాంగ్రెస్ వస్తే మళ్లీ పాతరోజులే. తిరిగి కేసీఆర్ సరారే రావాలి. సారే సీఎం కావాలి.
– బొల్లపెల్లి రమేశ్, రైతు, పెద్దపల్లి, జమ్మికుంట మండలం(హుజూరాబాద్టౌన్)
తెలంగాణ సర్కారు 24 గంటల కరెంటు ఇత్తుంది. ఏడాది పొడవునా పంటలకు నీళ్లు ఇత్తుంది. పండిన ధాన్యం ప్రభుత్వమే కేంద్రాలు పెట్టి మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నది. కాంగ్రెస్ గవర్నమెంటు ఉన్నప్పుడు రాత్రి పూట కరంటు అత్తుండె, వానకాలంలో మాత్రమే పంటలు వేసి, యాసంగిల భూములను బీడు పెట్టిన విషయాన్ని మరచిపోలేదు. అప్పుడు రాత్రిపూట బాయిలకాడికి పోయేటోళ్లం. రైతులకు మంచి చేసే కేసీఆర్ సారునే మేము నమ్ముతం. 10 హెచ్పీ మోటర్లు పెట్టాలె, మోటర్లకు మీటర్లు పెడుతమని వ్యవసాయాన్ని ఆగం పట్టించి, రైతులను నట్టేట ముంచే కాంగ్రెస్, బీజేపీలను అసలే నమ్మం. ఎప్పటికి మా గుండెలో ఉండేది సీఎం కేసీఆర్ సారే.
– గడ్డం స్వామి, బూరుగుపల్లి (గంగాధర)
వ్యవసాయంపై కనీసం అవగాహన లేని కాంగ్రెస్ నాయకులు కరెంట్పై మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. 10హెచ్పీ మోటర్ బిగిస్తే బోర్లు ఎండిపోతయ్. కాంగ్రెస్ నాయకులు వ్యవసాయంల బాధలు తెల్వదు.10 హెచ్పీ మోటర్లతో ట్రాన్స్ఫార్మర్పై లోడ్ పడి పేలిపోయే ప్రమాదం ఉంది. సీఎం కేసీఆర్ పుణ్యమా అని 24 గంటల కరెంటు వస్తుంది. మూడు గంటల కరెంట్ వ్యవసాయానికి సరిపోతుందా? కాల్వ కూడా సాగది. పొలం ఎలా పారుతుంది. 10 హెచ్పీ మోటర్ను ఏ ప్రాంతంలో వాడరు. కాంగ్రెస్ ఓటు వేస్తే కష్టాలు కొని తెచ్చుకున్నట్లే.
– బండిపెల్లి గణేశ్, రైతు, పారువెల్ల (గన్నేరువరం)
మాకు చెర్లపల్లె దారిపొన్న ఐదెకరాల పొలం ఉంది.. నా చిన్నప్పటి సందె రాత్రిపూట బాయికాడికి పోయెటోన్ని. ఇప్పుడైతే బాయి ఉంది కానీ, అప్పట్లో లేకుండె.. వాగులకెంచి లైనేసినం.. నీళ్లు ఎల్లకపోయేది.. జేసీబీ పెట్టి తోడిస్తే ఓ గంట సేపు పంపువోసేది.. గప్పట్ల రాత్రి కరెంటు ఇస్తున్న టైంల ఇద్దరం ముగ్గురం కలిసి బాయిలకాడికి పోయెటోళ్లం.. దారిలో గుడ్డెలుగులు కనపడేవి.. భయంతో ఉరికెటోళ్లం.. మల్లా తర్వాత రోజు రాత్రి బాయికాడికి పోవాలంటే భయంతో వణికిపోయెటోళ్లం.. అప్పుడప్పుడు దారిలో పురుగుబుషి కనిపిస్తుండేవి.. కరెంటచ్చెదాకా వరి గడ్డేసుకుని, దానిపై సంచేసుకుని అక్కన్నే పడుకునెటోళ్లం.. కరెంటు ఎప్పుడస్తదో తెల్వని రోజులవి.
ఓ రోజు 11 గంటలకు, ఓ రోజులు 12 గంటలకు, ఇంకో రోజు 3 గంటలకు వచ్చేది.. ఒక్కోసారి ఎప్పుడిస్తరో కూడా తెల్వకపోయేది. ఇగ అందరు ఒక్కసారే కరెంటు పెట్టేసరికి లోవోల్టేజీతో మోటర్లు కాలిపోయేవి.. ఇన్ని గండాల నడుమ పాణాలు అరచేతిల పెట్టుకొని ఎవుసం చేసేది.. ఇప్పుడు 24 గంటల కరెంటు ఇస్తండ్రు.. రైతులం అందరం సంతోషంగా ఉన్నం.. ఆటోమేటిక్ స్టాటర్లు వచ్చినంక కరెంటు పెట్టచ్చి ఇంట్ల కూసుంటున్నం.. కాంగ్రెస్ వచ్చేది లేదు.. సచ్చేది లేదుగనీ, మూడు గంటల కరెంటు ఇస్తరట.. అది ఏ మూలకు సరిపోద్ది.. ఒక మడి పొలంకూడా పారది.. ఇక 10 హెచ్పీ మోటర్లు ఎవలు కొనిస్తరో వాళ్లే చెప్పాలె..
– బక్కి రాజేంద్రప్రసాద్, రైతు, కేశవపట్నం (శంకరపట్నం)
నాడు సమైక్య రాష్ట్రంల రాత్రి పూట కరెంటు ఇచ్చేటోళ్లు. ఆ కరెంటుతో పొలం సక్కగ పారకపోయేది. తెలంగాణ వచ్చినంక సీఎం కేసీఆర్ 24 గంటల కరెంటు ఇచ్చినంక పంటలు మంచిగ పండుతున్నయ్. ఎవుసానికి 3 గంటల కరెంటు సాలు. 10 హెచ్పీ మోటర్లు పెట్టుకుంటే మొత్తం పారుతది అని కాంగ్రెసోళ్లు అంటన్రు.. అసలు ఎవుసానికి 10 హెచ్పీ మోటర్లు వాడుతరా?. అసలు వాటికి ఎంతయితదో వాళ్లకు తెలుసా? ఆ పార్టీ వచ్చేది లేదు.. సచ్చేది లేదు గానీ, నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నరు. అంత పెద్ద మోటర్లు, వాటికి పైపులు కొనాలంటే లక్షలు ఖర్చయితయ్. అదంతా ఎవరిస్తరు. ఆ మోటర్లు వాడితే ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవా?. గీ కాంగ్రెసోళ్లకు ఈ మాత్రం సోయి లేదా?. రైతుల్ని అమాయకుల్ని చేసి, ఏదో కాంట్రాక్టర్తో కుమ్ముక్కయి ఇట్లాంటి కరెంటు మోటర్లు తేవాలని చూస్తన్రు. ఎవుసం చేసెటోళ్లయితే దాని గురించి తెలిసేది. అసలు వాళ్లకేం తెలుసు. ఇట్లాంటోళ్లకు పాలనపగ్గాలు ఇస్తే ఆగమమవుడే. గిసోంటోళ్లకు ఓట్లు వేస్తే మన బతుకులు కుక్కలు చింపిన విస్తరే.
– నల్ల గోవిందరెడ్డి, రైతు, మద్దికుంట(మానకొండూర్రూరల్)
మూడు గంటలు కరంటు ఇస్తే ఎవుసం బంద్ చేసుకోవాల్సిందే. గతంలో రాత్రి పూట కరంట్ల కాడికి పోయి నానా కష్టాలు పడ్డాం. తెలంగాణ వచ్చినంకనే 24 గంటల కరంటు వచ్చింది. ఎవుసం పండుగలా ఉంది. రేవంత్రెడ్డి 10హెచ్పీ మోటర్లు పెట్టుకుంటే గంటకు ఎకురం పారుతుందనడం ఎంత వరకు సమంజసం. నాకు 22 ఎకరాలు ఉంది. రెండు 5హెచ్పీ మోటర్లు నడిస్తేనే సరిపోతలేవు. మూడు గంటలైతే ఎకరం కూడా పారదు. కాంగ్రెస్ పార్టీ వాళ్లకు సోయి లేకుండా మాట్లాడుతున్నరు. కాంగ్రెస్ పాలనలో ఎన్ని ఇబ్బందుల పడ్డమో. తెలంగాణ వచ్చినంక అంతా సుఖంగా ఉంటున్నాం.
-మూల చంద్రశేఖర్రెడ్డి, రైతు, పోతిరెడ్డిపేట (హుజూరాబాద్ రూరల్)