జరిమానాలు విధించాలంటూ పోలీస్ శాఖకు ఆదేశాలు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న డ్రైవ్
నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై నిఘా
రూ. 1000 ఫైన్.. స్పందించని వారిపై కేసులు
ఉమ్మడి జిల్లాలో 2061 మందికి.. రూ. 20.61 లక్షల జరిమాన
నిర్మల్ అర్బన్/ఎదులాపురం, ఏప్రిల్ 13: రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతుండగా, రాష్ట్ర సర్కారు అప్రమత్తమైంది. ఓ వైపు వైరస్ కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకుంటూనే నిబంధనలు కఠినతరం చేసింది. మాస్కులు ధరించని వారికి రూ.1000 జరిమానా విధించాలని నిర్ణయించడంతోపాటు నిర్లక్ష్యం చేస్తే ప్రాసిక్యూషన్ చేయాలంటూ కలెక్టర్లు, అధికారులకు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుండగా, ఇప్పటి వరకు 2,061 మందికి రూ.20.61 లక్షల ఫైన్ వేశారు.
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. వైర స్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ఈ మేరకు టెస్టుల సంఖ్యను రెట్టిం పు చేయడంతో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. మరోవైపు వైరస్ అడ్డుకట్టకు వ్యాక్సిన్, మాస్కే ప్రధాన అస్ర్తాలు కావడంతో ఆ దిశగా చర్యలు చేపడుతున్నది. వ్యాక్సిన్తో కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ప్రజలను చైతన్య పరుస్తున్నది. ఇక ప్రజల్లో ఏమవుతుందిలే అన్న నిర్లక్ష్యం వల్ల రోజు రోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుండగా, మాస్కు ముఖ్యమని గ్రహించి నిబంధనలు కఠినతరం చేసింది.
బేఖాతర్ చేస్తే అంతే..
ప్రభుత్వం మాస్కులు ధరించాలని ప్రజలకు పదేపదే చెబుతున్నా.. కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో మాస్కులు ధరించని వారికి రూ.1000 జరిమానా విధించాలని సూచించింది. అయినా వినకపోతే.. వ్యాధుల నియంత్రణ చట్టంకింద కేసులు నమోదు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నది. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ -2005లోని 51-60 సెక్షన్ల వరకు, ఐపీసీ 188 సెక్షన్ ప్రకారం ప్రాసిక్యూషన్ తప్పదని స్పష్టం చేసింది. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అధికార యంత్రాంగం విజ్ఞప్తి చేస్తున్నది. ఇందులో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆయా చోట్ల అవగాహన కల్పిస్తున్నారు. వైరస్ నివారణకు తమకు సహకరించాలని కోరుతున్నారు. మాస్కులు అందించి బాధ్యతను గుర్తు చేస్తున్నారు. దుకాణాలకు వచ్చినప్పుడు మాస్కులు ఉన్నవారికే వస్తువులు ఇవ్వాలని యజమానులు, మాస్కు ఉన్నవారినే ఎక్కించుకోవాలని వాహనదారులకు సూచిస్తున్నారు. మాస్కులు లేకుండా రోడ్లపైకి వచ్చే వారికి జీవో నంబర్ 82 ఉత్తర్వుల ప్రకారం ఈ చలాన్ ద్వారా రూ.1000 జరిమానా విధిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో 2061 మందికి జరిమానా..
మాస్కులు ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగేవారిపై ప్రభుత్వం కొరఢా ఝుళిపిస్తున్నది. ఇప్పటి వరకు మంచిర్యాల జిల్లాలో 1201 మందికి, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 540 మందికి, ఆదిలాబాద్ జిల్లాలో 70 మందికి, నిర్మల్ జిల్లాలో 250 మందికి జరిమానా విధించారు. మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2061 మందికి రూ. 1000 చొప్పున రూ. 20 లక్షల 61 వేలు ఫైన్ వేశారు.
మూడు విధాలా కేసులు..
ప్రభుత్వ ఆదేశాల మేరకు మాస్కులు లేకుండా తిరుగుతున్న వారిపై పోలీసులు, అధికారులు కొరఢా ఝులిపిస్తున్నారు. స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తూ ఈ- చలాన్, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్టు, పిటీ కేసులు నమోదు చేస్తున్నారు.
మాస్క్ తప్పనిసరి
కొవిడ్ నిబంధనలు ప్రజలందరూ తప్పకుండా పాటించాలి. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటించాలి. బయటకు వెళ్లేటప్పుడు మాస్కు తప్పనిసరిగా ధరించాలి. లేదంటే రూ.1000 ఫైన్ విధించడం జరుగుతుంది. నిర్మల్ జిల్లాలో ఇప్పటి వరకు 250 మందికి జరిమానా విధించాము. నిర్లక్ష్యంగా వ్యవహరించే వ్యక్తులు, వ్యాపార సంస్థల యజమానులపై కేసులు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం.