బీజేపీలో చేరడంపై సమాధానం చెప్పాలి
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆగ్రహం
కమలాపూర్, జూన్ 18 : పదవులను అడ్డుపెట్టుకుని అక్రమంగా ఆస్తులను కూడబెట్టుకున్న ఈటల రాజేందర్ తెలంగాణ ద్రోహిగా మిగిలారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలోని ఉప్పల్, ఉప్పలపల్లి, భీంపల్లి, గుండేడు, కొత్తపల్లి, కన్నూరు గ్రామాల్లో టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కన్నతల్లి లాంటి పార్టీకి ఈటల రాజేందర్ ద్రోహం చేయడమే కాకుండా నమ్ముకున్న ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ప్రజలకు సమాధానం చెప్పే దమ్ములేక ఆస్తులను కాపాడుకునేందుకు బీజేపీలో చేరారని, ఇది సిగ్గుచేటని విమర్శించారు. నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులు మంజూరు చేస్తే క్షేత్రస్థాయిలో పనులు పూర్తి చేయకుండా వదిలేసిన ఈటల ఏ ముఖం పెట్టుకుని గ్రామాలకు వెళ్లి ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. గ్రామాల్లో సమస్యలు పరిష్కరించాలని దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయని, వీటి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ను అడిగితే కాదన్నారని ఏనాడైనా రాజీనామా చేసినవా? ఎమ్మెల్యే పదవికి ఎందుకు రాజీనామా చేసినవో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. “టీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తానని అక్కడక్కడ అంటున్న నీవు టీఆర్ఎస్ పార్టీ నీకు ఏం చేసింది చెప్పాలి. నీ కెందుకు ఓట్లు వేయాలి? నీ ఆస్తులు పోతున్నాయని వేయా ల్నా?, నీవు జైలుకు పోతున్నవని వేయాల్నా?’ అని ప్రశ్నించారు. ‘సీఎం కేసీఆర్ రైతుబంధు ఇస్తే రైతులకు ఆత్మగౌరవం పెంచినట్టు కాదా? పేదింటి ఆడపిల్ల పెండ్లికి లక్ష రూపాయలు ఇచ్చి ఆదుకుంటే ఆత్మగౌరవం నిలిపినట్టు కాదా? రైతు చనిపోతే రూ.5 లక్షల బీమా ఇచ్చి ఆసరాగా నిలిస్తే ఆత్మగౌవరం కల్పించినట్టు కాదా?. ఆత్మవిమర్శ చేసుకోవాలి’ అని సూచించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు పెట్టి ఆదుకుంటున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ సుధీర్కుమార్, మండల ఇన్చార్జి పేర్యాల రవీందర్రావు, సింగిల్ విండో చైర్మన్ సంపత్రావు, సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.