సర్కారు బడులు ఇక సౌర విద్యుత్ వెలుగులు రానున్నాయి. బడులకు కరెంటు బిల్లులు పెనుభారమవుతుండడం.. కంప్యూటర్లు, లైట్లు, నీటి సరఫరాకు వినియోగించే బోరు మోటర్లతో బిల్లుల కట్టలేక నిర్వహణ కష్టంగా మారడంతో ప్రతి పాఠశాలకు సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు తొలి విడుతలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో 18 పాఠశాలలను ఎంపిక చేయడమే కాకుండా, రూ.30 లక్షలు కేటాయించింది. పనుల ప్రారంభానికి సన్నాహాలు చేస్తుండగా, ఈ బాధ్యతలను తెలంగాణ రాష్ట్ర పునరుద్ధనీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ లిమిటెడ్(టీఎస్రెడ్కో)కు అప్పగించింది.
రాజన్న సిరిసిల్ల, జనవరి 1 (నమస్తే తెలంగాణ) : సమైక్య పాలనలో నిధుల లేమి, నిర్వహణ లోపంతో విద్యారంగం నిర్వీర్యమైంది. విద్యార్థులు లేక అనేక పాఠశాలలు మూతపడ్డాయి. విద్యాసంవత్సరం ప్రారంభమైనా సమయానికి పుస్తకాలు అందక, మౌలిక వసతులు లేక విద్యార్థులు చదువులో బాగా వెనుకబడి పోయారు. దీంతో పిల్లల తల్లిదండ్రులు ప్రైవేట్ సూళ్లలో చేర్పించేందుకు మొగ్గు చూపారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యారంగంలో సమూల మార్పులు తెచ్చింది. విద్యార్థుల సంఖ్య పెంచేందుకు మధ్యాహ్న భోజనం, యూ నిఫాం, సమయానికి పాఠ్యపుస్తకాలు అందించింది. కార్పొరేట్కు దీటుగా బడుల నిర్మాణం చేపట్టి, మౌలిక సదుపాయాలు కల్పించింది. అన్ని పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టి విద్యార్థులంతా సర్కారు బడిబాట పట్టేలా చేసింది. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో చాలా బడుల్లో ఇప్పుడు సీట్లు దొరకని పరిస్థితి నెలకొంది. అంతే కాకుండా, ‘మన ఊరు – మనబడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నది.
పాఠశాలలకు సౌరకాంతులు
విద్యుత్ బిల్లుల భారం తగ్గించేందుకు ప్రతి పాఠశాలకు సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు తొలి విడతలో 18 పాఠశాలలను ఎంపిక చేయగా, వీటి బాధ్యతను టీఎస్ రెడ్కోకు అప్పగించింది. సిరిసిల్ల అర్బన్లో కుసుమ రామయ్య, బాలికల ఉన్నత పాఠశాల, వెంకంపేట, రాజీవ్నగర్, తంగళ్లపల్లి, ముస్తాబాద్, గూడెం, గంభీరావుపేట, లింగన్నపేట, కొత్తపల్లి, ఎల్లారెడ్డిపేట, వెంకటాపూర్, బొప్పాపూర్, రుద్రంగి, వీర్నపల్లి, రుద్రంగి, వేములవాడ జడ్పీహెచ్ఎస్ బాలికలు, వేములవాడ హెచ్ఎస్ను ఎంపిక చేశారు.
ఒక్కో యూనిట్కు రూ.1.59 లక్షలు
ప్రభుత్వం నిర్మిస్తున్న సౌర విద్యుత్ ఒక్కో యూనిట్కు రెండు కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీని ఏర్పాటుకు రూ.లక్షా 59 వేల 600కు పైగా ఖర్చు పెడుతున్నది. ఇలా జిల్లా వ్యాప్తంగా 18 పాఠశాల్లో ఏర్పాటుకు సుమారు రూ.30 లక్షల వరకు ఖర్చు చేయనున్నారు. భవిష్యత్తులో అన్ని పాఠశాల్లో దశల వారీగా ఏర్పాటు చేయనున్నది. 2 కిలోవాట్లతో రోజుకు 8 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కానున్నది. నెట్ మీటరింగ్ సిస్టం ద్వారా పాఠశాల అవసరాలకు పోను మిగతా కరెంటు పవర్గ్రిడ్కు అనుసంధా నించనున్నారు. ఇలా వెళ్లిన విద్యుత్ను నెలనెలా లెక్కించి, ఆరు నెలలకోసారి యూనిట్కు రూ.4.25 చొప్పున పాఠశా లకు చెల్లిస్తారు. అందు కోసం నెట్మీట రింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు.
ఏర్పాట్లు చేస్తున్నాం
రాజన్న సిరిసిల్ల జిల్లాలో సోలార్ విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా 18 పాఠశాలలను ఎంపిక చేశాం. ప్రతి పాఠశాలలో ఒక్కో యూనిట్ ద్వారా రెండు కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. యూనిట్ల పనులు త్వరలో ప్రారంభిస్తాం. సోలార్ విద్యుత్ ఉత్పత్తితో పాఠశాలలకు కరెంటు బిల్లుల భారం తప్పుతుంది. దశలవారీగా అన్ని పాఠశాలల్లో ఈ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం.
– పరమాచారి, టీఎస్ రెడ్కో సంస్థ జిల్లా మేనేజర్