వేములవాడ రూరల్, జనవరి 18: ఆర్టీసీ బస్సు, కారు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో 16 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మరో ఆరు నెలల పసిపాప తీవ్ర గాయాలపాలై దవాఖానలో చికిత్స పొందుతున్నది. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం పోశెట్టిపల్లి-నాగాయ్యపల్లి గ్రామాల మధ్య బుధవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్మూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో వేములవాడ నుంచి ఆర్మూర్కు వెళ్తున్నది. పోశెట్టిపల్లి- నాగయ్యపల్లి గ్రామాల మధ్య కథలాపూర్ నుంచి వేములవాడకు వేగంగా వస్తున్న కారు బస్సును ఢీకొన్నది. దీంతో బస్సు వెనుక చక్రాలు ఊడిపోయి రోడ్డుపై పడిపోయాయి. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 13 మంది, కారులో వెళ్తున్న నలుగురిలో ముగ్గురు సల్పగాయాలతో బయటపడ్డారు. ఆరు నెలల పాప కాలుకు తీవ్రగాయమైంది. అదే సమయంలో చందుర్తి నుంచి వేములవాడకు వెళ్తున్న చందుర్తి సీఐ కిరణ్కుమార్ తన వాహనంలో క్షతగాత్రులను వేములవాడ ఏరియా దవాఖానకు తరలించారు.