జిల్లా విద్యాశాఖాధికారులు, పంతుళ్ల మధ్య సాగుతున్న పంతాలు ప్రధానోపాధ్యాయులకు శాపంగా మారుతున్నాయి. సర్దుబాటు, డిప్యూటేషన్లు, బదిలీలు చేసినా పలువురు ఉపాధ్యాయులు విధుల్లో చేరకపోవడంతో ఆయా పాఠశాలల్లో పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి. దీంతో సంబంధిత హెచ్ఎంలు అగచాట్లు పడుతున్నారు. ప్రధానంగా పదో తరగతి పరీక్షలు దగ్గరపడుతున్నా కొద్దీ ఆయా సబ్జెక్టులు బోధించేవారు లేక.. అసలు వస్తారో.. రారో.. తెలియక ఆందోళన చెందుతున్నారు.
ఇదే సమయంలో కొంత మంది టీచర్లు ఉపాధ్యాయ సంఘాల అండతో వక్రమార్గం పడుతుండగా.. మరికొంత మంది పంతాలకు పోతూ పైరవీలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నిర్భయంగా చర్యలు తీసుకోవాల్సిన విద్యాధికారులు వెనుకంజ వేస్తున్న తీరు తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. మొత్తంగా ఉన్నత పాఠశాలలపై ప్రభావం పడుతుండగా, ఆయా స్కూళ్ల హెచ్ఎంలు సమిధలు కావాల్సి వస్తున్నది.
కరీంనగర్, జనవరి 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఒక ఉన్నత పాఠశాలలో 160పైగా విద్యార్థులున్నారు. ఇక్కడ హిందీ బోధించే ఉపాధ్యాయుడు బదిలీ అయ్యారు. అలాగే ఆంగ్లంలో బోధించే మరో ఉపాధ్యాయుడిని ఫారిన్ సర్వీస్ కింద కంటిన్యూ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ (సీపీడీ) సెల్కు తీసుకున్నారు. దీంతో ఈ పాఠశాలలో ప్రధాన సబ్జెక్టులు బోధించే ఇంగ్లిష్, హిందీ టీచర్లు లేక నెలలు గడుస్తున్నా.. రీప్లేస్మెంట్ చేయడం లేదు.
ఇది మచ్చుకు మాత్రమే. అలాగే, కరీంనగర్ జిల్లాలో వివిధ అవసరాల కోసం గత నవంబర్, డిసెంబర్లో 72 మంది ఉపాధ్యాయులకు సర్దుబాటు కింద ఆర్డర్స్ ఇచ్చారు. సంబంధిత పంతుళ్లు తక్షణమే విధుల్లో జాయిన్ కావాలని ఆదేశించారు. అయినా 33 మంది ఉపాధ్యాయులు విద్యాశాఖ ఉత్తర్వులను పట్టించుకోలేదు. వారికి కేటాయించిన స్థానాల్లో జాయిన్ కాలేదు. దీనిని పరిగణలోకి తీసుకొని ఆ 33 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయినా నేటికి పది మంది విధుల్లో చేరకపోవడంతో మరోసారి నోటీసులు ఇచ్చారు. వీరు తమ విధుల్లో చేరుతారా లేదా..? అన్నదానిపై స్పష్టత లేదు.
సీపీడీ సెల్ పేరిట జిల్లా నుంచి పది మంది ఉపాధ్యాయులను తీసుకొని డైట్కు డిప్యూటేషన్ ఇచ్చారు. వీరి స్థానంలో సదరు పాఠశాలలకు కొత్త వారిని ఇవ్వలేదు. ఫారిన్ సర్వీసుల పేరిట ఒక్కో జిల్లా నుంచి 10 నుంచి 20 మంది పని చేస్తున్నారు. వీరి స్థానాలను కూడా నేటికి భర్తీ చేయలేదు. ఒక్కో జిల్లాలో దాదాపు 40 మందికిపైగా ఉపాధ్యాయులు లాంగ్ లీవులో ఉన్నారు. వారి స్థానంలో మరొక టీచర్ను భర్తీ చేయాల్సి ఉన్నది. కానీ, ఆ నిబంధనలు అమలు కావడం లేదు. అలాగే ఇటీవలే స్కూల్ అసిస్టెంట్ల బదిలీలు జరిగాయి. అయితే చాలా మంది ఇంకా రిలీవ్ కాలేదు. ఇలా భిన్న కారణాలతో పాఠశాలల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఉన్నత పాఠశాలల్లో ప్రధానంగా ఏ అధికారైనా చూసేది పదో తరగతి ఉత్తీర్ణత శాతమే. కలెక్టర్తోపాటు ఉన్నతాధికారులు, విద్యాధికారుల సమీక్షల్లోనూ సదరు పాఠశాల ప్రగతి గురించి ప్రధానోపాధ్యాయులనే అడుగుతారు. ఆ సమయంలో హెచ్ఎంలు సమస్యలు చెప్పే ప్రయత్నం చేసినా ఎవరూ వినరు. సమీక్షా సమావేశాలు జరిగినప్పుడు.. తమ స్కూల్ సమస్యలు విన్నవించేంత ధైర్యం చేసినా పట్టించుకోరు. ఫలితంగా వాస్తవాలు ఒకరకంగా ఉంటే.. తిట్లు మాత్రం ప్రధానోపాధ్యాయులు పడాల్సి వస్తున్నది. తాజా పరిస్థితులను చూస్తే.. ఈ సారి పదో తరగతి ఉత్తీర్ణత దారుణంగా పడిపోయే ప్రమాదం కనిపిస్తున్నది.
కారణం ఏమిటంటే.. పోస్టింగ్లు ఇచ్చిన చోట ఉపాధ్యాయులు చేరడం లేదు. దీంతో సదరు సబ్జెక్టులు బోధించేవారు లేక హెచ్ఎంలు ఆందోళన చెందుతున్నారు. పలుసార్లు ఉన్నతాధికారులకు చెబుతున్నా.. వాళ్లు నిమ్మకు నీరెత్తినట్లుగానే వ్యవహరిస్తున్నారు. ‘మీ పాఠశాలలకు పోస్టింగ్ ఇచ్చాం’ అని చెబుతున్నారే తప్ప సదరు టీచర్ విధుల్లో చేరాడా..? లేదా..? అన్నది చూడడం లేదు. దీంతో ప్రతి చోటా ప్రధానోపాధ్యాయులే సమిధలుగా మారుతున్నారు. మెజార్టీ హెచ్ఎంలు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. ఎవరికి చెప్పుకోలేక.. పాఠశాలల ప్రగతిని ముందుకు తీసుకెళ్లలేక ఇబ్బందులకు లోనవుతున్నారు.
సమస్యల పరిష్కారం కోసం పనిచేయాల్సిన పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు తమ వ్యక్తి గత ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నారు. విధుల్లో చేరకుండా, విద్యాధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తున్న కొంత మంది టీచర్లకు అండగా నిలుస్తున్నారు. ‘మేం చూసుకుంటా’మంటూ భరోసానిస్తూ.. విద్యారంగం ప్రగతికి అడ్డుపడుతున్నారన్న విమర్శలను మూటగట్టుకుంటున్నారు. ఏదైనా సంఘం ప్రశ్నిస్తే.. మీరు గతంలో ఇలా చేయలేదా..? అలా చేయలేదా..? అంటూ ఆత్మరక్షణలో పడేస్తున్నారు. దీంతో తమకెందుకులే అన్నట్టు పలు కొన్ని సంఘాల నాయకులు వ్యవహరిస్తున్నారు.
ఈ పరిస్థితుల్లోనే చాలా మంది టీచర్లు సంఘాల అండతో విధులకు ఎగనామం పెడుతున్నారు. విద్యాశాఖాధికారులు ఆదేశాలు ఇచ్చినా.. షోకాజ్ నోటీసులు ఇచ్చినా.. విధుల్లో చేరకుండా విద్యాధికారులతోనే వాదనకు దిగుతున్నారు. అయితే సదరు ఉపాధ్యాయులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన విద్యాశాఖాధికారులు ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు. ఒక వేళ అలా చేస్తే తమ లొసుగులను ఎత్తిచూపడంతోపాటు పాఠశాలలు అవే నడుస్తాయిలే అన్నట్టుగా ఆలోచిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
నిజానికి చట్టాలను నిర్భయంగా వినియోగిస్తే.. సదరు ఉపాధ్యాయులు విధుల్లో చేరే అవకాశాలున్నాయి. కానీ, ఆ ధైర్యం చేయడంలో యంత్రాంగం విఫలమైందన్న విమర్శలున్నాయి. ఈ పరిస్థితుల్లో విద్యావ్యవస్థను కాపాడే ప్రయత్నం చేయల్సిన సంఘాలు వ్యక్తిగత ప్రయోజనాలు, స్వప్రయోజనాల కోసం పెద్దపీట వేయడం కూడా మెజార్టీ ఉపాధ్యాయుల్లో విమర్శలకు దారి తీస్తున్నది. పదో తరగతి పరీక్షలు దగ్గర పడుతున్న నేపథ్యంలో విద్యాశాఖాధికారులు అన్ని కోణాల్లో ఆలోచించి.. విద్యార్థుల ప్రయోజనాలకు పెద్దపీట వేసేలా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తున్నది.
ఉన్నత పాఠశాలలో నూతన ఒరవడిలో విద్యా బోధన, ఉత్తమమైన ఫలితాల సాధన కోసం విద్యాశాఖ కృషి చేస్తున్నది. అందులో భాగంగా పదో తరగతి విద్యార్థులకు లక్ష్య, ఆరు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఉన్నతి కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేస్తున్నది. కానీ, ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత వల్ల లక్ష్య సాధనలో ప్రతికూల ప్రభావం పడనున్నది. కనీసం ఈ విద్యా సంవత్సరం చివరి రెండు నెలలకైనా విద్యా వలంటీర్లను నియమిస్తే కొంత తీవ్రత తగ్గే అవకాశమున్నది. అలాగే తరగతి గదిలో విద్యాబోధనకు అవకాశం ఇవ్వాలి. ఇతర అన్ని రకాల స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్, పేరెంట్ టీచర్ మీటింగ్ తదితర కార్యక్రమాలను వచ్చే రెండు నెలలపాటు నిలివేయాలి. -పీ రాజభాను చంద్రప్రకాశ్, తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు