Karimnagar | కరీంనగర్ నేల.. పోరాటాల పురిటిగడ్డ.. నాడు తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూది, పార్టీకి ఎన్నో అఖండ విజయాలు అందించి.. నేడు ప్రభుత్వానికి పేరు ప్రఖ్యాతులు తెస్తున్న జిల్లా సీఎం కేసీఆర్ మానస పుత్రికగా మారిపోయింది. నాటి నుంచి నేటి దాకా ఏది చేసినా కలిసివచ్చే జిల్లాగా.. సెంటిమెంట్ ప్రాంతంగా ముద్ర పడిపోయింది. తెలంగాణ రాక ముందు చారిత్రక ఘట్టాలకు వేదికైంది. నేడు ప్రగతి సంక్షేమానికి వారధిగా దూసుకెళ్తున్నది. పార్టీ పరంగానే కాకుండా.. నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ప్రభుత్వ కార్యక్రమాలకు ఇక్కడి నుంచే నాంది పడడమే కాదు, అవి సక్సెస్ఫుల్గా అమలై దేశానికి దిక్సూచిగా నిలుస్తున్నాయి. నేడు పార్టీ 23వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా అలాంటి చారిత్రక ఘట్టాలపై ‘నమస్తే’ అందిస్తున్న ప్రత్యేక కథనమిది.
– కరీంనగర్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
కరీంనగర్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): “నాడు ఉద్యమానికి.. నేడు ప్రభుత్వానికి వేయి ఏనుగుల బలాన్ని ఇస్తూ, మమ్మల్ని ముందుకు నడుపుతున్న కరీంనగర్ గడ్డకు.. ప్రతి బిడ్డకూ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. 2001లో సింహగర్జనలో సింహంలా గర్జించి మడమ తిప్పని పోరాటానికి అస్త్రశస్ర్తాలను అందించింది ఈ జిల్లానే. విప్లవాల పురిటి గడ్డయిన కరీంనగర్ వేదికగా సింహగర్జన, ఆమరణ నిరాహార దీక్ష, సకలజనుల సమ్మెకు శంఖారావం పూరించా. అవి చరిత్రలోనే ఒక చారిత్రక ఘట్టాలుగా నిలిచిపోయాయి. ఈ గడ్డ ప్రజలకు ఎంత చేసినా రుణం తీర్చుకోలేను. అందుకే అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత కూడా నాకు కలిసివచ్చే కరీంనగర్ గడ్డపై నుంచే ఎన్నో విశిష్ట పథకాలకు అంకురార్పణ చేసిన.
ఈ నేలపై ప్రకటించిన ఎన్నో పథకాలు గమ్యాన్ని ముద్దాడడమే కాదు, యావత్తు దేశానికి ఒక దిక్సూచిగా నిలిచాయి. ఈ గడ్డపై ఏ కార్యక్రమం తీసుకున్నా, ప్రారంభించినా అది సంపూర్ణ విజయవంతమవుతుందన్న నమ్మకం నాది.” స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పలుసార్లు కరీంనగర్ పర్యటన సందర్భంగా చెప్పిన మాటలివి. ఆయన చెప్పినట్లుగా, విప్లవాల ఖిల్లా, ఉద్యమాల పురిటిగడ్డ అయిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ చరిత్రలో ఒక చెరగని ముద్ర వేసింది. కష్టకాలంలో అండగా నిలువడమే కాదు, ఎన్నో చారిత్రాత్మక ఘట్టాలకు, బీఆర్ఎస్ విజయాలకు వేదికైంది. పార్టీ 22 ఏండ్లు పూర్తిచేసుకొని నేడు 23వ పడిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఉమ్మడి జిల్లా వేదికగా జరిగిన కొన్ని ముఖ్యఘట్టాలు ఇలా ఉన్నాయి.
2001 ఏప్రిల్ 27 : కేసీఆర్, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీడీపీకి, తన శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేసి, టీఆర్ఎస్ ఆవిర్భావానికి నాంది పలికారు.
2001 మే17: కరీంనగర్లోని ఎస్సారార్ కాలేజీ వేదికగా ‘సింహగర్జన సభ’ నిర్వహించారు. లక్షలాది మంది సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటును కేసీఆర్ ఘనంగా ప్రకటించారు. తెలంగాణ వచ్చేదాకా మడమ తిప్పబోనని ప్రతినబూనారు. అప్పటివరకు ప్రపంచ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఈ సభ విజయవంతమైన ఘనత ఈ గడ్డకు దక్కింది.
2001లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 100 ఎంపీటీసీలు, 85 జడ్పీటీసీలు, 3 వేల మంది సర్పంచులు, రెండు జడ్పీ స్థానాలను కైవసం చేసుకున్నది.
2004 జూన్ 7: 2004లో యూపీఏ ప్రభుత్వానికి మద్దతు పలికిన కేసీఆర్, అదే ఏడాది జూన్ 7న రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ అంశాన్ని ప్రస్తావించేలా చేశారు. అప్పుడు కరీంనగర్ ఎంపీగా ఉన్నారు. 2005 జనవరిలో కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీ ఏర్పాటు కూడా బీఆర్ఎస్ విజయమే. అప్పుడూ కరీంనగర్ ఎంపీగా కేసీఆరే ఉన్నారు.
2006 సెప్టెంబర్ 12: కరీంనగర్ లోకసభ స్థానానికి కేసీఆర్ రాజీనామా చేశారు. తెలంగాణవాదం లేనే లేదంటూ నాడు కాంగ్రెస్ నాయకులు చేసిన హేళన వ్యాఖ్యలతో కలత చెంది పదవిని తృణప్రాయంగా భావించి, లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తెలంగాణ కోసం పదవుల త్యాగానికి శ్రీకారం చుట్టిన ఘనత ఈ గడ్డకే దక్కింది.
2006 డిసెంబర్ 7: కరీంనగర్ లోక్సభకు ఉపఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో ఈ గడ్డ ప్రజలు కేసీఆర్కు 2,01,582 ఓట్ల మెజార్టీనిచ్చి గెలిపించారు. ప్రత్యేక తెలంగాణవాదం ఉందని నలుమూలల చాటి చెప్పిన చరిత్ర ఉమ్మడి జిల్లా ప్రజలకు దక్కింది. తెలంగాణవాదాన్ని బలంగా చాటి చెప్పిన కీర్తి పూర్వ జిల్లా ప్రజలకే దక్కింది.
2012 నవంబర్ 7, 8: తెలంగాణ రాష్ట్ర సమితి కార్యవర్గ సమావేశాలను అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించారు. స్థానిక ప్రతిమ హోటల్ వేదికగా ఏర్పాటు చేసిన ఈ సమావేశాల్లో అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు.
2013 సెప్టెంబర్ 7: తెలంగాణ సాధనకు పార్టీ శ్రేణులను కార్యోన్ముఖులను చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణ శిబిరాలను నిర్వహించారు. తొలి శిక్షణ శిబిరాలను హుజూరాబాద్ కేంద్రంగా ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ ప్రారంభించారు. ఈ శిక్షణ యువతను బాగా ఆకట్టుకున్నది.
2014 ఏప్రిల్ 13: ఆనాడు జరిగిన సార్వత్రిక ఎన్నికలకు శ్రీ రాజరాజేశ్వర కళాశాల వేదికగా జరిగిన బహిరంగ సమావేశంలో తొలి సమర శంఖారావం పూరించారు. అద్భుత విజయాన్ని సాధించి తొలిసారి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టింది.
2009 నవంబర్ 11: ప్రత్యేక తెలంగాణ సాధనే ధ్యేయంగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టేందుకు కరీంనగర్లోని తన భవన్ నుంచి బయలు దేరిన కేసీఆర్ను అల్గునూరు చౌరస్తా వద్ద పోలీసులు అరెస్టు చేశారు. ప్రజలు పోలీసులకు అడ్డు తిరిగి, కేసీఆర్కు మద్దతుగా నిలువగా ఈ అరెస్టు దేశ వ్యాప్తంగా ఒక సంచలనం రేపింది.
2011 సెప్టెంబర్ 23: ప్రత్యేక తెలంగాణ సాధన కోసం చరిత్రలో నిలిచిపోయే సకలజనుల సమ్మెకు కరీంనగర్ గడ్డ మీది నుంచే పిలుపునిచ్చారు. ఎస్సారార్ కాలేజీ మైదానంలో జరిగిన సభలో సకల జనుల చారిత్రక సమ్మెకు రణ భేరి మోగించారు. ఈ సమ్మె యావత్తు దేశం దృష్టిని ఆకర్షించింది.
2014 ఆగస్టు 5: ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆనాటి ఉమ్మడి జిల్లాలో తొలి అధికారిక పర్యటన చేశారు. పూర్వ జిల్లా వేదికగా తాగునీటి సమస్యను శాశ్వతంగా తొలగించేందుకు మిషన్ భగీరథ పథకానికి శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించారు. ఈ పథకం యావత్ దేశం దృష్టిని ఆకర్షించడమేకాదు, కేంద్రం కూడా ఆచరిస్తున్నది.
2015 జూలై 4: రాష్ట్రంలో అంతరించిపోతున్న అటవీ సంపద పెంచేందుకు చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని మొదట హుస్నాబాద్లో ప్రారంభించారు. ప్రస్తుతం దిగ్విజయంగా కొనసాగుతున్నది.
2016 మే 2: ప్రాజెక్టుల రీడిజైనింగ్కు శ్రీకారం చుట్టిన తర్వాత తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా తీర్చిదిద్దడంలో భాగంగా ఆనాటి ఉమ్మడి జిల్లాలోని మేడిగడ్డ వద్ద కాళేశ్వర ఎత్తిపోతల పథకానికి భూమి పూజ చేశారు. ఈ పథకం దేశానికి ఒక దిక్సూచిగా నిలువడమే కాదు, రాష్ట్ర వ్యవసాయరంగ ముఖ చిత్రాన్ని మార్చివేసింది. దేశానికి అన్నంపెట్టే ధాన్యాగారంగా రాష్ర్టాన్ని నేడు దేశం ముందు నిలిపింది.
2018 ఫిబ్రవరి 26: రైతాంగ చరిత్రలో నూతన అధ్యాయానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. కరీంనగర్ అంబేద్కర్ మైదానంలో జరిగిన సభావేదికగా రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఇవి దిగ్విజయంగా కొనసాగుతున్నాయి. అంతేకాదు, రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఇదే వేదికపై ప్రకటించారు. ప్రస్తుతం ఈ పథకం యావత్ రైతాంగానికి ఒక భరోసాను కల్పిస్తోంది.
2017 జూలై 12: నగరంలో మూడో విడుత హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
t2018 మే 10: లక్షలాది మంది రైతుల ఆశలకు జీవం పోస్తూ హుజూరాబాద్ నియోజకవర్గం శాలపల్లి- ఇందిరానగర్ వేదికగా రైతుబంధు పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అన్నదాతలకు అండగా నిలుస్తున్న ఈ పథకాన్ని అన్ని రాష్ర్టాల్లో ప్రవేశపెట్టాలన్న డిమాండ్ రైతుల నుంచి వస్తున్నది.
2018 సెప్టెంబర్ 7: ప్రభుత్వాన్ని రద్దుచేసిన తర్వాత తొలి ఎన్నికల ప్రచారాన్ని ప్రజా ఆశీర్వాద సభ పేరుతో పూర్వ కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ గడ్డ వేదికగా ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. ఆ మేరకు 88 స్థానాల్లో విజయకేతనం ఎగరేసి రెండోసారి అధికార పగ్గాలు చేపట్టేందుకు కూడా మన ఉమ్మడి జిల్లానే వేదికైంది.
2021 ఆగస్టు 16: దళితుల జీవితాల్లో వెలుగులు నింపే లక్ష్యంతో దళితబంధు పథకాన్ని హుజూరాబాద్ మండలం శాలపల్లి వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ పథకం దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నది.