Collector Chitra Mishra | చిగురుమామిడి, జూన్ 29 : ఐదేళ్ల లోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేసి, నూరు శాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలని, చుక్కలు తప్పిపోయిన వారిని రెండు రోజుల్లో గుర్తించి చుక్కల మందు వేయాలని కలెక్టర్ కలెక్టర్ చిత్రా మిశ్రా ఆరోగ్యశాఖ సిబ్బందిని ఆదేశించారు. చిగురుమామిడి మండల కేంద్రంలో ఐదేళ్ల లోపు వయసు గల పిల్లలు ఉన్న ఓ ఇంటిని సోమవారం జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సందర్శించారు. ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియోలో పోలియో చుక్కలు వేయించారా లేదా అని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆశ, ఏఎన్ఎంలతో పల్స్ పోలియో గురించి ఆరా తీశారు.
గ్రామంలో ఐదేళ్ల లోపు ఉన్న పిల్లల సంఖ్య, పోలియో చుక్కలు వేసుకున్న వారి శాతం తదితర వివరాలు అడిగారు. సోమ, మంగళవారాల్లో ప్రతీ ఇంటిని సందర్శించి పోలియో చుక్కలు వేయని పిల్లలను గుర్తించాలని, వారికి తప్పక చుక్కల మందు వేయాలని ఆదేశించారు. 100 శాతం ఐదేళ్లలోపు పిల్లలకు చుక్కల మందు వేసి కార్యక్రమాన్ని విజయంతం చేయాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చుక్కల మందు తీసుకొని వారు ఒక్కరు కూడా ఉండరాదని అన్నారు. వేరే ప్రాంతాలకు ఎవరైనా వెళ్లినట్లయితే అక్కడ పోలియో చుక్కలు వేసుకున్నారో లేదో కనుక్కోవాలని తెలిపారు.
ఎస్ఐఆర్ వేగవంతంగా పూర్తి చేయాలి..
ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. చిగురుమామిడి మండల కేంద్రంలో బీఎల్వోలు ఇంటింటికి వెళ్లి ఎస్.ఐ.ఆర్ ఫారాలను పంపిణీ చేస్తున్న విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బీఎల్ఓలకు ఏవైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ ప్రక్రియ పకడ్బందీగా పారదర్శకంగా నిర్వహించాలని, ఎలాంటి తప్పిదాలూ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఎంతమంది ఓటర్లను మ్యాపింగ్ చేశారని, ఆన్లైన్ ప్రక్రియ ఎలా సాగుతోందని ఆరా తీశారు. ఎస్ఐఆర్ఐ ప్రజలకు తగిన అవగాహన కల్పిస్తూ ముందుకు సాగితే ప్రక్రియ వేగంగా పూర్తవుతుందని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ ఓటర్లతోనూ మాట్లాడారు. ఓటర్లు బీఎల్ఓకు సహకరించాలని కోరారు. సూపర్వైజర్లు, బీఎల్వోలు సమన్వయంతో ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట సర్పంచ్ ఆకవరం భవాని, ఏఎన్ఎం లక్ష్మి, గ్రామ కార్యదర్శి కాల్వ రమేష్, కారోబార్ సత్యనారాయణ తదితరులు ఉన్నారు.