ఎండలు మండుతుండడంతో వన్యప్రాణుల సంరక్షణపై అటవీశాఖ ప్రత్యేక దృష్టిపెట్టింది. అగ్నిప్రమాదాలతో జీవజాతులు అంతరించిపోతుండడంతో పెద్దపల్లి జిల్లాలోని అటవీప్రాంతంలో 100 కిలోమీటర్ల మేర ఫైర్లైన్స్ ఏర్పాటు చేసింది. నీరు దొరక్క జనావాసాలకు వస్తూ ప్రాణాలు కోల్పోతుండగా, నీటి లభ్యత లేని ప్రాంతాలను గుర్తించి, సాసర్ పిట్స్ (నీటి తొట్టీలు) నిర్మించింది. అందులో రెండురోజులకోసారి నీళ్లను నింపుతూ జీవజాతుల దాహం తీరుస్తున్నది.
– పెద్దపల్లి, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ)
ఒక్కసారిగా వేసవితాపం పెరిగిపోవడంతో వణ్యప్రాణులు విలవిల్లాడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అరణ్యాన్ని వీడి జనవాసాల్లోకి వస్తున్నాయి. వీధికుక్కలు వెంటపడి దాడి చేస్తుండడంతో ప్రాణాలు కోల్పోతున్నాయి. గతంలోనూ ఇలాంటి ఉదంతాలు అనేకం ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో అటవీశాఖ అధికారులు వణ్యప్రాణుల సంరక్షణకు చర్యలు చేపట్టారు.
పెద్దపల్లి, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): పెద్దపల్లి జిల్లా పరిధిలోని పెద్దపల్లి, మంథని నియోజకవర్గాల్లో అటవీ ప్రాంతం విస్తరించి ఉండగా, అటవీశాఖ అధికారులు వణ్యప్రాణుల సంరక్షణకు చర్యలు చేపట్టారు. ఈ ప్రాంతాల్లో 20 సాసర్ పిట్స్ నిర్మించారు. నీటి లభ్యత లేని పది ప్రాంతాలను గుర్తించి అకడ వీటిని అందుబాటులో ఉంచారు. మంథని రేంజ్ పరిధిలోని ఎక్లాస్పూర్లో 5, భట్పల్లి 7, ఖమ్మంపల్లి 1, బేగంపేట 1, మంథని 1సాసర్ పిట్లను ఏర్పాటు చేశారు. పెద్దపల్లి రేంజ్ పరిధిలో రామగుండం, కన్నాల, కుందన్పల్లి, బ్రాహ్మణపల్లి, పెద్దంపేట బీట్లో ఒక్కో సాసర్ పిట్ను అందుబాటులోకి తెచ్చారు. రెండురోజులకోసారి వీటిలో నీళ్లను నింపుతూ జీవజాతుల దాహం తీరుస్తున్నారు.
పాద ముద్రలతో వన్యప్రాణుల గణన
నీటి వనరులు, సాసర్ పిట్ల వద్దకు వచ్చే వన్యప్రాణుల గణనను పెద్దపల్లి జిల్లా అటవీ అధికారి శివయ్య మంథని, పెద్దపల్లి ఫారెస్ట్ రేంజ్ అధికారులు శ్రీనివాసరావు, నాగయ్య చేపడుతున్నారు. పాద ముద్రల ఆధారంగా ఏ జంతు జీవాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఏఏ జంతువులు ఉన్నాయి? ఇలా గణను చేస్తున్నారు. ముఖ్యంగా దుప్పులు, జింకలు, కొండ గొర్రెలు, ఎలుగుబంట్లు, మనుబోతులు, నెమళ్లు, అడవి పందులు జిల్లాలో ఉన్నట్లు ఇప్పటికే అధికారులు గుర్తించారు.
100 కిలో మీటర్ల విస్తీర్ణంలో ఫైర్లైన్స్
పెద్దపల్లి జిల్లాలో 76, 938ఎకరాల్లో అటవీ ప్రాంతం (14.20 శాతం) విస్తరించి ఉన్నది. అయితే అటవీ ప్రాంతం చెదిరిపోకుండా, ఇక్కడ ఉండే వన్యప్రాణులు అంతరించిపోకుండా ఉండేందుకు అధికారులు 100 కిలోమీటర్లు ఫైర్ లైన్స్ను ఏర్పాటు చేశారు. అటవీ ప్రాంతం పక్కనే ఉండే ప్రధాన రహదారులు, అటవీ గ్రామాలకు ఆనుకొని ఉండే గ్రామాల చుట్టూ ఫైర్ లైన్స్ను అమర్చారు. వీటి కారణంగా ఎక్కడ ఎలాంటి అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగినా.. అది అక్కడికే నిలిచిపోయి మిగతా అడవి అంటుకోకుండా ఉండేందుకు ఈ చర్యలు చేపట్టారు.
వన్యప్రాణులను కాపాడుకుంటాం
అటవీ ప్రాంతాల్లో ఉండే వన్య ప్రాణులన్నింటినీ కాపాడుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. అడువుల్లో వేసవిలో నీటి లభ్యత తకువగా ఉన్న ప్రాంతాలు, పూర్తిగా నీరు లేని ప్రాంతాలను గుర్తించి అక్కడ సాసర్ పిట్లను నిర్మించాం. వీటిల్లో ఎప్పటికప్పుడు తాగునీరు నింపి జీవుల దాహం తీరుస్తున్నాం. అగ్నిప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు ఫైర్లైన్స్ ఏర్పాటు చేశాం.
– సీహెచ్ శివయ్య, జిల్లా అటవీ శాఖ అధికారి (పెద్దపల్లి)