పోలీస్, వ్యవసాయ శాఖలతో టాస్క్ఫోర్స్ బృందాలు
ఆ సీడ్ వేయవద్దని రైతులకు అవగాహన
అమ్మినా.. సాగు చేసినా పీడీ యాక్ట్
ైగ్లెఫోసెట్ గడ్డి మందు వాడొద్దని హెచ్చరిక
కరీంనగర్ కలెక్టర్ శశాంక స్పష్టమైన ఆదేశాలు
కరీంనగర్, మే 6(నమస్తే తెలంగాణ):పర్యావరణాన్ని దెబ్బతీసే హెర్బిసైడ్ టొలరెంట్ (హెచ్టీ) పత్తి విత్తనాలపై కరీంనగర్ జిల్లా యంత్రాంగం ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. ఈ విత్తనాలు సాగు చేస్తే తప్పనిసరిగా ైగ్లెఫోసెట్ గడ్డి మందు వాడాల్సి ఉండడంతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని పూర్తిగా నిషేధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విత్తనాలను విక్రయించినా, సాగు చేసినా పీడీ యాక్ట్ పెట్టాలని కరీంనగర్ కలెక్టర్ శశాంక, సీపీ కమలాసన్ రెడ్డి స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ మేరకు పోలీసు, వ్యవసాయ శాఖలతో టాస్క్ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేయగా, ఏవో, ఎస్ఐ ఆధ్వర్యంలో ప్రతి మండలంలో ఇవి పని చేయనున్నాయి.
గత రెండు మూడు సీజన్ల నుంచి కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలోని రైతులు హెచ్టీ పత్తి విత్తనాలను ఎక్కువగా సాగు చేస్తున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్ జిల్లాలోని గంగాధర, రామడుగు, కరీంనగర్ రూరల్, తదితర మండలాల్లో, జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల, మల్యాల, సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ, చందుర్తి, బోయినపల్లి, పెద్దపల్లి జిల్లాలోని కాల్వ శ్రీరాంపూర్, సుల్తానాబాద్, ఎలిగేడు, తదితర మండలాల్లో ఎక్కువగా హెచ్టీ పత్తి విత్తనాలు సాగైనట్లు తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించిన ఈ విత్తనాలను కొందరు వ్యాపారులు అక్రమంగా రైతులకు అంటగడుతున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కొందరు దళారులు వచ్చి హెచ్టీ పత్తి విత్తన దందా సాగిస్తున్నట్లు సమాచారం. గత రెండు మూడు సీజన్ల నుంచి కరీంనగర్ కేంద్రంగా ఉమ్మడి జిల్లాకు ఈ విత్తనాలు అందుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో గట్టి నిఘా పెట్టాలని అధికారులు నిర్ణయించారు. ఇటీవలే ఈ విషయం కలెక్టర్ శశాంక, సీపీ కమలాసన్రెడ్డి వ్యవసాయ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై ఈసారి నిషేధిత హెచ్టీ పత్తి విత్తనాలపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
జిల్లా కేంద్రంలో పర్యవేక్షించేందుకు ఏడీఏ అంజని, టెక్నికల్ ఏవో ఎం కృష్ణను నియమించారు. మండలాలవారీగా మండల వ్యవసాయ అధికారి, ఎస్ఐ ఆ ధ్వర్యంలో టాస్క్ఫోర్స్ బృందాలు పని చేస్తాయి. మండల స్థాయిలో టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. ఖరీఫ్ సీజన్ రాక ముందే కొందరు దళారులు హెచ్టీ పత్తి విత్తనాలను లూజ్ ప్యాకెట్ల ద్వారా తెచ్చి మండలాల్లోని రైతులకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ముందుగానే టాస్క్ఫోర్స్ కమిటీలను రంగంలోకి దింపింది. జిల్లా సరిహద్దుల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. అన్ని ట్రాన్స్పోర్టు ఏజెన్సీలపైనా ఈ బృందాలు కన్నేసి ఉంచాయి. అంతే కాకుండా హెచ్టీ పత్తి విత్తనాలు సాగు చేయడం వల్ల జరిగే అనర్థాలపై రైతుల్లో అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులకు కలెక్టర్ శశాంక ఆదేశాలు కూడా ఇచ్చారు. ఈ మేరకు నిషేదిత విత్తనాలు విక్రయించిన వారిపై కఠినంగా వ్యవహరించాలని జిల్లా అధికారులు నిర్ణయించారు. అమ్మినా, కొన్నా, సాగు చేసినా పీడీ యాక్ట్ నమోదు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.
దిగుబడిలో తేడా లేదు
ైగ్లెఫోసెట్ అనే గడ్డి మందును తట్టుకునే జన్యువుతో రూపొందించిన హెచ్టీ పత్తి విత్తన సాగుతో కేవలం గడ్డి నివారణ తప్ప దిగుబడి తక్కువేనని తెలుస్తోంది. కేవలం తేయాకు తోటల్లో వాడే ైగ్లెఫోసెట్ గడ్డి మందును పత్తి సాగులోనూ వాడేందుకు అనుమతి ఇవ్వాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్కు కొన్ని కంపెనీలు విన్నవించాయి. గడ్డి మందు వాడడం వల్ల అనేక దేశాల్లో నేలలు నిస్సారంగా మారిన నేపథ్యంలో ఈ కౌన్సిల్ దేశంలో అనుమతులు ఇవ్వలేదు. అయినా, కొన్ని కంపెనీలు బీటీ-3 పేరిట హెచ్టీ పత్తి విత్తనాలు, గడ్డి నివారణకు ైగ్లెఫోసెట్ మందును దొంగచాటుగా మార్కెట్లోకి తెస్తున్నట్లు తెలుస్తోంది. రెండు మూడు సీజన్లలో అక్కడక్కడా వాడిన రైతులు దిగుబడి విషయంలో అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, కొందరు వ్యాపారులు మాత్రం వచ్చే వానకాలం సీజన్లోనూ హెచ్టీ పత్తి విత్తనాలను నేరుగా గ్రామాల్లోని రైతుల వద్దకు వెళ్లి అక్రమంగా విక్రయించే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. బీటీ-1, బీటీ-2 పత్తి విత్తనాల సాగుకు మాత్రమే అనుమతి ఉండగా ఈ విత్తనాలు మాత్రమే విక్రయించేలా ఇప్పటికే సంబంధిత డీలర్లకు కూడా స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. ఒక వేళ ఇలాంటి నిషేధిత విత్తనాలు విక్రయిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని పోలీసు, వ్యవసాయ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. పీడీ యాక్ట్ కూడా నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు.
రైతులకు అవగాహన
భూసార పరీక్షలు నిర్వహిస్తూ నేల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టిన ప్రభుత్వం ైగ్లెఫోసెట్ వంటి ప్రమాదకర గడ్డి నివారణ మందులు వాడేందుకు అనుమతి నిరాకరించింది. దీనివల్ల పర్యావరణానికి పెనుముప్పు ఉన్నట్లు సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిని పిచికారీ చేస్తే ఎంత పచ్చటి మొక్కలైనా మాడి మసైపోతున్నాయి. ైగ్లెఫోసెట్ కలుపు నివారణ మందు అత్యంత ప్రమాదకరమైనదని తెలియని రైతులు దీనిని విరివిగా వాడుతున్నట్లు తెలుస్తోంది. దీనిలో ఉండే విష రసాయనం క్యాన్సర్ వ్యాధులకు దారి తీస్తున్నట్లు మూడేళ్ల కిందటే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఈ మందును ఎక్కువగా వాడుతున్న అమెరికా, బ్రెజిల్, అర్జెంటీనా, తదితర దేశాల్లో భూములు, భూగర్భ జలాలు కలుషితమై పోయాయని, చివరికి తల్లి పాలలో, మనిషి మూత్రంలోనూ ైగ్లెఫోసెట్ అవశేషాలు కనిపించినట్లు ఆ సంస్థ నిర్ధారించింది. కలుపు నివారణ మందు చల్లడం, పిచికారీ చేయడం వల్ల మాగాణి, మెట్ట భూముల్లో వానపాములు, సూక్ష్మజీవులు నశిస్తున్నాయని మరో పక్క వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేల నిర్జీవంగా మారి గట్టిపడి, నీటి ఎద్దడిని తట్టుకునే శక్తిని కోల్పోతుందని వారు స్పష్టం చేస్తున్నారు. రైతులు, రైతు కూలీలు, సాధారణ ప్రజానీకం ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని భావిస్తున్న వ్యవసాయ అధికారులు రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తామని చెబుతున్నారు. మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులకు ఈ విషయమై ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లు కరీంనగర్ జిల్లా వ్యవసాయ అధికారి వాసిరెడ్డి శ్రీధర్ తెలిపారు.