హుజూరాబాద్/ జమ్మికుంట/ వీణవంక జూన్ 9: ‘దళితబంధు గొప్ప పథకం., నిరుపేదల పాలిట వరం’ అంటూ మహారాష్ట్ర సర్పంచుల బృందం కితాబిచ్చింది. ఈ స్కీం కింద నెలకొల్పిన షాపులు, ఇతర యూనిట్లు చాలా బాగున్నాయని ప్రశంసించింది. శుక్రవారం మహారాష్ట్ర సర్పంచుల బృందం మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి, కలెక్టర్ కర్ణన్తో కలిసి హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంకలో పర్యటించింది. అక్కడ సర్పంచులు పలువురు లబ్ధిదారులకు యూనిట్లను పంపిణీ చేశారు. ముందుగా వీణవంక మండలం చల్లూర్లో ఇనుపబెడ్ల తయారీ, జమ్మికుంటలో గోల్డెన్ బేకరీని సందర్శించారు. నిర్వాహకులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత హుజూరాబాద్లోని చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం దళిత బంధు వాహనాలను పరిశీలించి, పలువురు లబ్ధిదారులకు వెహికిళ్లను అందజేశారు. వాటిని వినియోగించుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణలోని పథకాలు ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేస్తే బాగుంటుందని ఆకాంక్షించారు. ఇక్కడ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, మున్సిపల్ అధ్యక్షులు రాజేశ్వర్రావు, గందె రాధిక, వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల, ఎంపీపీ ఇరుమళ్ల రాణి, జడ్పీటీసీ శ్రీరాం శ్యాం ఉన్నారు.
జమ్మికుంటలో పర్యటన
మహారాష్ట్ర సర్పంచుల పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు దత్తకాకడే(బీడ్ జిల్లా కిన్హి సర్పంచ్), ఉపాధ్యక్షుడు వికాస్ జాదవ్(సోలాపూర్ జిల్లా కాలమ్వాడ్ సర్పంచ్) ఆధ్వర్యంలో 25 మంది మహారాష్ట్ర సర్పంచులు ప్రత్యేక బస్సులో జమ్మికుంటకు వచ్చారు. ఐబీ గెస్ట్హౌస్ సమీపంలో వీరికి కౌశిక్రెడ్డి, బండ శ్రీనివాస్, కనుమల్ల విజయ, మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు స్వాగతం పలికారు. శాలువాలు కప్పి సత్కరించారు. తర్వాత పట్టణానికి చెందిన పారునంది శ్రీవిద్య- కుమార్కు చెందిన దళిత బంధు యూనిట్ ఏ టూ జడ్ మెడికల్ షాపును సందర్శించారు. నిర్వాహకుడు కుమార్తో సర్పంచుల పరిషత్ అధ్యక్షుడు మాట్లాడారు. సంభాషణ ఇలా సాగింది..
‘షాపు పెట్టేందుకు ఎంత ఖర్చైంది..? రూ.10లక్షలు ఎవరిచ్చిన్రు..? పైరవీ చేసుకున్నవా..? పైసా ఖర్చూ కాలేదా..?.. సీఎం కేసీఆర్ రూ.10లక్షలు వట్టిగనే ఇచ్చిన్రా..? అదెట్లా..? ఇంతకు ముందు మీరేం చేసేవారు..? ఎలా బతికెటోళ్లు..? ఇప్పుడు ఓనరైవా..?’ అంటూ సర్పంచుల పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు దత్తకాకడే ,మెడికల్ షాపు నిర్వాహకుడు కుమార్ను అడిగాడు. ఇందుకు ఆయన ‘మా కుటుంబీకులు కూలి చేసుకునేది. నేను మెడికల్ షాపులో పనిచేసేటోన్ని. సీఎం సారు దళిత బంధు తెచ్చిండు. నాకూ రూ.10లక్షలచ్చినయ్. పైసా ఖర్చు పెట్టలే.. పైరవీ లేదు. బ్యాంకుతోటి సంబంధం లేకుండ పైసలిచ్చిండు. మెడికల్ షాపు పెట్టుకొని ఓనర్నైనా. నెలకు రూ.30 వేల దాకా సంపాదిస్తున్న. అని షాపు నిర్వాహకుడు చెప్పిన సమాధానాలకు మహారాష్ట్ర సర్పంచుల బృందం ఆశ్చర్యపోయింది. ‘మా దగ్గర కూలే దొరకడం లేదు. బతుకుడే కష్టమైతంది. మీ దగ్గర దళితులు ఇంత గొప్పగా బతుకుతున్నరు. దళిత బంధు గొప్ప పథకం. దీన్ని మించింది ఇంకొటి ఉండదు. రాదు..’ అంటూ కొనియాడింది.
మళ్లీ కేసీఆరే సీఎం అవుతరు..
‘భారతరత్న అంబేద్కర్ మహారాష్ట్రలో పుట్టిండు. మా దగ్గర ఇంత గౌరవం లేదు. మీ దగ్గర గొప్పగా గౌరవిస్తున్నరు. ఎక్కడా చూసినా అంబేద్కర్ ఫొటోలు, విగ్రహాలున్నయ్. అంబేద్కర్ పక్కన తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోటోలున్నయ్. ఇక్కడి ప్రజలకు సీఎం కేసీఆర్పై ఎంత అభిమానం ఉందో తెలుస్తున్నది. నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపింది దళిత బంధు పథకం ఒక్కటే. సీఎం కేసీఆర్ అన్నివర్గాల ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నరు. అందుకే అందరి గుండెల్లో ఉన్నరనిపిస్తంది. మళ్లీ.. మళ్లీ కేసీఆరే ఇక్కడ సీఎం అవుతరు.’ అంటూ సర్పంచుల బృందం కొనియాడింది.
కేసీఆర్ గొప్ప నాయకుడు
దళితబందు బహుత్ అచ్చా హే. ఈ పథకంతో దళితుల జీవితాలు బాగుపడతాయని ఆశిస్తున్నా. ప్రతి ఒక్క కుటుంబానికి రూ. 10లక్షలు సహాయం చేయడం నిజంగా గ్రేట్. కేసీఆర్ సర్ చాలా గొప్ప మనిషి. భవిష్యత్ తరాల తలరాతలు మార్చే నాయకుడు.
-సుష్మ దేశ్లే (మహారాష్ట్ర సర్పంచ్)
కేసీఆర్ సార్ పేరు నిలబెట్టాలె..
కేసీఆర్ సార్లాంటి సీఎం దేశంలో ఎవరూలేరు. దళితుల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన దళితబంధు పథకం అద్భుతంగా ఉంది. ఇక్కడి దళితులు చాలా అదృష్టవంతులు. వేరే రాష్ట్రంలో కనీసం దళితులకు రూ. 10వేలు కూడా ఇవ్వడం లేదు. లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని కేసీఆర్సార్ పేరు నిలబెట్టాలే.
– కల్యాణి పాటిల్ (మహారాష్ట్ర సర్పంచ్)
దేశంలోనే గొప్ప సీఎం కేసీఆర్
దేశానికి కేసీఆర్ పీఎం కావాలి. పీఎం అయ్యే అన్ని అర్హతలు కేసీఆర్కు ఉన్నాయి. దళితబంధు పథకం నభూతోనభవిష్యత్తు. ఇటువంటి పథకం అమలు చేయడం దళితులు బాగుపడటానికి గొప్ప అవకాశం. ఇక్కడి పల్లె రోడ్లు జాతీయ రహదారులను తలపిస్తున్నాయి. దేశంలోనే కేసీఆర్ గొప్ప సీఎం అని చెప్పవచ్చు.
-గోవర్ధన్ (మహారాష్ట్ర సర్పంచ్)
కేసీఆర్ దమ్మున్న నాయకుడు
కేసీఆర్ దేశంలోనే దమ్మున్న నాయకుడు. దళితబందు పథకం అమలు చేయాలంటే దైర్యం ఉండాలి. ఈ పథకం అమలు చేసిన కేసీఆర్ గొప్ప ధైర్యవంతుడు. దళితుల జీవితాలు మారాలంటే కేసీఆర్లాంటి నాయకుడు ఉండాలి. భవిష్యత్తులో కేసీఆర్ పీఎం కావాలి ఆశిస్తున్నా. ఇక్కడ నడి ఎండలో తటాక్లో నీళ్లు ఉండడం ఆశ్చర్యంగా ఉన్నది.
– జేడీ టెమ్గిరి (మహారాష్ట్ర సర్పంచ్)
ఎక్కడ చూసినా పచ్చని పొలాలే..
రాష్ట్రంలోని కొన్ని జిల్లాల గుండా ప్రయాణం చేశాం. ఎక్కడ చూసినా పచ్చని పొలాలు, నిండైన చెరువులు, కుంటలు, వాగులు కనిపిస్తున్నయ్. మనం భారతదేశంలోనే ఉన్నామా అనిపించింది. దళితబంధు పథకంతో పేదల బతుకులు మారినయ్..తెలంగాణ రాష్ర్టాన్ని చూసి దేశం నేర్చుకోవాల్సింది ఎంతో ఉన్నది.
– మౌళివాఘ్, అహ్మద్నగర్, మహారాష్ట్ర
మహారాష్ట్రకు ఇక్కడికి మస్తు తేడా ఉన్నది..
మహారాష్ట్రలో ఇక్కడికి మస్తు తేడా కనిపిస్తున్నది. అక్కడ దళితుల అభివృద్ధికి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వడంలేదు. కానీ తెలంగాణలో రూ. 10 లక్షలు ఇవ్వడం గొప్పవిషయం. అక్కడ బ్యాంకు రుణం కావాలంటే ఎన్నో రోజులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దళితబంధు పథకంతో జీవితాలు మొత్తం మారిపోయాయి.
– విజయ్కాక్డే, మహారాష్ట్ర
దళితుల పాలిట దైవం సీఎం కేసీఆర్..
భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 76 ఏండ్లు దాటుతున్నా దళితుల తలరాత మారలేదు. వారి బతుకులు చీకట్లోనే మగ్గుతున్నాయి. మహారాష్ట్రలో అయితే మరీ దయనీయంగా ఉన్నాయి. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధును తెచ్చి వారి పాలిట దైవంలా మారారు. ఈ స్కీంతో వారి జీవితాల్లో ఊహించిన మార్పులు వచ్చాయి.
– అతుల్ చౌదరి, జల్గాన్, మహారాష్ట్ర
కేసీఆర్ పీఎం కావాలి..
మహారాష్ట్రలో దళితుల బతుకులు బాధాకరంగా ఉన్నాయి. ఉపాధి లేక దుర్భరంగా వెళ్లదీస్తున్నరు. తెలంగాణలో సీఎం కేసీఆర్ కలియుగ దైవంగా మారి దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నరు. ఒక్కో దళితకుటుంబానికి రూ. 10 లక్షలు ఇవ్వడం గొప్ప విషయం. మహారాష్ట్రలో ఇలాంటి పథకం రావాలంటే కేసీఆర్ సార్ ప్రధాని కావాలె.
– సతీశ్ధావాలే, అష్టి, మహారాష్ట్ర