జమ్మికుంట/జమ్మికుంట చౌరస్తా, అక్టోబర్18: ‘అన్నా ఎట్లున్నరే..? అమ్మా.. మంచిగున్నరా..? గడిచిన నాలుగైదు నెలలుగా ఇక్కడ్నే ఉంటన్నం గదా. పనులు ఎట్లా నడుత్తన్నయ్. రోడ్లు, కాల్వల పని జరుగుతున్నది గదా. ఇంకేమన్నా సమస్యలుంటే చెప్పున్రి. పరిష్కరిస్తం. ఇది మన ప్రభుత్వం. మనకు సీఎం కేసీఆర్ అండగున్నడు. ఇయ్యాల కాదు.. ఇంకా రెండెన్నరేళ్లు మనమే ఉంటం. ఏ పనిగావాలన్నా మనమే జెయ్యాలే. చేత్తం. చూపిత్తం. మాటలుండయ్. చేతలతోనే నడిపిస్తం’ అంటూ కాలనీవాసులతో మంత్రి కొప్పుల ఈశ్వర్ ముచ్చటించారు. ఒక్కొక్కరితో మాట్లాడారు. బాగోగులు అడిగి తెలుసుకున్నారు. సమస్యేదైనా పరిష్కరిస్తానని భరోసానిచ్చారు. ఎప్పుడైనా ఫోన్ చేయాలని, అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ఇన్నేళ్లు చేయని అభివృద్ధిని ఇప్పుడు చేసి చూపిస్తున్నామని తెలిపారు. సోమవారం మంత్రి కొప్పుల ఈశ్వ ర్ మున్సిపల్ పరిధిలోని ఆరో వార్డులో పర్యటించారు. వాడలన్నీ కలియతిరిగారు. కాలనీవాసులతో మాట్లాడారు. సమస్యల పరిష్కారం గురించి ఆరా తీశారు. ఇంకేమన్నా మిగిలిపోయిన పనులుంటే చెప్పాలని కోరారు. హౌసింగ్ బోర్డు కాలనీలో వానలు పడితే ఇండ్లు మునిగి పోతున్నాయని, శాశ్వత పరిష్కార మార్గాలు చూస్తున్నామని చెప్పారు. కొద్ది రోజుల్లోనే పక్కా ప్రణాళికా తయారు చేసి వాన నీరు ఇండ్లలోకి రాకుండా చేస్తామని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకున్న విషయాలను గుర్తు చేశారు. ఈటల ఇక్కడి ప్రజలను పట్టించుకోని వైనాన్ని ఎండగట్టారు. వ్యక్తి పోయినంత మాత్రాన వ్యవస్థ ఆగదని, హౌసింగ్ బోర్డుకు మేమున్నామని హామీ ఇచ్చారు. అందుకు కాలనీవాసులంతా మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలు, జరుగుతున్న అభివృద్ధి పనులపైసంతృప్తి వ్యక్తం చేశారు.
కార్మిక సంక్షేమానికి కట్టుబడి ఉన్నం: మంత్రి కొప్పుల
అన్ని వర్గాల కార్మికులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నామని, హమాలీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉద్ఘాటించారు. సోమవారం ఆయన మున్సిపల్ పరిధిలోని కాటన్ మిల్లుల్లోని హమాలీ కార్మికులను కలిశారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కోసం ప్రచారం చేశారు. వారితో కాసేపు ఇష్టాగోష్టి చేశారు. ఇండ్లులేని నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లను కట్టించిన తర్వాత మొదటి ప్రాధాన్యత కింది కార్మికులకు అందిస్తామని తెలిపారు. కార్మికుల పక్షపాతిగా ఉంటున్నామని, గెల్లు సీనును గెలిపించుకుంటే మరింత అభివృద్ధి, సంక్షేమం జరుగుతుందని తెలిపారు. తర్వాత 500మంది కార్మికులంతా టీఆర్ఎస్కే ఓటేస్తామని మంత్రికి హామీ ఇచ్చారు. గెల్లు సీనును గెలిపించుకుని కార్మికుల సత్తా చూపిస్తామని ప్రతినబూనారు. ఇక్కడ మంత్రితో పాటు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, హమాలీ కార్మిక సంఘం అధ్యక్షుడు ఒల్లాల శ్రీనివాస్, టీఆర్ఎస్ అర్బన్శాఖ అధ్యక్షుడు రాజ్కుమార్, కౌన్సిలర్ పొనగంటి మల్లయ్య, సీనియర్ నాయకుడు వాసాల రామస్వామి, కార్మికులు ఉన్నారు.