ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రతి ఏటా వానకాలంలో కోట్లాది మొక్కలు నాటి సంరక్షిస్తున్నది. ప్రజలందరి భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం ఉద్యమంలా సాగుతున్నది. తాజాగా సీఎం కేసీఆర్ హరిత నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. మొక్కలు పెంచడానికి, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలకు నిధుల కొరత తలెత్తకుండా గ్రీన్ ఫండ్ను ప్రకటించారు. విద్యార్థులు, ఎన్జీవోలు, అధికారులు, సమాజం మొత్తాన్ని ఇందులో భాగస్వాములను చేశారు. ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు తమ జీతాల నుంచి ప్రతి నెలా నిర్దేశించిన మొత్తాన్ని ఈ నిధికి జమ చేయాలి. వీరితో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాల సందర్భంగా సంస్థలు, స్కూల్ అడ్మిషన్ల సమయంలో విద్యార్థులు, ఎన్జీవోలు తమకు వచ్చే విరాళాల నుంచి ఈ నిధికి డబ్బును జమ చేస్తారు. భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలన్న మహత్తర లక్ష్యంతో ప్రారంభించిన గ్రీన్ ఫండ్ ఏర్పాటుపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
నిజామాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు హరితహారం కార్యక్రమం ఏడు విడుతల్లో సాగింది. ప్రతి ఏటా వానకాలంలో కోట్లాది మొక్కలు నాటే కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారు. అన్ని వర్గాల ప్రజలను ఇందులో భాగస్వామ్యం చేసి మొక్కలు నాటిస్తున్నారు. 33 శాతానికి అటవీ విస్తీర్ణాన్ని పెంచడమే లక్ష్యంగా విశేషంగా కృషి చేస్తున్నారు. పర్యావరణ సమతుల్యత దెబ్బతినడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమాజానికి మొక్కల పెంపకం ద్వారా సరికొత్త పాఠాలను సీఎం కేసీఆర్ నేర్పిస్తున్నారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మొక్కలు నాటి, వాటిని సం రక్షించే కార్యక్రమం ఏడేండ్లుగా విజయవంతంగా సాగుతున్నది. తాజాగా ముఖ్యమంత్రి తీసుకున్న హరితనిధి నిర్ణయం పచ్చదనానికి పునరుజ్జీవం పోసేందుకు ఉపయోగపడనుంది. చెట్లు పెంచడానికి, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలకు నిధుల కొరత తలెత్తకుండా, ప్రజలకు పచ్చదనంపై అవగాహన పెరిగేలా సీఎం కేసీఆర్ ఈ నిధిని ప్రకటించారు. ఏ పార్టీ ప్రభుత్వం వచ్చినా ఈ నిధి నిరంతరాయంగా కొనసాగేలా విధివిధానాలు ప్రకటించారు. నిధిలో విద్యార్థులు, ఎన్జీవోలు, అధికారులు, సమాజం మొత్తాన్ని భాగస్వాములను చేశారు. ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు తమ జీతాల నుంచి ప్రతి నెలా నిర్దేశించిన మొత్తాన్ని ఈ నిధికి జమ చేయాలి. వీరితో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాల సందర్భంగా సంస్థలు, స్కూ ల్ అడ్మిషన్ల సమయంలో విద్యార్థులు, ఎన్జీవోలు తమకు వచ్చే విరాళాల నుంచి ఈ నిధికి డబ్బు జమ చేస్తారు.
భావితరాలు బతకాలంటే..
మొక్కల పెంపకాన్ని సీరియస్గా తీసుకుని ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు సంరక్షణకు పెద్దపీట వేస్తున్నారు. మొక్కల పెంపకం అన్నది సామాజిక బాధ్యత. అడవులను రక్షించుకుంటేనే, కొత్తగా వనాలను పెంచుకుంటేనే భావితరాలు బతుకుతాయి. లేదంటే మానవ సమాజానికి భవిష్యత్తు ఉండదు. అందుకే హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించేలా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకున్నది. మొత్తం లక్ష్యంలో 85శాతం మొక్కలు బతికేలా ప్రజాప్రతినిధులు, అధికారులు బాధ్యత వహించే విధంగా నిబంధనలు అమలు చేస్తున్నది. గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మొక్కలను పంపిణీ చేసేందుకు గ్రామ నర్సరీలను పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. గతంలో మండలానికి మూడు లేదా నాలుగు నర్సరీలను మాత్రమే ఉండేవి. ఇప్పుడు అన్ని గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేసి లక్షల్లో మొక్కలు సిద్ధం చేస్తున్నారు. భిన్న రకాల మొక్కలను ఎంపిక చేసి గ్రామ నర్సరీల్లో సిద్ధం చేస్తున్నారు. గృహ అవసరాలకు, రైతులకు ఉపయోగపడే మొక్కలు, ఇతర ప్రాంతాల్లో నాటే మొక్కలతో పాటు ఇతర లాభదాయకమైన భిన్న రకాలను అందుబాటులోకి తెచ్చి ప్రజలకు ఉచితంగా అందిస్తున్నారు. మొక్కలు నాటడంతో పాటు వాటికి రక్షణగా ట్రీగార్డ్స్ ఏర్పాటు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో 2020 హరితహారంలో 82లక్షలు మొక్కలు నాటారు. 2021లో 90లక్షల మొక్కలు నాటాలని నిర్ణయం తీసుకోగా 90శాతం మేర పూర్తయ్యింది. కామారెడ్డి జిల్లాలో 2020 హరితహారంలో 67.50 లక్షల మొక్కలు నాటారు. 2021 సంవత్సరంలో సుమారు 60 లక్షల మొక్కలు నాటేందుకు నిర్ణయించగా లక్ష్యానికి దరిదాపుల్లో చేరుకున్నారు.
కేసీఆర్ దూరదృష్టి..
చెట్లు సర్వజీవుల మనుగడకు ఆధారభూతమనే విషయాన్ని దూరదృష్టితో సీఎం కేసీఆర్ ఎప్పుడో గమనించారు. అందుకే హరితహారం పేరిట తెలంగాణ తల్లికి పచ్చలహారాన్ని వేయాలనే దృఢ సంకల్పానికి ఏడేండ్ల క్రితమే శ్రీకారం చుట్టారు. 14 ఏండ్లు అలుపెరగని సుదీర్ఘ, వ్యూహాత్మకమైన తెలంగాణ పోరాటాన్ని ముందుకు తీసుకుపోయిన నాటి ఉద్యమ నేత, నేటి ముఖ్యమంత్రి కేసీఆర్… ఎవరూ ఊహించని విధంగా రాష్ర్టాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. రాష్ర్టాన్ని బంగారు తెలంగాణ చేయడంతో పాటుగా తెలంగాణ తల్లికి హరితహారాన్ని వేయడమే ముఖ్య ఉద్దేశంగా నడుం బిగించారు. పూర్వ కాలంలో మౌర్య చక్రవర్తి అశోకుడు తన రాజ్యమంతటా మొక్కలను విస్తృతంగా నాటించాడని చెప్పుకున్నాం. దాదాపు 3వేల ఏండ్ల తర్వాత మళ్లీ అదే ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టిన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే. చెట్లు మానవ జీవనానికి మాత్రమే అవసరం అనుకుంటే పొరపాటు. సమస్త జీవజాతులకు చెట్లు అవసరం. విచక్షణారహితంగా అడవులను నరికివేస్తే మూగజీవాలైన వన్యప్రాణులు నిలువ నీడలేక, తాగడానికి నీరు దొరక్క అలమటించి పోతాయి. దిక్కుతోచక సమీప గ్రామాలపై విరుచుకుడుతాయి. అందుకే సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమం సందర్భంగా వానలు వాపస్ రావాలే… వానరాలు వాపస్ పోవాలే అనే నినాదాన్ని నినదించి జనాన్ని జాగృతం చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం కేసీఆర్ తలపెట్టిన హరిత ఉద్యమానికి హరిత నిధితో మరింత రక్షణ లభించినట్లు అవుతోంది.
పచ్చదనం.. పునరుజ్జీవం..
హరిత నిధి ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు కొనియాడుతున్నారు. ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం సీఎం కేసీఆర్కు మాత్రమే సాధ్యపడుతుందని ప్రశంసిస్తున్నారు. రాబో యే తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలన్న మహత్తర లక్ష్యంతో ప్రారంభించిన ఈ నిధికి విరాళాలు ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలన్నీ హరిత నిధికి నిండు మనసుతో మద్దతు ప్రకటించాయి. మరోవైపు ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు సైతం ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి. సమాజంలోని వివిధ వర్గాల నుంచి వ్యక్తం అవుతున్న స్పందనలు ఉత్సాహపూరిత వాతావరణం కనిపిస్తోంది. హరితనిధిని ఏర్పాటు చేసి, హరిత యజ్ఞంలో భాగస్వామ్యం చేయడంపై ఉద్యోగులు బృహత్తర అవకాశంగా భావిస్తున్నారు. హరితనిధి ఏర్పాటుతో హరితహారం కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మార్గం ఏర్పడింది. ఇదో స్ఫూర్తివంతమైన నిర్ణయమైన పర్యావరణ ప్రేమికులు చెబుతున్నారు. ఈ నిర్ణయం అనేక రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తుందని భావిస్తున్నారు. మొక్కలు నాటే ఉద్యమాన్ని కొనసాగించేందుకు హరితనిధిని ఏర్పాటు చేసి, అందరినీ భాగస్వామ్యం చేయడంపై వాడవాడలో హరితోత్సాహం వ్యక్తమవుతోంది.