బాన్సువాడ : మత్స్య కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నూటికి నూరు శాతం రాయితీపై మత్స్యకార్మికులకు చేప పిల్లలను అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన కొనియాడారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేస్ వీ పాటిల్తో కలిసి పట్టణంలోని కల్కి చెరువులో చేపపిల్లలను విడుదల చేశారు. అనంరతం కల్కిచెరువుపై మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో స్పీకర్ మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి మత్స్యకార్మికులకు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టలేదని అన్నారు. నామ్ కే వాస్తేగా జిల్లాలో కొన్ని చెరువులకు 12 వేల 500 రూపాయల చొప్పున ఇచ్చేవారన్నారు.
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లు , చెరువులు , సాగునీటి వనరులలో రూ. 92 కోట్లతో 100 కోట్ల చేపపిల్లలను ప్రతి ఏటా విడుదల చేస్తుందని వెల్లడించారు. వీటి విలువ పదివేల కోట్ల రూపాయలుంటుందని పేర్కొన్నారు. కులవృత్తుల వారు గౌరవంగా బతకడానికి భారీ సబ్సిడీలతో పథకాలను అమలు చేస్తుందని అన్నారు. ప్రభుత్వం దళారీ వ్యవస్థను శాశ్వతంగా రూపుమాపుడానికి వందశాతం రాయితీ పై సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా చేప పిల్లలను పంపిణీ చేస్తుందని వివరించారు. బాన్సువాడ నియోజక వర్గంలో 27 లక్షల చేపపిల్లలను వివిధ చెరువుల్లో వేస్తున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ జితేష్ వీ పాటిల్ మాట్లాడుతూ చేప పిల్లలను విడుదల చేయడం ద్వారా మత్స్యకారుల కుటుంబాలు ఆర్థికాభివృద్ధిని సాధిస్తున్నాయని పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఆర్డీవో రాజాగౌడ్, తాసీల్దార్ గంగాధర్, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు డాక్టర్ అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, వైస్ చైర్మన్ షేక్ జుబేర్, సొసైటీ అధ్యక్షుడు పిట్ల శ్రీధర్ , కౌన్సిలర్లు నందకిశోర్ , హకీం, శ్రీనివాస్, కిరణ్ ,నాయకులు దొడ్ల వెంకట్రామ్ రెడ్డి, మహ్మద్ ఎజాస్, వాహబ్ , నార్ల ఉదయ్ గుప్తా తదితరులు ఉన్నారు.