ధర్పల్లి, మే 18 ;ఆలోచన ఉండాలే కానీ పనికి రానిదంటూ ఏది ఉండదని, పర్యావరణానికి హానిచేసే ప్లాస్టిక్ను సైతం రీసైక్లింగ్ చేసి ఆదాయం సమకూర్చుకోవచ్చని.. దీంతో నలుగురికి ఉపాధి కల్పించవచ్చని ఆలోచించారు ఆ సర్పంచ్, పంచాయతీ అధికారులు. అనుకున్నదే తడువు ఉన్నతాధికారుల సహకారంతో వారి ఆలోచనకనుగుణంగా రాష్ట్రంలోనే ఎక్కడా లేనివిధంగా ఆ గ్రామపంచాయతీలో ప్లాస్టిక్ను రీసైక్లింగ్ యంత్రాన్ని నెలకొల్పి నలుగురికి ఉపాధి కల్పిస్తూ జీపీకి ఆదాయం సమకూర్చేలా చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఆ గ్రామపంచాయతీ ఏదో కాదు.. నిజామాబాద్ జిల్లాలోని ధర్పల్లి మండల కేంద్రంలోని స్థానిక గ్రామపంచాయతీ.
స్థానిక ధర్పల్లి గ్రామపంచాయతీ, మేజర్ గ్రామపంచాయతీ కావడంతో చెత్తాచెదారం ఎక్కువగా జమవుతూ మురికికాల్వల్లో ప్లాస్టిక్ నిండిపోతూ నీరు నిలిచి దుర్గంధంగా మారేది. దీనికోసం పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది అనునిత్యం ఎంతో శ్రమ పడేవారు. అయిప్పటికీ మురికి కాల్వలను శుభ్రం చేసిన మరుసటి రోజే చెత్త పేరుకపోవడం పరిపాటిగా మారింది. ఈ మురికి కాల్వల ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాలు నీటిని నేలకు ఇంకకుండా చేయడంతోపాటు మురికి కాల్వల ద్వారా చెరువులు, కుంటల్లోకి చేరి జలవనరులు సైతం కలుషితమవుతున్నాయి. ఈ పరిస్థితులకు అడ్డుకట్ట వేయాలని ఆలోచించిన ధర్పల్లి సర్పంచ్ ఆర్మూర్ పెద్దబాల్రాజ్, ఈవో సైఫుద్దీన్, జూనియర్ అసిస్టెంట్ గంగదాస్తో కలిసి స్థానిక పంచాయతీ సభ్యులతో సమావేశమై ప్లాస్టిక్ నివారణ కోసం తీర్మానం చేశారు.
అధికారుల సహకారంతో..
పంచాయతీ వార్డుసభ్యుల తీర్మానాన్ని జిల్లా పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి సూచనలు, సహకారం మేరకు ధర్పల్లిలో ప్రత్యేకంగా ఓ గదిలో ప్లాస్టిక్ రీసైక్లింగ్ యంత్రాన్ని ఏర్పాటు చేశారు. దీనికోసం నలుగురు పారిశుద్ధ్య కార్మికులను ప్రత్యేకంగా నియమించుకొని ప్లాస్టిక్ను రీసైక్లింగ్ చేసి తద్వారా జీపీకి ఆదాయం సమకూరేలా చేశారు.
రోజూ ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ..
గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో వీధుల వెంట, ఇండ్లల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ పారవేయకుండా ప్రజలకు, వ్యాపారులకు అవగాహన కల్పించారు. దీనికోసం నలుగురు పారిశుద్ధ్య కార్మికులను ప్రత్యేకంగా నియమించారు. అనునిత్యం వారికి కేటాయించిన వీధులకు వెళ్లి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి ప్లాస్టిక్ రీసైక్లింగ్ యంత్రంలో వేసి వాటిని పొడి చేస్తారు. ఆ పొడిని హైదరాబాద్లోని ఎన్జీవో కంపెనీకి తరలించి ఆదాయం సమకూర్చేలా చేశారు. ప్లాస్టిక్ సేకరణ రోజురోజుకూ ఎక్కువవ్వడంతో వాటిని వాహనాల ద్వారా నిజామాబాద్ జిల్లా కేంద్రానికి సైతం తరలించి ఆదాయం సమకూరుస్తున్నారు.
దీంతో గ్రామంలో ప్లాస్టిక్ నివారణ జరగడమే గాకుండా నలుగురు పారిశుద్ధ్య సిబ్బందికి ఉపాధి కల్పించినట్లయ్యింది. ప్లాస్టిక్ నివారణ చర్యలపై గ్రామస్తులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఇటీవల డీఎల్పీవో సైతం ప్లాస్టిక్ రీసైక్లింగ్ యంత్రాన్ని పరిశీలించి సర్పంచ్, పంచాయతీ సిబ్బందిని అభినందించారు. పంచాయతీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ రీసైక్లింగ్ యంత్రాన్ని ఏర్పాటు చేయడంతో రాష్ట్రంలోనే ప్రథమమని, ఇక్కడ విజయవంతమైతే ఇలాంటి యంత్రాలు మరికొన్ని జీపీల్లో నెలకొల్పేలా చూస్తామని డీఎల్పీవో తెలిపారు.
ఆదర్శంగా నిలిపేందుకే..
గ్రామస్తుల సహకారంతో ప్లాస్టిక్ను పూర్తిగా నివారించి స్వచ్ఛతకు కేరాఫ్ అడ్రస్గా నిలుపాలన్న లక్ష్యంతో కృషి చేస్తున్నాం. ప్లాస్టిక్ను ఎక్కడా పడేయకుండా, జీపీ ట్రాక్టర్లో వేయాలని గ్రామస్తులకు అవగాహన కల్పించాం. పారిశుద్ధ్య సిబ్బంది సైతం కాలనీల్లో తిరిగి ప్లాస్టిక్ను సేకరించి రీసైక్లింగ్ యంత్రంలో వేస్తున్నారు. దీంతో గ్రామంలో ప్లాస్టిక్ చెత్త లేకుండా పోయింది.
– ఆర్మూర్ పెద్దబాల్రాజ్,సర్పంచ్, ధర్పల్లి