లింగంపేట, మే17: అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం నంబర్వన్ స్థానంలో ఉందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. మండల కేంద్రంలోని సెర్ప్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం జోడెడ్లలా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్ను విమర్శించడమే ఎజెండాగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు అందజేయడం లేదని ప్రశ్నించారు. ధాన్యం సేకరణలో కేంద్ర ప్రభుత్వం బాధ్యతలేకుండా వ్యవహరిస్తున్నదని అన్నారు. కర్ణాటకలో కరెంట్ లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గుజరాత్లో వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ సరఫరా చేయాలని రైతులు ఆందోళన చేస్తున్నట్లు గుర్తుచేశారు. తెలంగాణలో రైతులకు పెట్టుబడి అందించడంతోపాటు సకాలంలో విత్తనాలు, ఎరువులు సరఫరా చేస్తున్నామని తెలిపారు. పల్లె ప్రగతితో గ్రామాలు సాధించిన అభివృద్ధిని ఈ సందర్భంగా వివరించారు.
నియోజకవర్గ అభివృద్ధికి రూ.20.6కోట్లు
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం రూ.20 కోట్ల 60లక్షలు మంజూరైనట్లు తెలిపారు. లింగంపేట మండలానికి రూ.4.1 కోట్లు, గాంధారికి రూ. 4.4 కోట్లు, రామారెడ్డికి రూ. కోటీ 10 లక్షలు, ఎల్లారెడ్డికి రూ.3.1 కోట్లు, తాడ్వాయికి రూ.కోటీ 80 లక్షలు, సదాశివనగర్కు రూ.2.4కోట్లు, రాజంపేటకు రూ. కోటీ 20 లక్షలు, నాగిరెడ్డిపేట మండలానికి రూ.2.5 కోట్ల చొప్పున కేటాయించినట్లు వివరించారు. సమావేశంలో ఎంపీపీ గరీబున్నీసా బేగం, సర్పంచ్ బొల్లు లావణ్య, ఎంపీటీసీ షమీమున్నీసా బేగం, వైస్ ఎంపీపీ విఠల్రెడ్డి, డీసీఎంఎస్ డైరెక్టర్ కపిల్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దివిటి రమేశ్, సొసైటీ చైర్మన్ దేవేందర్రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ మాకం రాములు, ఎంపీడీవో శంకర్, ఎంపీవో ప్రభాకరాచారి, ఏఎంసీ మాజీ చైర్మన్ ప్రతాప్రెడ్డి, నాయకుడు నయీం తదితరులు పాల్గొన్నారు.