మోర్తాడ్/వేల్పూర్, జూలై 6: అభివృద్ధే ధ్యేయంగా తాము పనిచేస్తున్నామని, బాల్కొండ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో ముందు నిలుపుతానని రాష్ట్ర గృహనిర్మాణ, రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. మోర్తాడ్, వేల్పూర్ మండలాల్లో మంత్రి మంగళవారం పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలతోపాటు పల్లెప్రగతిలో పాల్గొన్నారు. మోర్తాడ్ మండలం దోన్పాల్ గ్రామంలో కోటి రూపాయలతో నిర్మించిన 33/11 కేవీ సబ్స్టేషన్ను ప్రారంభించారు. అనంతరం హరితహారంలో భాగంగా సబ్స్టేషన్, ఎస్సీ హాస్టల్ వద్ద మొక్కలను నాటారు. వేల్పూర్లో రూ.9.75కోట్లతో బైపాస్ రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్ పనులకు శంకుస్థాపన చేశారు. ఆయా కార్యక్రమాల అనంతరం మంత్రి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో సాగు, తాగునీటి కొరత లేకుండా చేశామన్నారు. అన్ని రహదారులనూ తారురోడ్లుగా మార్చినట్లు గుర్తుచేశారు. కరెంటు సమస్యలు ఉన్న ప్రాంతాల్లో సబ్స్టేషన్లను నిర్మించుకున్నామని చెప్పారు. కాళేశ్వరం నుంచి ఎస్సారెస్పీలోకి నీటిని తీసుకువస్తున్నామని, ఇక సాగునీటికి ఢోకా ఉండదన్నారు. హన్మంత్రెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా చెరువులను పూర్తిగా నింపేలా చూస్తామన్నారు.
ప్రజల ఆశీర్వాదంతోనే..
తన స్వగ్రామం వేల్పూర్ను అభివృద్ధి చేయడం తన బాధ్యత అని, ఇందుకోసం సీఎం కేసీఆర్ సహకారంతో నిధులు తీసుకువస్తున్నట్లు చెప్పారు. గత పాలకుల హయాంలో, ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధికి తేడాను ప్రజలే గమనిస్తున్నారని అన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా ప్రజల ఆశీర్వాదంతో వారికి సేవలందిస్తున్నట్లు తెలిపారు. మంత్రి పర్యటన సందర్భంగా ఆయా గ్రామాల్లో ప్రజలు ఘన స్వాగతం పలికారు. పలువురు శాలువాలతో సన్మానించారు. ఆయా కార్యక్రమాల్లో డీసీసీబీ వైస్ చైర్మన్ రమేశ్రెడ్డి, ఆర్మూర్ ఆర్డీవో శ్రీనివాసులు, ఎంపీపీలు శివలింగు శ్రీనివాస్, ఎంపీపీ భీమ జమున, జడ్పీటీసీలు బద్దం రవి, అల్లకొండ భారతి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కల్లెడ ఏలియా, రైతుబంధు సమితి మండల కన్వీనర్ పర్స దేవన్న, వైస్ఎంపీపీలు తొగటి శ్రీనివాస్, బోదపల్లి సురేశ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పాపాయి పవన్, సర్పంచులు దేవన్న, తీగల రాధా మోహన్, ఉపసర్పంచ్ పిట్ల సత్యం, ఎంపీటీసీ మొండి మహేశ్, ఆర్టీఏ సభ్యుడు రేగుల్ల రాములు, టీఆర్ఎస్ వేల్పూర్ గ్రామశాఖ అధ్యక్షుడు ప్రతాప్, వీడీసీ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
మిగితా రాష్ర్టాల్లో ఈ పథకాలు ఎందుకు లేవు?
తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు లేవని మంత్రి ప్రశ్నించారు. కరోనా కారణంగా ఆర్థిక పరిస్థితి అతలాకుతలమైనా ఏ ఒక్క పథకాన్ని ఆపలేదని గుర్తుచేశారు. అభివృద్ధిలో రాష్ట్రం దూసుకుపోతుంటే ఇతర పార్టీల నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అగౌరవంగా మాట్లాడే వారి పనిపట్టాలని మంత్రి పిలుపునిచ్చారు.