నిజామాబాద్, జూన్ 26, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఒకప్పుడు సాగు సీజన్లో రైతులు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. పైసల కోసం వడ్డీ వ్యాపారులు, బ్యాంకుల చుట్టూ తిరిగి విసిగి వేసారిన వారంతా చివరకు ఫెర్టిలైజర్స్ షాపుల్లోనూ ఉద్దెర పెట్టుకుని విత్తనాలు, ఎరువులు పొందేవారు. ఇదే అదనుగా ఫెర్టిలైజర్స్ యజమానులు సైతం రైతన్నలను నిలువునా దోపిడీకి గురి చేసేది. ఎక్కువ ధరలకు ఎరువులు, విత్తనాలను అప్పగించడంతోపాటు వడ్డీ పేరిట అధిక దోపిడీ సైతం పాల్పడేవారు. రైతుబంధు పెట్టుబడి సాయం పథకంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 5లక్షల 30వేల 865 మంది రైతులకు ఏటా ఎకరాకు రూ.10వేలు ఆర్థిక సాయం అందుతుండడంతో రైతులకు రుణ గోస తప్పింది. సాగుకు ప్రభుత్వం అందిస్తున్న సాయం సమయానికి రైతు చేతికి వస్తుండడంతో వడ్డీ వ్యాపారులు సైతం నివ్వెరపోతున్నారు. ఉద్దెర ఇచ్చేవారున్నప్పటికీ తీసుకునే రైతులే కనిపించకపోవడంతో దుకాణాదారులు సైతం విస్తూ పోతున్నారు. ఏటా వానకాలం, యాసంగి సీజన్ వచ్చిందంటే చాలు ఠక్కున వడ్డీ వ్యాపారుల ఇండ్లల్ల్లో రైతన్నలు దర్శనం ఇచ్చేది. లేదంటే వడ్డీ వ్యాపారులే రైతుల ఇండ్లకు చక్కర్లు కొట్టేది. వారి కష్టాన్ని సొమ్ము చేసుకుంటూ పబ్బం గడిపే వడ్డీరాయుళ్లకు పెట్టుబడి సాయంతో చెక్ పడింది.
రుణ సంకెళ్లు బద్దలు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏటా వానకాలం, యాసంగి రెండు పంటలు సమృద్ధిగా పండుతాయి. సాగునీటి అవకాశాలను బట్టి రైతులు పొలంబాట పట్టడం పరిపాటే. అయితే, సీజన్ ముంచుకొస్తుందంటేనే రైతున్నకు దడ పుట్టేది. పెట్టుబడికి చిల్లిగవ్వ లేక నానా తంటాలు పడేది. గత సీజన్ పంటంతా ఏకంగా వడ్డీలు, అప్పుల చెల్లింపులకే సరిపోయేది. చాలీచాలని లాభాలు కాస్త కుటుంబ పోషణకు సరిపోగా తదుపరి పంట పెట్టుబడి పెట్టేందుకు మాత్రం పైసా మిగిలేదు కాదు. దీంతో దిక్కులేక రైతులు గ్రామంలో పెద్దలను ఆశ్రయించాల్సి వచ్చేది. రూ.2 నుంచి రూ.4 వడ్డీతో రుణబందీలుగా మారి సతమతమయ్యేది. తీరా చేసేది లేక రుణవిముక్తి కోసం బలవన్మరణాలకు పాల్పడే గడ్డు పరిస్థితులు గత పాలకుల సమయంలో కోకొల్లలుగా వెలుగు చూశాయి. ఇలాంటి గడ్డు పరిస్థితులకు సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన సంస్కరణలతో అడ్డుకట్ట పడింది. ఏడేండ్ల కాలంలో రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్నారు. వ్యవసాయాన్ని పండుగగా మార్చి రైతుల రుణ సంకెళ్లను బద్దలు కొట్టారు. రైతుబంధు పథకంతో కర్షకుల్లో ఆత్మైస్థెర్యాన్ని నింపుతున్నారు.
పల్లెల్లో సాగు జాతర…
రైతుబంధు పథకం ప్రారంభమైన నాటి నుంచి పల్లెల్లో సాగు జాతర నడుస్తోంది. వానకాలం పంటల సీజన్కు రోజులు దగ్గర పడుతుండడంతో చేతిలోకి వచ్చిన పెట్టుబడి సాయంతో అన్నదాతలు మురిసిపోతున్నారు. ఇన్నాళ్ల పాటు బ్యాంకులు, వడ్డీ వ్యాపారుల వద్ద పెట్టుబడులు సమకూర్చుకున్న రైతులు… ప్రభుత్వ సాయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు వచ్చిన డబ్బును ఖర్చుచేయకుండా పెట్టుబడులకు సర్దుకుంటున్నారు. రైతుబంధు సాయంతో ఆర్థిక ఇబ్బందులు తీరాయని చిన్న, సన్నకారు రైతులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాగు సమయం దగ్గర పడుతుంటే గతంలో ఆందోళన ఉండేదని, ఇప్పుడు సమయానికి ముందే చేతికి డబ్బు రావడంతో భరోసాగా ఉందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. కర్షకులు అనేక రకాల సమస్యలతో ఇబ్బందులకు గురవుతుండగా సీఎం కేసీఆర్ విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చారు. తద్వారా సాగు రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్నారు.
పెరిగిన రైతుల సంఖ్య…
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో చిన్న, సన్నకారు రైతులే ఎక్కువ. ఎకరం నుంచి రెండున్నర ఎకరాల భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగించే కుటుంబాలు సగానికి ఎక్కువ మందే ఉన్నారు. పంట సీజన్లో సామాన్య రైతులకు పెట్టుబడికి పైసల్లేక సాగును వదిలేసిన వారు ఎందరో ఉన్నారు. ప్రభుత్వమే రైతుబంధు ఇస్తుండడంతో చిన్న, సన్నకారు రైతులకు ఊరట దక్కుతోంది. పెట్టుబడి డబ్బులు ఢోకా లేకపోవడంతో బీడు భూములను ధైర్యంగా సాగు చేస్తున్నారు. ఫలితంగా పంటల సాగు విస్తీర్ణం పెరగడంతో పాటుగా ఉత్పత్తి సైతం గణనీయంగా పెరుగుతోంది. 2018, మే 10న ప్రారంభించిన రైతుబంధు పథకం ఇప్పటి వరకు ఆరు విడుతలుగా విజయవంతంగా సాగింది. ఏడో విడుతగా రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని జమ చేశారు. నిజామాబాద్ జిల్లాలో 2019 వానకాలంలో 2.39లక్షల మంది రైతులు మాత్రమే ఉన్నారు. 2019 యాసంగికి ఈ సంఖ్య 2.55లక్షలకు చేరింది. 2021 వానకాలానికి రైతుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం రైతుబంధు ద్వారా 2లక్షల 61వేల 273 మందికి లబ్ధి చేకూరడం విశేషం. కామారెడ్డి జిల్లాలోనూ 2019 వానకాలంలో 2.49 లక్షల మంది ఉండగా, ఇదే ఏడాది యాసంగికి 2.60 లక్షలకు రైతుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం 2021 వానకాలం సీజన్ నాటికి 2లక్షల 69వేల 592 మంది రైతులు ఉండడం ఈ పథకం ప్రాధాన్యతను తెలియజేస్తున్నది.
రైతుబంధుతో రంది పోయింది..
తెలంగాణ రాష్ట్రం అచ్చినంక, సీఎం కేసీఆర్ సారు రైతులకు అన్ని మంచి పనులు అయితున్నయి. ముఖ్యంగా గతంలో వానకాలం పంటలు వచ్చినయంటే సేటు దగ్గర అప్పు చేయవడుతుండే. రైతుబంధు వచ్చినంక నాకు బాకీ రంది పోయింది. అచ్చిన పైసలతోటి మందు సంచులు, విత్తనాలు తెచ్చుకుని హాయిగా ఎవుసం చేసుకుంటున్నాం. బాకీ కోసం ఎదురుచూసే పని లేకుండా రైతు బంధు పథకం పెట్టిన కేసీఆర్ సార్ను ఎప్పటికీ మర్చిపోము. మన అన్న తమ్ముడు అసుంటుంది పనిఉందంటే పది రూపాయలు సాయం చెయ్యరు. అందరికీ దేవునిలెక్కన రైతుబంధు పథకం పెట్టి సీఎం కేసీఆర్ సారు రైతులకు దేవుడయిండు.
-గౌరారం బసుగొండ, నాగారం ( బాన్సువాడ మండలం)