(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. దవాఖానల్లో వైరస్ తీవ్రతతో చేరుతున్న వారి సంఖ్య ఎక్కువవుతున్నది. ఈ పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా తీసుకోవాల్సిన అత్యవసర జాగ్రత్తలపై ఉభయ జిల్లాల కలెక్టర్లతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం సమీక్ష నిర్వహించారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు నారాయణ రెడ్డి, డాక్టర్ ఎ.శరత్తో ఫోన్లో మాట్లాడిన కవిత… రెండు జిల్లాల్లో తాజా పరిస్థితిపై వివరాలను ఆరా తీశారు. కొవిడ్-19 వ్యాప్తి, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో దవాఖానలకు వస్తున్న కరోనా బాధితుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో రెమ్డెసివిర్ ఔషధం కొరత లేకుండా ఎమ్మెల్సీ కవిత చొరవ చూపారు. ముందస్తుగా వేయి డోసుల రెమ్డెసివిర్ను నిజామాబాద్ జిల్లాకు పంపేందుకు సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో ఆమె మాట్లాడారు. శనివారం రెమ్డెసివిర్ ఔషధం నిజామాబాద్ జిల్లాకు చేరనున్నది.
సరిహద్దులో జాగ్రత్త…
కరోనా బాధితులకు మెరుగైన సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలా సిద్ధంగా ఉందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల జిల్లాల్లో కొవిడ్-19 పరిస్థితిపై కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షలో పలు విషయాలను చర్చించారు. నిజామాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి, కామారెడ్డి కలెక్టర్ శరత్, జగిత్యాల కలెక్టర్ రవితో ఫోన్లో మాట్లాడి కరోనా పరీక్షలు, చికిత్స, దవాఖానల్లో సదుపాయాలు తదితర అంశాలపై చర్చించారు. మహారాష్ట్రలో కరోనా తీవ్రత తీవ్రంగా ఉన్నందున సరిహద్దు ప్రాంతాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కరోనా బారిన పడకుండా స్వీయ నియంత్రణ చర్యలు పాటించాలని హితవు పలికారు. కరోనా సోకిన వారు ఆందోళన చెందకుండా వైద్య సాయాన్ని పొందాలని సూచించారు.
ప్రైవేటులో అదనపు బెడ్లు..
కరోనా కేసుల పెరుగుదల ఇదే విధంగా నమోదైతే భవిష్యత్తులో వైద్య సాయానికి ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు ఎమ్మెల్సీ కవిత ప్రైవేటు దవాఖానల్లోనూ అదనంగా బెడ్లు సమకూర్చాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ దవాఖానలతో పాటు నిజామాబాద్ ప్రైవేటు వైద్యశాలల్లో 1200 బెడ్లు, కామారెడ్డి ప్రైవేటు దవాఖానాల్లో 400, జగిత్యాల ప్రైవేటు దవాఖానల్లో 400 బెడ్ల చొప్పున కరోనా పేషెంట్ల కోసం సిద్ధంగా ఉన్నాయని ఎమ్మెల్సీ కవితకు అధికారులు వివరించారు. జిల్లాల్లోని అన్ని దవాఖానల్లో తగినన్ని ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు అందుబాటులో ఉంచాలని ఎమ్మెల్సీ సూచించారు. దవాఖానల్లో కరోనా పేషెంట్లకు తాగునీరు, ఆహారం, బెడ్లు, దుప్పట్లు, ఇతర సదుపాయాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. అంబులెన్సులను కూడా 24 గంటలూ అందుబాటులో ఉంచుకోవాలని, అవసరాన్ని బట్టి ఎప్పటికప్పుడు వాటిని ఉపయోగించుకోవాలని సూచించారు.
కరోనా నియంత్రణపై నేడు మంత్రి సమీక్ష
కరోనా కేసుల విస్తృతి నేపథ్యంలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి శనివారం ఉభయ జిల్లాల యంత్రాంగంతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. మొదట కామారెడ్డి జిల్లాలో ఉదయం 10 గంటలకు కలెక్టర్ నేతృత్వంలో ఆయా శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు నిజామాబాద్ జిల్లాలోని కలెక్టరేట్లోని ప్రగతిభవన్ మీటింగ్ హాల్లో జిల్లా యంత్రాంగంతో సమీక్ష చేపడతారు. ఇందులో ప్రధానంగా కరోనా కేసులు, వైద్య సహాయం, వాక్సినేషన్ అంశాలపై కీలకంగా చర్చించనున్నారు.
ఇవీ కూడా చదవండీ…
గతేడాదిలాగే ఎస్సెస్సీ గ్రేడ్స్!