కామారెడ్డి టౌన్, మే 5: జిల్లాలో ఇంటింటి సర్వే చేపట్టాలని, ఆరోగ్య పరిస్థితులను నమోదు చేయాలని కామారెడ్డి కలెక్టర్ శరత్ అధికారులకు ఆదేశించారు. కామారెడ్డిలోని జనహిత భవన్లో జిల్లాలోని రెవెన్యూ, పంచాయతీ, మున్సిపల్ అధికారులతో బుధవారం కొవిడ్ నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై బుధవారం సమీక్షించారు. కొవిడ్ లక్షణాలు ఉన్న వారికి ఐసొలేషన్ కిట్లు అందజేయాలన్నారు. సర్వే కోసం మెడికల్ ఆఫీసర్లు, హెల్త్ సూపర్వైజర్ల పర్యవేక్షణలో గ్రామస్థాయిలో ఏఎన్ఎం, ఆశ కార్యకర్త, వీఆర్ఏతో, మున్సిపాలిటీల్లో ఏఎన్ఎం, మున్సిపల్, మెప్మా, అంగన్వాడీ సిబ్బందితో బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. మెడికల్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో ఎంపీవో, తహసీల్దార్లు హెల్త్ టీములకు శిక్షణ అందించాలని సూచించారు. కరోనా లక్షణాలు ఉన్న వారిని నాలుగు రోజుల పాటు ఉదయం, సాయంత్రం పరీక్షించాలని, అప్పుడు కూడా లక్షణాలు ఉంటే స్టెరాయిడ్స్ అందించాలని సూచించారు. జిల్లాలోని అన్ని దవాఖానలను గురువారం సాయంత్రలోపు శుభ్రం చేయాలని ఆదేశించారు. దవాఖానల్లోని లైట్లు వెలిగేలా, ఫ్యాన్లు పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో ఆర్టీఏ, ఎక్సైజ్ సిబ్బంది సమన్వయంతో వాహనాల రాకపోకలపై నిఘా పెంచాలని సూచించారు. ఆక్సిజన్ సిలిండర్ల వినియోగంపై దృష్టి సారించాలని, అనధికార సిలిండర్ల కలిగి ఉంటే స్వాధీనం చేసుకోవాలన్నారు. పాజిటివ్ వ్యక్తులు ఇండ్లలోనే ఉంటున్నారా..? మందులు వాడుతున్నారా..? తదితర అంశాలపై ప్రతిరోజూ నివేదికలు తెప్పించుకోవాలని డీపీవోను ఆదేశించారు. కొవిడ్పై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తడి, పొడి సేకరణ, సురక్షా కామారెడ్డి అంశాలపై ఆడియో రూపొందించి ప్రచారం చేయాలని డీపీవో, మున్సిపల్ కమిషనర్లకు కలెక్టర్ సూచించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, జిల్లా ఇన్చార్జి అదనపు కలెక్టర్ బి. వెంకట మాధవరావు, ఆర్డీవో ఎస్.శ్రీను, డీఎంహెచ్వో చంద్రశేఖర్, జిల్లా ఏరియా దవాఖాన కో-ఆర్టినేటర్ డాక్టర్ అజయ్కుమార్, మున్సిపల్ కమిషనర్ దేవేందర్, డీపీవో సాయన్న, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు