కలెక్టర్కు భర్తపై ఫిర్యాదు చేసిన బాధితురాలు
నిజామాబాద్ క్రైం, ఫిబ్రవరి 7 : అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేస్తున్న భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని భార్య నిజామాబాద్ కలెక్టర్కు సోమవారం ఫిర్యాదు చేసింది. బాధితురాలు తెలిపిన వివరాలు ప్రకారం.. ఆర్మూర్ పట్టణానికి చెందిన స్రవంతికి గంగాసాగర్తో 2017లో వివాహం అయ్యింది. ప్రస్తుతం వారికి నాలుగేండ్ల బాబు ఉన్నాడు. బాబు పుట్టిన నెల రోజుల నుంచే భర్తతో పాటు అత్త సరస్వతి, మామ గంగాధర్ అదనపు కట్నం తీసుకురావాలంటూ మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారు. స్రవంతికి స్కిన్ ఎలర్జీ ఉండడంతో చికిత్స పేరుతో గంగాసాగర్ స్టెరాయిడ్ ఇంజక్షన్లు ఇస్తూ అరాచకానికి పాల్పడుతున్నాడు. తనకు జరిగిన అన్యాయంపై జనవరి 24వ తేదీన ఆర్మూర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. న్యాయం జరగకపోగా ఫిర్యాదును తారుమారు చేశారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. స్టెరాయిడ్స్ ఇస్తున్న విషయాన్ని బంధువులకు చెప్పడంతో కత్తితో చంపేందుకు వచ్చాడని వాపోయింది. ఆర్మూర్ పట్టణంలోని ఓ ప్రైవేటు దవాఖానలో కంపౌండర్గా పని చేస్తున్న తన భర్త గంగాసాగర్ ఎటువంటి అనుమతులు లేకుండా ఆర్ఎంపీగా క్లినిక్ నిర్వహిస్తున్నాడని ఆమె తెలిపింది. తన భర్త తరఫున వచ్చిన ఓ వ్యకి తరచూ ఫోన్ చేసి మీరు ఎక్కడికి వెళ్లినా తమకు ఏమీ కాదంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని తెలిపింది. తనను ఇబ్బందులకు గురి చేస్తున్న భర్త, అత్త, మామలపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలంటూ బాధితురాలు స్రవంతి సోమవారం కలెక్టర్కు ఫిర్యాదు చేసింది.