ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద
శ్రీరాంసాగర్ గేట్లు మూసివేత
కల్యాణి, అలీసాగర్ గేట్ల ఎత్తివేత
మెండోరా, జూలై 24: నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి జిల్లాలోని జలాశయాలు నిండుకుండల్లా మారాయి. ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ఫ్లో కొనసాగుతుండడంతో పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ఫ్లో తగ్గిపోవడంతో శనివారం సాయంత్రం గేట్లను మూసివేసినట్లు ఏఈఈ వంశీ తెలిపారు.ఎగువ ప్రాంతాల నుంచి 51,980 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతోందన్నారు. ప్రాజెక్ట్ నీటి సామర్థ్యానికి తక్కువగా ఉండడంతో వరద నీటిని పూర్తిస్థాయిలో నిల్వ చేస్తామన్నారు. సాయంత్రం 6.48 గంటలకు నీటివిడుదలను నిలిపినట్లు తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా శనివారం సాయంత్రానికి 1089.20 అడుగుల (80.658 టీఎంసీలు) వద్ద ఉన్నదని పేర్కొన్నారు. కాకతీయ కాలువతో జెన్కో కేంద్రం విద్యుత్ ఉత్పత్తి కోసం ఎనిమిది వేల క్యూసెక్కులు గోదావరిలోకి నీటి విడుదల కొనసాగుతున్నదని పేర్కొన్నారు. మిషన్ భగీరథ కోసం 152 క్యూసెక్కులు వినియోగిస్తున్నారని తెలిపారు. ఆవిరి, లీకేజీ రూపంలో 617 క్యూసెక్కులు పోతుందన్నారు.
నీటి విడుదల కొనసాగిందిలా
శుక్రవారం అర్ధరాత్రి ఒంటి గంటకు 2,15,780 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా 35 వరద గేట్లు ఎత్తి 2,20,380 క్యూసెక్కులు వదిలారు. క్రమంగా ఇన్ఫ్లో తగ్గుతుండడంతో శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు 25 గేట్లకు తగ్గించి మిగులు జలాల విడుదలను 1,17,720 క్యూసెక్కులకు తగ్గించారు. సాయంకాలానికి వరద ఉధృతి తగ్గడంతో 17 గేట్లు ఎత్తి 49,900 క్యూసెక్కుల మిగులు జలాలను దిగువకు విడుదల చేశారు.
నిజాంసాగర్, సింగీతం, కౌలాస్నాలాకు ఇన్ఫ్లో..
నిజాంసాగర్, జూలై 24: నిజాంసాగర్ ప్రాజెక్టులోకి శనివారం సాయంత్రానికి ఎగువ ప్రాంతం నుంచి 10590 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నట్లు ఏఈ శివకుమార్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1405.00 అడుగులు (17.80 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1398.16 అడుగుల (9.48 టీఎంసీలు) వద్ద ఉన్నదని పేర్కొన్నారు. సింగీతం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం (416.550 మీటర్లు)తో ఉండగా ఎగువ ప్రాంతం నుంచి 2108 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నదని తెలిపారు. మూడు వరద గేట్ల ద్వారా 425 క్యూసెక్కుల నీటిని నిజాంసాగర్ ప్రధాన కాలువకు విడుదల చేయగా.. 1683 క్యూసెక్కుల నీరు మంజీరలోకి ప్రవహిస్తున్నట్లు వివరించారు.జుక్కల్ మండలంలోని కౌలాస్నాలా ప్రాజెక్టులో శనివారం సాయంత్రానికి 458.00 మీటర్లు (1.237 టీఎంసీలు) పూర్తిస్థాయి నీటి మట్టంతో ఉండగా ఎగువ ప్రాంతం నుంచి 1404 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు మూడు వరద గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.
పోచారంలోకి వరద రాక
నాగిరెడ్డిపేట్ , జూలై 24 : మండలంలోని పోచారం ప్రాజెక్టుకు ఇన్ఫ్లో కొనసాగుతున్నది. శనివారం ప్రాజెక్టు లోకి 2743 క్యూసెక్కుల నీరు వస్తున్నట్లు డీఈ వెంకటేశ్వర్లు తెలిపారు. ఎగువ ప్రాంతాలైన గాంధారి , లింగంపేట్, గుండారం ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురవడంతో ఇన్ ఫ్లో వస్తున్నది. ప్రాజెక్టు గేట్ల ద్వారా 150 క్యూసెక్కుల నీటిని వదలినట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టు సామర్థ్యం 1.8 20 టీఎంసీలు (1464 ఎంసీఎఫ్టీ )గా ఉంది. ప్రాజెక్టు 21 అడుగుల నీటితో కళకళలాడుతోంది. పోచారం ప్రా జెక్టు పొంగిపొర్లుతుండడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎస్సై ఆంజనేయులు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.