Most Millionaire’s | అత్యంత కోటీశ్వరులున్న నగరాల జాబితాలో భారతీయ నగరాలకు సైతం దక్కింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ నగరాల్లోని కోటీశ్వరుల సంఖ్యతో పాటు సంపద విలువపై ప్రముఖ ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీ హెన్లీ అండ్ పార్ట్నర్స్ తాజాగా సర్వే చేపట్టింది. అధ్యయన వివరాలతో కోటీశ్వరులు, అపరకుబేరులుంటున్న ప్రముఖ 50 నగరాల పేర్లను విడుదల చేసింది. ఈ జాబితాలో అమెరికాకు చెందిన 11 నగరాలున్నాయి. ఈ జాబితాలో ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాలకు స్థానం దక్కింది.
నగరాల జాబితాలో న్యూయార్క్ సిటీ తొలిస్థానంలో నిలిచింది. ఈ నగరంలో 3,49,500 మంది కుబేరులు నివస్తిన్నట్లుగా హెన్లీ పార్టనర్స్ నివేదిక పేర్కొంది. గత పదేళ్లతో కోటీశ్వరుల సంఖ్య 48 శాతం పెరిగింది. న్యూయార్క్ నగరంలోని ప్రతి 24 మందిలో ఒకరు కోటీశ్వరులున్నారు. 2013లో ప్రతి 36 మందిలో ఒకరు మాత్రమే సంపన్నులుండేవారు. ఈ జాబితాలో భారత్లోని ముంబయి, ఢిల్లీ నగరాలకు చోటుదక్కింది.
దేశ ఆర్థిక రాజధాని ముంబయి నగరంలో 58,800 మంది కోటీశ్వరులున్నారు. అలాగే, 236 మంది శత కోటీశ్వరులు (రూ.800కోట్లు).. 29 మంది అపర కుబేరులు (రూ.8వేలకోట్లు) నివాసం ఉంటున్నట్లుగా నివేదిక పేర్కొంది. ఢిల్లీలో 30,700 మంది కోటీశ్వర్లు, 123 మంది శత కోటీశ్వరులు, 16 మంది అపర కుబేరులున్నారు. 2013తో పోలిస్తే ముంబయిలో కోటీశ్వరుల సంఖ్య 82శాతం, ఢిల్లీలో 95శాతం పెరిగింది. ప్రపంచ కుబేరులున్న నగరాల జాబితాలో ముంబయి 31, ఢిల్లీ నగరానికి 32వ స్థానం దక్కింది.
ప్రపంచంలో మిలియనీర్ల అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో గార్డెన్ సిటీ, సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పిలుకునే బెంగళూరుకు సైతం చోటు దక్కింది. గ్లోబల్ టెక్ దిగ్గజాలు ఇన్ఫోసిస్, విప్రోలతో పాటు పలు కంపెనీలున్నాయి. ఇక్కడ 13,200 మంది కోటీశ్వర్లున్నారు. చైనాలోని ప్రధాన నగరాల్లో కోటీశ్వరుల సంఖ్య భారీగా పెరిగినట్లు హెన్లీ అండ్ పార్ట్నర్స్ అధ్యయనంలో తేలింది. షెంజెన్ నగరంలో గత పదేళ్లతో పోలిస్తే ఏకంగా 140శాతం మిలియనీర్ల సంఖ్య పెరిగింది.