Air India | ఎయిర్ ఇండియా సిబ్బంది మూకుమ్మబడిగా సెలవులు పెట్టారు. దీంతో పెద్ద ఎత్తున విమానాలను ఎయిర్ ఇండియా రద్దు చేసింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు దేశంలోని వివిధ నగరాలతో పాటు విదేశాలకు వెళ్లాల్సిన సైతం విమానాలు రద్దయ్యాయి. సిబ్బంది చివరి నిమిషంలో సెలవు పెట్టడంతో విమానాలను నడపడం సాధ్యం కావడం లేదని.. అసౌకర్యానికి క్షమించాలని కోరింది. అయితే, విమానాల రద్దుకు సంబంధించి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ను నివేదిక కోరింది. తక్షణమే సమస్యను పరిష్కరించాలని సూచించింది. డీజీసీఏ సూచనల మేరకు ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలని చెప్పింది.
ఎయిర్ ఇండియా సిబ్బంది అంతా ఆరోగ్య సమస్యల పేరుతూ సెలవులపై వెళ్లారు. ఈ క్రమంలో విమానాలు రద్దయ్యాయి. దీనిపై సివిల్ ఏవియేషన్ అధికారులు నిఘా పెట్టారు. టాటాగ్రూప్ యూనిట్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్.. ఏఐఎక్స్ కనెక్ట్ (గతంలో ఎయిర్ ఏషియా ఇండియా)ని విలీనం చేసేందుకు ప్రయత్నిస్తున్నది. దీనిపై ఎయిర్లైన్స్ సిబ్బంది కొంతకాలంగా ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అంతర్జాతీయ విమానాలను చివరి నిమిషంలో రద్దు చేయడంపై కేరళలోని విమానాశ్రయంలో ప్రయాణికులు నిరసనకు దిగారు. మరో వైపు ప్రయాణికుల నిరసనల మధ్య రాజకీయ పార్టీలు సైతం విమానాల రద్దుపై స్పందించాయి.
వెంటనే ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. సమస్య పరిష్కారానికి కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలని కాంగ్రెస్, సీపీఐ పార్టీలు డిమాండ్ చేశాయి. కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు లేఖ రశారు. ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లను చేసేందుకు జోక్యం చేసుకోవాలని కోరారు. చాలా మంది ప్రయాణికులు విమానాశ్రయాలకు చేరుకున్న తర్వాతే విమానాల రద్దు విషయం తెలిసిందని సతీశన్ తన లేఖలో పేర్కొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి బినయ్ విశ్వం కూడా ప్రయాణికుల ప్రయాణ సమస్యలను పరిష్కరించేందుకు మంత్రిత్వ శాఖ వెంటనే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.