రంగారెడ్డి, జూలై 27 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో బుల్లెట్ట్రైన్ లొల్లి మొదలైంది. శంషాబాద్ కేంద్రంగా ముంబై, బెంగళూరు, చెన్నై ప్రాంతాలకు వాటిని నడిపించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రత్యేక లైన్ల కోసం శంషాబాద్, కందుకూరు, యాచారం మండలాల్లో ఇప్పటికే అధికారులు మా ర్కింగ్ చేయగా..భూములను సేకరించాల్సి ఉన్నది. ఇప్పటికే శంషాబాద్ మండలంలోని సుల్తాన్పల్లి, కేబిదొడ్డి గ్రామాల్లో శాట్లైట్ ద్వారా అధికారులు రైల్వేలైన్ కోసం సర్వే నిర్వహించారు.
అలాగే, యా చారం మండలంలోని చింతపట్ల, కొత్తపల్లి, నల్లవెల్లి తదితర గ్రామాల్లోనూ ప్రత్యేక సర్వే నిర్వహిం చి హద్దులు గుర్తించడంతో మరోమారు భూసేకరణ చేయాలని అధికారులు నిర్ణయం తీసుకోవడంతో బాధిత రైతుల్లో అలజడి మొదలైంది. ఇప్పటికే జిల్లా లో భారత్ ఫ్యూచర్సిటీ, గ్రీన్ఫీల్డ్ రోడ్డుతోపాటు రేడియల్ రోడ్లకోసం భూసేకరణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా బుల్లెట్ ట్రైన్లకోసం మరోమారు భూసేకరణ చేసేందుకు సర్కార్ సిద్ధం కావడంతో రైతులు అయోమయ స్థితిలో ఉన్నారు.
శంషాబాద్ మండలంలోని బహదూర్గూడలో గ్రా మంలో సేకరించిన 650 ఎకరాల నుంచి బుల్లెట్ ట్రైన్లకోసం 450 ఎకరాలను కేటాయించేందుకు ప్రభుత్వం సూచనప్రాయంగా అంగీకరించింది. అలాగే, మెట్రో రైల్ కోసం మరో యాభై ఎకరాలు, ఎలక్ట్రిక్ బస్సు టెర్నినల్ కోసం మరో వంద ఎకరాలను కేటాయించా రు. దీంతో శంషాబాద్ కేంద్రంగా బుల్లెట్ ట్రైన్ల ఏర్పాటు తథ్యమైంది.
జిల్లాలో బుల్లెట్ ట్రైన్ల ఏర్పాటు కోసం చేపట్టే భూసేకరణను అడ్డుకునేందుకు యాచారం, కందుకూరు, శం షాబాద్ మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన రైతు లు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. బుల్లెట్ ట్రైన్ల లైన్ల కోసం కోల్పోయే భూములు ఎక్కువగా పట్టా భూము లుండటంతో వారు భూములిచ్చేందుకు నిరాకరిస్తున్నారు. రాజకీయాలకతీతంగా జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ)ని ఏర్పాటై పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.
శంషాబాద్ కేంద్రంగా పలు ప్రాంతాలకు నడపనున్న బుల్లెట్ ట్రైన్ల కోసం తమ భూములను తీసుకోవద్దంటూ సోమవారం శంషాబాద్ మండలంలోని సుల్తాన్పూర్, కేబీదొడ్డి గ్రామాలకు చెందిన రైతులు కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో కలెక్టర్ నారాయణరెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు. ఇప్పటికే శంషాబాద్లో బుల్లెట్ ట్రైన్ల కేంద్రంతోపాటు పలు అవసరాల కోసం బహదూర్గూడలో 650 ఎకరాలను సేకరించారని, అలాగే, ఇతర అవసరాల పేరుతో మరికొంత ప్రభుత్వ భూములను సేకరించారని తెలిపారు. తమకున్న కొద్దిపాటి భూమిని కూడా బుల్లెట్ ట్రైన్ల కోసం తీసుకుంటే ఎలా బతకాలని.. కలెక్టర్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. బలవంతంగా భూసేకరణ చేస్తే అడ్డుకుంటామని పేర్కొన్నారు.