నల్లగొండ : దేశ రాజకీయాల్లో దమ్మున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. PMGSY, జీవవైవిధ్య కమిటీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా సోమవారం చిట్యాల మండలం నేరడ-ఎలికట్టె గ్రామ సరిహద్దుల్లో రోడ్డుకు ఇరువైపులా ఎమ్మెల్యే ఇరు గ్రామాల ప్రజలతో కలిసి మొక్కలు నాటారు. తొలుత నేరడ గ్రామంలోని ఎస్సీ కాలనీ మహిళలతో ఎమ్మెల్యే మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో పేరుకుపోయిన అన్ని సమస్యలను త్వరత్వరగతిన పూర్తి చేస్తామని తెలిపారు.
కాలనీలో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు.
గతంలో ఏ ప్రభుత్వాలు, ఏ ముఖ్యమంత్రులు చేయని సాహసోపేతమైన నిర్ణయాలతో సీఎం కేసీఆర్ అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. ప్రతి మండలంలో లక్ష మొక్కలను నాటడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామాల్లో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను దశలవారీగా సమకూర్చుతామని తెలిపారు.