కామారెడ్డి టౌన్, జూలై 27: పల్లెప్రగతితోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభ అన్నారు. జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యంపై మంగళవారం స్థాయీ సంఘ సమావేశం నిర్వహించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 20లక్షల మొక్కలు నాటామని, జిల్లాలో ప్రతినెలా రూ.32కోట్ల విలువైన పెన్షన్లను అందజేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉపాధిహామీలో జిల్లా.. రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. అనంతరం సభ్యులు మాట్లాడుతూ.. పీఆర్, ఆర్అండ్బీ అధికారులు సమన్వయంతో రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలని సూచించారు. చైర్పర్సన్ శోభ మాట్లాడుతూ.. నాలుగో విడుత పల్లెప్రగతితో గ్రామాల్లో మంచి ఫలితాలు వచ్చాయని చెప్పారు. పంచాయతీరాజ్ శాఖ అధికారులు మాట్లాడుతూ.. జిల్లాలో రూ.1.38 కోట్ల విరాళాలు వచ్చాయని, 140 బాడీ ఫ్రీజర్లు, 41 వైకుంఠరథాలను దాతలు సమకూర్చినట్లు తెలిపారు.
విద్యాశాఖ అధికారులు మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పుస్తకాలను అందజేసినట్లు చెప్పారు. కరోనా నేపథ్యంలో ఆన్లైన్లో బోధన జరుగుతున్నదని తెలిపారు. జిల్లాలో 45 శాతం కరోనా టీకాల పంపిణీ పూర్తి అయ్యిందని వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు. కేసీఆర్కిట్ పథకంతో దవాఖానల్లో 71 శాతం ప్రసవాల సంఖ్య పెరిగిందని చెప్పారు. నాగిరెడ్డిపేట జడ్పీటీసీ మనోహర్రెడ్డి మాట్లాడుతూ.. గాయత్రీ షుగర్స్తో గ్రామాల్లో కాలుష్య వాతావరణం ఏర్పడుతున్నదని, చర్యలు తీసుకోవాలని కాలుష్య నియంత్రణ అధికారికి సూచించారు. వర్షాల వల్ల దెబ్బతిన్న చెరువులు, కుంటలకు మరమ్మతులు చేపట్టాలని సభ్యులు కోరారు. సమావేశంలో జడ్పీటీసీ సభ్యులు చంద్రబాగ, మోహన్రెడ్డి, స్వరూప, రాంరెడ్డి, శ్రీలత, అధికారులు పాల్గొన్నారు.