మంత్రి రామన్నకు ఊరూరా ‘పచ్చని’కానుక
మహోత్సవంలా ‘ముక్కోటి వృక్షార్చన’
లక్షలాది మొక్కలు పాదుకొని పులకించిన పుడమి తల్లి
మొక్కలు నాటి స్ఫూర్తినిచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు
ఉత్సాహంగా పాల్గొన్న టీఆర్ఎస్ శ్రేణులు
స్వచ్ఛందంగా కదిలివచ్చిన సబ్బండవర్గాలు
గస్వాములైన అధికారులు
కేట్ కట్ చేసి, స్వీట్లు పంచి వేడుకలు
పల్లె, పట్నం అంతటా పండుగలా కార్యక్రమం
జయశంకర్ భూపాలపల్లి/ ములుగు, జూలై 24 (నమస్తే తెలంగాణ):ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి రామన్న పుట్టిన రోజును పురస్కరించుకొని శనివారం ఊరూరా ‘ముక్కోటి వృక్షార్చన’ మహోత్సవంలా జరిగింది. ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి సబ్బండవర్గాల ప్రజలు భాగస్వాములై మొక్కలు నాటడంతో పల్లెల్లో సందడి కనిపించింది. పలుచోట్ల మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పాల్గొని మొక్కలు నాటి స్ఫూర్తి నింపగా టీఆర్ఎస్ కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టించింది. ఒక్కరోజే ఆరు జిల్లాల పరిధిలో లక్షలాది మొక్కలు పాదుకోగా పుడమితల్లి పులకించిపోయింది.
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా చేపట్టిన ‘ముక్కోటి వృక్షార్చన’ శనివారం ఊరూరా పండుగలా జరిగింది. పల్లె, పట్నం తేడా లేకుండా ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు యువనేత పిలుపు మేరకు ముక్కోటి వృక్షార్చనలో భాగస్వాములయ్యారు. ఆయా చోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు మొక్కలు నాటి స్థానికుల్లో ఉత్సాహం నింపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేలాది మంది కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడంతో పుడమి తల్లి పులకించిపోయింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 50 వేల మొక్కలు నాటారు. ఖిలావరంగల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మొక్కలు నాటారు. మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే అరూరి రమేశ్, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు చింతగట్టు క్యాంపు సమీపంలోని ఎస్సారెస్పీ కాల్వ వెంట ఐదెకరాల స్థలంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి ఆధ్వర్యంలో ఉర్సు, భట్టుపల్లి బైపాస్ ప్రధాన రహదారి డివైడర్ల మధ్యలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. హన్మకొండ బాలసముద్రంలోని పశ్చిమ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, ధర్మసాగర్ పల్లెప్రకృతి వనంలో ఎమ్మెల్యే రాజయ్య మొక్కలు నాటారు. వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తిలోని వరంగల్-ఖమ్మం జాతీయ రహదారి పక్కన కలెక్టర్ ముండ్రాతి హరితతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మొక్కలు నాటారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నియోజకవర్గంలోని పరకాల, నడికూడ, దామెర, ఆత్మకూరు, గీసుగొండ, సంగెం మండలాల్లో జరిగిన ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.
గీసుగొండ మండలంలోని 21 గ్రామాల్లో 20,806 మొక్కలు నాటారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి శాయంపేట మండలంలోని కొత్తగట్టుసింగారం, మాందారిపేట స్టేజీల వద్ద జాతీయ రహదారిపై రూరల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతితో కలిసి మొక్కలు నాటారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, డీసీసీబీ చైర్మన్ రవీందర్రావుతో కలిసి వర్ధన్నపేటలోని జూనియర్ కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండిలో అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టగా ఇక్కడ కూడా మంత్రి ఎర్రబెల్లి మొక్కలు నాటారు. ఇక్కడ ఒక్క గంటలోనే 3,500 మొక్కలు నాటించారు. అనంతరం పాలకుర్తి మండల కేంద్రంతోపాటు తొర్రూరు(జే) గ్రామంలోనూ ఎర్రబెల్లి మొక్కలు నాటి స్థానికుల్లో స్ఫూర్తి నింపారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి జనగామ పట్టణంతోపాటు నర్మెట మండలం మచ్చుపహాడ్ ఫారెస్ట్ భూమిలో 10 వేల మొక్కలు నాటించారు. నియోజకవర్గంలో మూడు లక్షల మొక్కలు నాటించారు. స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య స్టేషన్ఘన్పూర్, చిలుపూరు, రఘునాథపల్లి, లింగాలఘనపురంలో మొక్కలు నాటారు. మాజీ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి లింగాలఘనపురం మండలం నెల్లుట్ల పార్కులో మొక్కలు నాటారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే శంకర్నాయక్పాల్గొని కేక్ కట్ చేశారు.అనంతరం పట్టణ పరిధిలోని గాయత్రీగుట్ట సమీపంలోని జాతీయ రహదారికి ఇరువైపులా మొక్కలు నాటారు.
బయ్యారం మండలం రామచంద్రాపురం పంచాయతీ చింతోనిగుంపులో 31వేల మొక్కలు నాటారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్యే హరిప్రియా నాయక్, జడ్పీ చైర్ పర్సన్ అంగోత్ బిందు, కలెక్టర్ అభిలాషా అభినవ్ పాల్గొన్నారు. మంజూర్నగర్ నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వరకు వేలమంది టీఆర్ఎస్ కార్యకర్తలు ర్యాలీ తీశారు. పటాకులు కాల్చి సంబురాలు జరుపుకొన్నారు. టీజేఎస్ఎఫ్, జిల్లా యువజన, క్రీడలశాఖ, తెలంగాణ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి 10 కిలోల కేక్, టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ను ఎమ్మెల్యే గండ్ర, వరంగల్ రూరల్ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతితో కలిసి కట్ చేశారు. రేగొండ మండలం చెన్నాపూర్ నుంచి జిల్లా కేంద్రం వరకు జాతీయ రహదారికి ఇరువైపులా సుమారు 40 కిలో మీటర్ల పొడవునా మొక్కలు నాటారు. అనంతరం 300మంది క్రీడాకారులకు వాలీబాల్ కిట్లు అందజేశారు. గణపురం మండలంలోని మైలారం, గాంధీనగర్, లక్ష్మారెడ్డిపల్లి, చెల్పూర్ గ్రామాల్లో పరకాల- భూపాలపల్లి ప్రధాన రహదారికి ఇరువైపులా ఎమ్మెల్యే గండ్ర దంపతులు మొక్కలు నాటి, కేక్ కట్ చేశారు. సింగరేణి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో 3.06 ఎకరాల్లో 15వేల మొక్కలు నాటారు. ములుగు జిల్లాలోని మండలాలు, గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, ప్రజలు పండుగలా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. సబ్బండవర్గాల ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వామ్యం కావడంతో ఊరూరా ‘ముక్కోటి వృక్షార్చన’ మహోత్సవాన్ని తలపించింది.