మంచి కార్యక్రమమని మేధావులు, విద్యావేత్తల హర్షం
విద్యావ్యవస్థ పటిష్టం కోసం టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న కృషిపై ప్రశంసల వర్షం
ఈ నిర్ణయం చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని స్పష్టం
నడికూడ, జనవరి 22 :సర్కారు బడులను బలోపేతం చేసి ప్రతి విద్యార్థికీ నాణ్యమైన ఆంగ్లమాధ్యమ విద్యనందించి వారి భవిష్యత్కు బంగారు బాటలు వేసేలా ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి. సమాజ పురోభివృద్ధికి కేంద్రాలైన పాఠశాలల వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చేందుకు ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని మేధావులు, విద్యావేత్తల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పేద, ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ ఇంగ్లిష్ మీడియం బోధన సాహసోపేత నిర్ణయమని, తద్వారా బడుగుల జీవితాల్లో వెలుగులు నిండుతాయని ఆనందం వ్యక్తమవుతున్నది. కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాల నడుమ ఆంగ్ల మాధ్యమ విద్య అనేది తెలంగాణ ప్రజలకు గొప్ప వరంలా మారుతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
గొప్ప కార్యక్రమం
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మన ఊరు-మన బడి గొప్పకార్యక్రమం. ఇది కచ్చితంగా విజయవంతమవుతుంది. వి ద్యార్థుల ఉన్నతికి దోహదపడుతుంది. పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పిం చి ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా మార్చాలని ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకున్నది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని తెచ్చిన సీఎం కేసీఆర్, విద్యార్థుల తల్లిదండ్రుల ఆలోచనలో మార్పు తీసుకొచ్చారు. తమ పిల్ల ల భవిష్యత్ను ప్రభుత్వమే చూసుకుంటుందన్న భరోసా కల్పించారు. అదనపు తరగతి గదులు, ల్యాబ్లు, ఫర్నిచర్, ఆహ్లాదకరమైన ఆటస్థలాలు, ఆధునిక టాయిలెట్లు, మెరుగైన సౌకర్యాలతో పాఠశాలలు ముస్తాబు కానున్నాయి. ఈ కార్యక్రమంతో పాటు కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు ఫీజులను నియంత్రించుకుంటే పరోక్షంగా ఆయా స్కూళ్ల విద్యార్థులకు కూడా లబ్ధికలుగుతుంది.
ప్రభుత్వ విద్య బలోపేతం
పరకాల, జనవరి 22: తెలంగాణ ప్రభుత్వం చేపట్టనున్న మన ఊరు మన బడి కార్యక్రమంతో సర్కారు మరింత బలోపేతమవుతుం ది. ఇప్పటికే గురుకులాల్లో ప్రభుత్వం కార్పొరేట్ విద్యను అందిస్తున్నది. మన ఊరు- మన బడితో మండల, జిల్లా పరిషత్ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగువుతాయి. విద్యార్థులకు ఇంగ్లిష్ మాధ్యమంలో బోధన అంది వారు కార్పొరేట్ విద్యార్థులతో పోటీ పడగలిగే స్థాయికి చేరుతారు. తల్లిదండ్రుల్లోనూ ప్రభుత్వ విద్యపై నమ్మకం పెరిగి తమ పిల్లలను సర్కారు బడులకే పంపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మౌలిక వసతులు కల్పిస్తే ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలే మారుతాయి.-మోడెం రాజేందర్ బాబు, ప్రభుత్వఉపాధ్యాయుడు, పీఆర్టీయూ మండలాధ్యక్షుడు
ప్రజలకు గొప్ప వరం
న్యూశాయంపేట, జనవరి 22 : ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టాలని, ఆమేరకు మౌలిక వసతులు కల్పించాలని ఇటీవల నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం. నేటి పోటీ ప్రపంచంలో ఇంగ్లిష్ మీడియం అనేది ప్రతి విద్యార్థికి అవసరం. చాలామంది పేద పిల్లలు ఆంగ్ల మాధ్యమానికి దూరంగానే ఉంటున్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ బడిలో చదివే ప్రతి విద్యార్థికి ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన అందుతుంది. తగిన పర్యవేక్షణాధికారులను నియమించి, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా సర్కారు పాఠశాల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ఏర్పాటుచేస్తే తెలంగాణ ప్రజలకు ఓ గొప్ప వరంలా మారుతుంది. – సీహెచ్ రవీందర్ రాజు, టీఎస్యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు, హనుమకొండ