డీఎంహెచ్వో డాక్టర్ వెంకటరమణ
జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్
వర్ధన్నపేట, జనవరి 17 : అర్హులందరూ బూస్టర్ డోస్ వేసుకోవాలని వరంగల్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ కోరారు. మండలంలోని ఇల్లంద గ్రామంలో నిర్వహిస్తున్న బోస్టర్ డోస్ శిబిరాన్ని సోమవారం సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రెండు డోసులు వేసుకొని ఆరు నెలలు పూర్తయిన వారికి వైద్య సిబ్బంది బూస్టర్ డోసు వేయాలన్నారు. కొవిడ్ థర్డ్ వేవ్ శరవేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పీహెచ్సీల వైద్యులు, సిబ్బంది గ్రామాల వారీగా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. అలాగే వర్షాలు వస్తున్నందున సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందని, ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఆయన వెంట పీహెచ్సీ వైద్యాధికారి వెంకటేశ్, ఎంపీటీసీ శ్రీనివాస్, వైద్య సిబ్బంది ఉన్నారు.
వరంగల్ చౌరస్తా : జిల్లా వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నట్లు డీఎంహె చ్వో డాక్టర్ వెంకటరమణ తెలిపారు. సోమవారం 5199 మందికి వ్యాక్సిన్ అందించామని, వారిలో 594 మందికి మొదటి డోసు, 4605 మందికి రెండవ డోసు వేశామన్నారు. 15 నుంచి 18 సంవత్సరాల వయస్సు కలిగిన 579 మందికి వ్యాక్సిన్ వేయగా, ఇప్పటివరకు 18వేల 175 మందికి టీకా వేశామన్నారు. 1449 మందికి ప్రికాషన్ డోసు అందించామన్నారు. స్పెషల్ డ్రైవ్లో ఇప్పటివరకు 2 లక్షల 91వేల 891మంది మొదటి డోసు తీసుకోగా, 2లక్షల 77వేల 699 మంది రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నారని తెలిపారు. 271గ్రామాలు, 31 కాలనీల్లో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేశామన్నారు.