Stock Market | ముంబై, మే 9: దేశీయ స్టాక్ మార్కెట్లలో లోక్సభ ఎన్నికల టెన్షన్ కనిపిస్తున్నది. అనిశ్చిత వాతావరణం ఆవరించడంతో మదుపరులు అమ్మకాల ఒత్తిడిలో పడిపోయారు. గురువారం ఉదయం ఆరంభం నుంచీ దిగజారుతున్న స్టాక్ మార్కెట్లు.. సమయం గడుస్తున్నకొద్దీ ఇంకా నీరసించాయి. బీఎస్ఈ ప్రధాన సూచీ సెన్సెక్స్ 1,062.22 పాయింట్లు పతనమై 72,404.17 వద్ద ముగిసింది. ఒకానొక దశలోనైతే 1,132.21 పాయింట్లు పడిపోయింది. ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ కూడా 345 పాయింట్లు క్షీణించి 22వేల స్థాయికి దిగువన 21,932.40 వద్ద స్థిరపడింది. దీంతో వరుసగా మూడోరోజూ సూచీలు పతనం బాటలోనే నడిచినైట్టెంది.
చమురు, గ్యాస్ షేర్లలో సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువగా కనిపించింది. ఈ సంస్థల షేర్లు 3.41 శాతం నష్టాలను మూటగట్టుకున్నాయి. ఇక సెన్సెక్స్లో ఎల్అండ్టీ షేర్ విలువ అత్యధికంగా 5 శాతానికిపైగా క్షీణించింది. బీఎస్ఈ మిడ్క్యాప్ సూచీ 2.01 శాతం, స్మాల్క్యాప్ సూచీ 2.41 శాతం నష్టపోయాయి.
స్టాక్ మార్కెట్ల భారీ నష్టాలు.. లక్షల కోట్ల రూపాయల మదుపరుల సంపదను మింగేశాయి. గురువారం బీఎస్ఈ సంస్థల మార్కెట్ విలువ రూ.7,34,513.48 కోట్లు దిగి రూ.3,93,34,896.14 కోట్లకు పరిమితమైంది. ఈ నెల 2న మునుపెన్నడూ లేనివిధంగా మార్కెట్ విలువ ఆల్టైమ్ హైని తాకుతూ రూ.4,08,49,767.90 కోట్లుగా ఉన్న విషయం తెలిసిందే.
ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటిదాకా నమోదైన పోలింగ్ సరళి ఆధారంగా ఈసారి ఫలితాలు ముందుగా ఊహించినట్టుగా ఉండకపోవచ్చన్న అంచనాలు మదుపరులలో ఉన్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. కేంద్రంలో అధికార మార్పిడికి వీలుంటుందేమోనన్న అనుమానాలతో పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారని మెజారిటీ ఎక్స్పర్ట్స్ ట్రేడింగ్ తీరుపై అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ఫలితంగానే భారీ నష్టాలు తప్పలేదని కూడా వారు విశ్లేషిస్తున్నారు. మున్ముందు మార్కెట్లు మరిన్ని నష్టాలు చవిచూస్తాయనీ అంటున్నారు.