భూపాలపల్లి జిల్లాలో 44.9 మిల్లీ మీటర్ల వర్షపాతం
మహదేవపూర్, పలిమెల మండలాల్లో అత్యధికంగా 112.8 మిల్లీ మీటర్లు
భూపాలపల్లి రూరల్, జూలై 14: జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వరుసగా రెండు మూడు రోజులు కురిసిన భారీ వర్షాలకు చెరువులు నిండాయి. వాగులు పొంగి పొర్లుతున్నాయి. పలు గ్రామాల్లోకి వరదనీరు రావడంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బుధవారం ఉదయం వరకు 44.9 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. మహదేవ్పూర్, పలిమెల మండలాల్లో అత్యధికంగా 112.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. కాటారం మండలంలో 96.2, గణపురంలో 36.4, మహాముత్తారంలో 30.2, మొగుళ్లపల్లిలో 20.2, రేగొండలో 31.4, చిట్యాల, టేకుమట్ల మండలాల్లో 12.8, మల్హర్ రావులో 20, భూపాలపల్లి మండలంలో అత్యల్పంగా 27 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనదని తెలిపారు.
ములుగు జిల్లాలో 43.02 మిల్లీమీటర్లు..
ములుగుటౌన్: ములుగు జిల్లాలో 43.02 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా వాజేడులో 120.2 మిల్లీమీటర్లు, అత్యల్పంగా తాడ్వాయిలో 9.2 మిలీమీటర్లు నమోదైందని పేర్కొన్నారు. వెంకటాపురం(నూగూరు)లో 87.6, మంగపేటలో 55.6, ఏటూరునాగారంలో 34.2, ములుగులో 14.8, వెంకటాపూర్లో 13.2, గోవిందరావుపేటలో 9.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు.
ఇళ్లలోకి వరదనీరు
కాటారం: మండలంలోని పలు గ్రామాల్లో ఇళ్లలోకి వరదనీరు వచ్చి చేరడంతో ప్రజలు రాత్రంతా జాగారం చేశారు. చింతకాని గూడెపు చెరువు మత్తడి దూకుతోంది. బొప్పారం, బొర్రవాగులు కాజ్వేలపై నుంచి ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు కొద్ది సేపు నిలిచిపోయాయి. మంగళవారం రాత్రి బొప్పారం వాగుపై ఉన్న లోలెవల్ కాజ్వేపై నుంచి దాటుతూ శ్రీధర్ అనే యువకుడు తన బైక్తోసహా వరదనీటిలో పడ్డాడు. ఆయనకు ఈత రావడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ద్విచక్ర వాహనాన్ని స్థానికుల సాయంతో బుధవారం వెలికితీశారు.
నీట మునిగిన పంటపొలాలు
వాజేడు:మొరుమురు గ్రామపంచాయతీలోని ప్రగళ్లపల్లి పెద్ద చెరువులోకి వరద వచ్చి చేరుతోంది. చెరువు మత్తడి పోస్తోంది. చెరువు ముంపు నీటిలో వరి పొలాలు మునిగాయి.
ముంపు గ్రామాల్లో సహాయక చర్యలు
మహదేవపూర్: సూరారం, ఎలికేశ్వరం గ్రామాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరింది. గ్రామస్తులు సోషల్మీడియా ద్వారా ఇన్చార్జి కలెక్టర్ కృష్ణఆదిత్యకు విషయాన్ని తెలియజేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు భూపాల్పల్లి జడ్పీ సీఈవో శోభారాణి వెళ్లి పరిశీలించారు. పరిస్థితిని కలెక్టర్కు వివరించారు. వరద నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సర్పంచులు, కార్యదర్శులకు వివరించారు. ఆమె వెంట మహదేవపూర్ ఎంపీపీ బన్సోడ రాణిబాయి, తహసీల్దార్ శ్రీనివాస్, సర్పంచ్ నాగుల లక్ష్మారెడ్డి, ముధునమ్మ తదితరులు ఉన్నారు.
జంపన్నవాగులో పెరిగిన వరద
ఏటూరునాగారం: మండల కేంద్రానికి సమీపంలోని జంపన్నవాగులో వరద ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఈ ఏడాది వాగులోకి వరద చేరడం ఇదే తొలిసారి. వాగుదాటి పశువులు మేతకు వెళ్లలేదు.