సమీపిస్తున్న మహా జాతర
ముందే భారీగా తరలివస్తున్న భక్తులు
ఆదివారం లక్ష మంది హాజరైనట్లు
అధికారుల వెల్లడి
తల్లుల ఒడిలో ఎమ్మెల్సీ కడియం పూజలు
తాడ్వాయి, జనవరి 9 : ఆదివాసీ, గిరిజన దైవాలైన మేడారం సమ్మక్క-సారక్కల సన్నిధి జనసంద్రంగా మారుతోంది. మహా జాతర కోసం అభివృద్ధి పనులు మొదలైనప్పటి నుంచి వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. ఆదివారం సెలవుదినం కావడంతో రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచే కాకుండా సమీప రాష్ర్టాలైన ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా, అంధ్రప్రదేశ్ తదితర జిల్లాలోని పలు జిల్లాల భక్తులు ప్రైవేట్ వాహనాల్లో భారీగా తరలివస్తున్నారు. మొదట జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం అమ్మవార్ల గద్దెల వద్దకు చేరుకుంటున్నారు. అనంతరం సమ్మక్క-సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై పసుపు, కుంకుమ, ఎత్తుబెల్లం, నూతన వస్ర్తాలు, పూలు, పండ్లు సమర్పించి గిరిజన సాంప్రదాయ పద్దతిలో పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. యాటపోతులు, కోళ్లను బలిచ్చి సమీప అటటీ ప్రాంతంలో వంటలు చేసుకుని బంధుమిత్రులతో సహపంక్తి భోజనాలు చేస్తున్నారు. ఆదివారం సుమారు లక్ష మందికి పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు దేవాదాయశాఖ అధికారులు తెలిపారు.
రద్దీగా మారుతున్న వీధులు
అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చే భక్తులతో మేడారంలోని వీధులన్నీ రద్దీగా మారుతున్నాయి. వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తాడ్వాయి ఎస్సై , సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.
భక్తులకు దూర దర్శనం
వనదేవతలను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు దూర దర్శనం కల్పించారు. భారీగా భక్తులు రావడంతో తొక్కిసలాట జరుగకుండా ఉండేందుకు గద్దెల చుట్టు ఉన్న గ్రిల్స్కు తాళాలు వేసి బయటి నుంచే అమ్మవార్లను దర్శించుకునే అవకాశం కల్పించారు. అయితే, గద్దెలను తాకే వీలు లేకపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
బంగారం కోసం తిప్పలు
గద్దెల చుట్టూ ఉన్న గ్రిల్స్కు తాళం వేయడంతో లోపలికి వెళ్లి బంగారం తెచ్చుకునేందుకు వీలులేకుం డా పోయింది. తల్లుల గద్దెల వద్ద ఉన్న బంగారం తీసుకుంటే మంచిదని, దానిని తెచ్చి ఇస్తే బాగుండేదని పలువురు పేర్కొన్నారు. భక్తులకు బంగారం ఇచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు.
ఇబ్బంది పడుతున్న భక్తులు
ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా, అధికారుల నిర్లక్ష్యంతో పనులు పూర్తికాకపోవడంపై భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాగునీరు, మరుగుదొడ్లు లేక అసవస్థలు పడ్డారు. జనవరి 15వ తేదీ లోగా పనులను పూర్తి చేయాలని మంత్రులు, కలెక్టర్ పలుమార్లు సమీక్షించినా పూర్తవకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వనదేవతలను దర్శించుకున్న ఎమ్మెల్సీ కడియం శ్రీహరి
తాడ్వాయి, జనవరి 9 : ఆదివాసీ గిరిజన దైవాలైన మేడారం సమ్మక్క-సారలమ్మను ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అమ్మవార్ల దర్శనానికి వచ్చిన ఎమ్మెల్సీకి దేవాదాయశాఖ అధికారులు, అమ్మవార్ల పూజారులు డోలు వాయిద్యాల నడుమ ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సమ్మక్క-సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై పసుపు, కుంకుమ, ఎత్తుబెల్లం, నూతన వస్ర్తాలు, పూలు, పండ్లు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. పూజారులు అమ్మవారి ప్రసాదంతో పాటు వస్ర్తాలను అందజేశారు.