జయశంకర్ భూపాలపల్లి, జనవరి 9;‘రైతుబంధు’ రంగోలితో భూపాలపల్లిలో సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్టయింది. సుమారు 500మంది ఆడబిడ్డలు వేసిన తీరొక్క రంగవల్లులతో ఆదివారం అంబేద్కర్ స్టేడియం మెరిసిపోయింది. రైతుల బతుకుచిత్రంతో పాటు రైతుబంధు, బీమా పథకాలు, కాళేశ్వరం ప్రాజెక్టుతో సస్యశ్యామలమైన తెలంగాణ’ను కళ్లకు కట్టేలా వేసిన ముత్యాల ముగ్గులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలు పండుగ వాతావరణంలో జరుగగా చిన్నారుల సాంస్కృతి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సత్యవతిరాథోడ్, వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి.. ముగ్గులేయడంతో పాటు ఆడిపాడి అక్కడున్నవారిలో ఉత్సాహం నింపారు. అనంతరం వారు వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్తో కలిసి విజేతలకు బహుమతులు అందించారు.
సంక్రాంతికి ముందే అన్నదాత ఇంట రైతుబంధు పండుగొచ్చింది. నేటితో ఖాతాల్లో చేరే పెట్టుబడి సాయం రూ.50వేల కోట్లకు చేరనున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఆదివారం భూపాలపల్లిలో నిర్వహించిన ‘రైతుబంధు’ రంగోలితో అంబేద్కర్ స్టేడియం మెరిసిపోయింది. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించగా, కార్యక్రమానికి జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి సుమారు 500 మంది మహిళలు తరలివచ్చారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అమలుచేస్తున్న పథకాలపై రంగురంగుల ముగ్గులు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. జిల్లాకేంద్రానికి చెందిన శ్రీనివాస్ సుమారు 240గజాల స్థలంలో వేసిన ‘కేసీఆర్ ముగ్గు’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిందు కళాకారుల యక్షగానం, గంగిరెద్దుల విన్యాసాలు ఆహూతులను అబ్బురపరిచాయి. అనంతరం ముగ్గుల పోటీల విజేతలకు రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖమంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ పసునూరి దయాకర్ బహుమతులు అందజేశారు.