కాషాయ పార్టీ పాలనలో పెరిగిన నిరుద్యోగం
సీఎం కేసీఆర్తోనే రాష్ట్రంలో అభివృద్ధి
ఎమ్మెల్సీ కడియం శ్రీహరి
స్టేషన్ ఘన్పూర్, జనవరి 8 : ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న బీజేపీకీ త్వరలో ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ర్టాల్లో జరిగే ఎన్నికల్లో ఓటమి తప్పదని మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. శనివారం హనుమకొండలోని తన నివాసంలో స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన 23 మంది లబ్ధిదారులకు రూ.8,04,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 లోక్సభ ఎన్నికల తర్వాత వివిధ రాష్ర్టాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు గుణపాఠం చెప్పారని గుర్తు చేశారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ర్టాల్లో జరిగే ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోవడం ఖాయమన్నారు. బీజేపీ విధానాలను వ్యతిరేకించే పార్టీలను జాతీయ స్థాయిలో సీఎం కేసీఆర్ కూడగట్టే అవకాశం ఉండడంతో తెలంగాణ ప్రభుత్వంపై ఆ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజాదరణ ఉన్న కేసీఆర్ ప్రభుత్వాన్ని బలహీన పర్చాలని బీజేపీ చేస్తున్న యత్నాలను తెలంగాణ ప్రజలు గమనించాలని కోరారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో వేలాది కోట్ల రూపాయలతో ఆసరా పథకంలో పెన్షన్లు, రైతుబంధు, రైతుబీమా అందించడంతోపాటు వ్యవసాయనికి ఉచిత విద్యుత్ ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. మోదీ పాలనలో ప్రభుత్వరంగ సంస్థలు ప్రైవేట్పరం అవుతూ నిరుద్యోగ సమస్య పెరిగిందన్నారు. రైతులు, కార్మికులు, దళితులకు వ్యతిరేకంగా కేంద్రం వ్యవహరిస్తున్న తీరును ప్రజలు తిప్పికొట్టాలని శ్రీహరి కోరారు.