35.22 శాతం మంది విద్యార్థుల హాజరు
జిల్లాలో మొత్తం విద్యార్థుల సంఖ్య 1,08,889
981 పాఠశాలలకు 944 ఓపెన్
వరంగల్, ఫిబ్రవరి 1 (నమస్తేతెలంగాణ): జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో మంగళవారం ప్రత్యక్ష తరగతులు ప్రారంభమయ్యాయి. మొదటిరోజు 35.22 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రతి పాఠశాలలో శానిటైజర్ను సమకూర్చారు. దీంతో విద్యార్థులు తమ చేతులను శానిటైజ్ చేసుకుని తరగతి గదులకు వెళ్లారు. జిల్లాలో ప్రభుత్వం, స్థానిక సంస్థలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, యూఆర్ఎస్, టీఎస్ఆర్ఈఐఎస్లు 663 ఉంటే.. వీటన్నింటిలోనూ ప్రత్యక్ష తరగతుల ద్వారా బోధన ప్రారంభమైంది. ఈ 663 స్కూళ్లలో 45,063 మంది విద్యార్థులు ఉంటే.. వీరిలో 34.02 శాతం అంటే 15,329 మంది భౌతిక తరగతులకు హాజరయ్యారు. 61 ఎయిడెడ్ పాఠశాలల్లో 30 మాత్రమే తెరుచుకున్నాయి. వీటిలో 1,447 మంది విద్యార్థులు ఉంటే 32.14 శాతంగా 465 మంది వచ్చారు. 257 ప్రైవేటు పాఠశాలలకు 251 తెరుచుకొన్నాయి. వీటిలో ఉన్న 62,379 మంది విద్యార్థుల్లో 36.17 శాతంగా 22,560 మంది ప్రత్యేక్ష తరగతులకు హాజరయ్యారు. జిల్లాలో అన్ని యాజమాన్యాల పాఠశాలలు మొత్తం 981 ఉంటే.. వీటిలో 944 తెరుచుకున్నాయని, 1,08,889 మంది విద్యార్థుల్లో 38,354 మంది ప్రత్యక్ష తరగతులకు హాజరయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారి డీ వాసంతి తెలిపారు. తొలిరోజు 35.22 శాతం మంది విద్యార్థులు భౌతిక తరగతులకు హాజరయ్యారని పేర్కొన్నారు.
కొవిడ్ నిబంధనలతో షురూ..
ఖిలావరంగల్/పోచమ్మమైదాన్/నర్సంపేటరూరల్/గీసుగొండ/నల్లబెల్లి: ఖిలావరంగల్ మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు కొవిడ్ నిబంధనలతో ప్రారంభమయ్యాయి. స్కూళ్లను పారిశుధ్య కార్మికులతో శుభ్రం చేయించారు. సోడియం హైపోక్లోరైట్ ద్రావాణాన్ని పిచికారీ చేశారు. పిల్లలను థర్మల్ స్క్రీనింగ్ చేసి గదుల్లోకి పంపించారు. బెంచీకి ఇద్దరు చొప్పున విద్యార్థులను కూర్చోబెట్టి బోధిస్తున్నారు. వరంగల్ ఎల్బీనగర్లోని ప్రభుత్వ చార్బౌళి పాఠశాలలో మున్సిపల్ సిబ్బంది తరగతి గదులను శానిటైజేషన్ చేశారు. కార్పొరేటర్ ఎండీ ఫుర్కాన్ పర్యవేక్షించి జాగ్రత్తలు పాటించాలని హెచ్ఎం టీ కవితకు సూచించారు. పాఠశాలలు ప్రారంభమైనందున నర్సంపేట ఇటుకాలపల్లి జడ్పీఎస్ఎస్లో ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు విద్యార్థులకు మాస్కులు పంపిణీ చేశారు. సర్పంచ్ మండల రవీందర్, హెచ్ఎం కొర్ర సారయ్య, వార్డు సభ్యులు తాళ్లపల్లి కల్పన, బొడిగె వినయ్, టీఆర్ఎస్ నాయకులు లకిడె రాజేశ్వర్రావు, పాశికంటి శంరక్లింగం, తాళ్లపల్లి రాము పాల్గొన్నారు. గీసుగొండ మండలం మరియపురంలో సర్పంచ్ అల్లం బాలిరెడ్డి సెయింట్ మేరీ పాఠశాలతోపాటు ప్రభుత్వ కార్యాలయం, వీధుల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని నల్లబెల్లి ఎంపీవో కూచన ప్రకాశ్ ఉపాధ్యాయులకు సూచించారు. మూడుచెక్కలపల్లెలో గిరిజన ఆశ్రమ పాఠశాలలో హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. కార్యక్రమంలో కార్యదర్శి యాదగిరి, హెచ్ఎం కొర్ర సమ్మయ్య పాల్గొన్నారు.