మరోసారి మనకు కేంద్రం మొండిచెయ్యి
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ మాట లేదు
గిరిజన వర్సిటీ ఊసు లేదు
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ బాసలేదు
ఉమ్మడి జిల్లా డిమాండ్లు పట్టని సెంట్రల్
బడ్జెట్పై పెదవి విరుస్తున్న సబ్బండవర్గాలు
వినతులను లెక్కలోకి తీసుకోని తీరుపై ఆగ్రహం
వేతన జీవులు, సామాన్యుల మండిపాటు
పలుచోట్ల కేంద్రం దిష్టిబొమ్మల దహనం
వరంగల్, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కుఫ్యాక్టరీలు ఏర్పాటైతే ఎంతో మందికి ఉపాధి దొరుకుతుందని ఎన్నో ఏళ్లుగా ఆశగా ఎదురు చూస్తున్న ఉమ్మడి జిల్లా యువతకు కేంద్రం మళ్లీ మొండిచెయ్యి చూపింది. విభజన చట్టంలోనే స్పష్టంగా ఉన్న అంశాలకు నీళ్లొదిలి వరంగల్ ఉమ్మడి జిల్లావాసులకు ఈ బడ్జెట్లోనూ తీరని అన్యాయం చేసింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు, రైతులకు, సామాన్యులకు, పేదలకు, కుల వృత్తులవారికి, ఉద్యోగులకు తీవ్ర నిరాశే మిగిల్చింది. ఈ బడ్జెట్ దశ దిశ లేని పనికి మాలిన.. పసలేని.. నిష్ప్రయోజనకరమైనదని సబ్బండవర్గాల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి జిల్లావాసుల విన్నపాలను లెక్కలోకి తీసుకోని కేంద్రం తీరుపై ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. బడ్జెట్ను నిరసిస్తూ పలుచోట్ల ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనాలు జరిగాయి.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉమ్మడిజిల్లావాసులకు మరోసారి అన్యాయం చేసింది. తాజా బడ్జెట్లోనూ మొండిచెయ్యి చూపింది. విభజన చట్టంలో పేర్కొన్న ఏ ఒక్క హామీనీ నెరవేర్చే ప్రయత్నం చేయలేదు. తమ ఆకాంక్షలను ఏ మాత్రం పట్టించుకోని కేంద్ర ప్రభుత్వంపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతున్నది. ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఏ ఒక్క ప్రతిపాదనను కూడా కేంద్రం బడ్జెట్లో ప్రస్తావించలేదు. కొత్తగా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను, నిధులను మంజూరు చేయకపోగా దీర్ఘకాలికంగా ఉన్న డిమాండ్లను పట్టించుకోకపోవడంపై అన్ని వర్గాలవారూ మండిపడుతున్నారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై ఎలాంటి ప్రకటన చేయలేదు. మేడారం జాతరకు జాతీయ స్థాయి గుర్తింపుపై ఊసే లేదు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కోసం టీఆర్ఎస్తోపాటు పలు రాజకీయ పక్షాలు చేస్తున్న డిమాండ్లను కేంద్రం పట్టించుకోలేదు. ఇప్పటికే మంజూరైన రైల్వే వ్యాగన్ పీవోహెచ్ షెడ్డు నిర్మాణానికి రూ.400 కోట్ల నిధులు కేటాయించాలనే డిమాండుపైనా కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. విభజన చట్టంలో పేర్కొన్న గిరిజన యూనివర్సిటీ ఏర్పాటును మరోసారి మరుగున పడేసింది. ములుగు జిల్లా కేంద్రంలో ఈ యూనివర్సిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం స్థలాన్ని కేటాయించినా కేంద్రం అనుమతులు ఇవ్వడంలేదు. ఐఐఎం, ఐఐటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలను కొత్తగా తెలంగాణకు కేటాయిస్తే ఎడ్యుకేషనల్ హబ్గా అభివృద్ధి చెందుతున్న వరంగల్ నగరానికి వస్తాయని ఆశించిన వారికి నిరాశే మిగిలింది. ఉడాన్ పథకంలో భాగంగా మామునూరు ఎయిర్పోర్టు పునరుద్ధరణ చేయాలన్న ప్రతిపాదనలను కేంద్రం పట్టించుకోలేదు. తెలంగాణలో ప్రతి ఎకరాకు సాగునీటిని అందించే లక్ష్యంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాను కల్పించాలనే డిమాండును కూడా పరిగణన లోకి తీసుకోలేదు. అర్బన్ ఏరియాల్లో మెరుగైన రవాణా వ్యవస్థ ఏర్పాటులో భాగంగా నియోమెట్రో ప్రతిపాదన ఆమోదం, నిధులపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఉమ్మడి జిల్లాకు మేలు చేసే అంశాలు కేంద్ర బడ్జెట్లో లేకపోవడంపై సబ్బండవర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
పేదలను విస్మరించిన కేంద్ర బడ్జెట్
హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 1 : కేంద్ర బడ్జెట్ గాలిలో మేడలు కట్టినట్లుంది. పేదలను మరిచి పెట్టుబడి దారుల జపం చేసినట్లుంది. రెండేళ్లుగా కొవిడ్తో ఆర్థికంగా చితికిపోయిన పేద, మధ్యతరగతి ప్రజలను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైంది. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం, అర్హులందరికీ ఇండ్లు కట్టిస్తామనే వాగ్దానాలకు అతీగతీ లేదు గానీ, పీఎం గతిశక్తి పేరుతో 25 ఏళ్ల ఆర్థికాభివృద్ధికి ఈ బడ్జెట్ పునాది అనడం హాస్యాస్పదం. జీఎస్టీ వసూళ్లు పెరిగాయని, అత్యధిక వృద్ధి రేటు సాధిస్తున్నామని చెప్పిన కేంద్రం.. ఆ ఫలాలను సామా న్యులకు అందించడంలో మొండిచేయి చూపింది.-తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు
ఉద్యోగులను నిరాశపర్చింది..
జనగామ చౌరస్తా, ఫిబ్రవరి 1 : కేంద్ర బడ్జెట్ వేతనజీవులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఆదాయ పన్ను స్లాబ్ రేట్లలో ఎలాంటి మార్పులు చేయకపోవడం, కొత్త ప్రతిపాదనలేవీ రూపొందించలేదు. దీని వల్ల ఉద్యోగులు తమ వార్షిక వేతనం నుంచి ఆదాయపు పన్ను రూపేణా కోల్పోవాల్సి వస్తుంది. మధ్యతరగతి, బడుగు బలహీన వర్గాల ప్రజలకు పెద్దగా ఒనగూరేది ఏమీ లేదు. ఈ బడ్జెట్ వేతన జీవుల ప్రయోజనాలను నీరుగార్చింది.-బుర్ర రమేశ్, టీయూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు, జనగామ
అంకెల గారడీ
హనుమకొండ, ఫిబ్రవరి 1 : బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు మొండిచేయి చూపారు. మరోసారి వేతనజీవులను నిరాశపరిచింది. ఎంతోకాలంగా ఆదాయ పన్ను పరిమితి పెంపుపై ప్రస్తావించకపోవడం వల్ల లక్షలాది మంది సుమారు రెండు నెలల జీతం పన్నుల రూపంలో చెల్లించాల్సి వస్తుంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ, డీఏలు మంజూరు చేసినా, అటు ఆదాయపు పన్ను రూపేణా కేంద్రం లాక్కోవడం బాధాకరం. పెట్టుబడిదారులకు కొమ్ముకాసేలా బడ్జెట్ ఉంది. అంకెల గారడీతో మరోసారి సామాన్యులకు మోసం చేసింది. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉకు పరిశ్రమ, ములుగులో గిరిజన యూనివర్సిటీ ఊసేలేదు. లక్షల కోట్ల బడ్జెట్ పెట్టినా, కార్పొరేట్ లాభాల కోసం ప్రభుత్వరంగ సంస్థలను అమ్మకానికి పెట్టడం శోచనీయం.-ఎ.జగన్ మోహన్రావు, టీజీవో ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్
ఉక్కు పరిశ్రమ ఊసేది..?
కేంద్ర బడ్జెట్లో ఉక్కు పరిశ్రమ ఊసెత్తక పోవడం తెలంగాణపై కేంద్రానికి ఉన్న వివక్షకు అద్దం పడుతోంది. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ కోసం బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని ఏడేండ్లుగా ఎదురు చూస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ పలు మార్లు ప్రధానికి విన్నవించినా పెడచెవిన పెట్టడం శోచనీయం. ఉక్కు పరిశ్రమ నిర్మాణం జరిగితే వేలాది మంది నిరుద్యోగ యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. కేంద్రం తెలంగాణపై వివక్ష మాని పరిశ్రమ ఏర్పాటు వెంటనే నిధులు కేటాయించాలి.-బానోత్ హరిప్రియానాయక్, ఎమ్మెల్యే, ఇల్లందు
ప్రజా సంక్షేమానికి కోతే
కృష్ణకాలనీ, ఫిబ్రవరి 1 : కేంద్ర బడ్జెట్ ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసింది. విభజన హామీలను పట్టించుకోలేదు. హైదరాబాద్ కేంద్రంగా ఆర్బిట్రేషన్ సెంటర్కు భారత ప్రధాన న్యాయమూర్తి ఇటీవల శంకుస్థాపన చేసినప్పటికీ మంగళవారం గుజరాత్ గిఫ్ట్సిటీ కేంద్రంగా అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ను బడ్జెట్ సాక్షిగా ప్రకటించడం ముమ్మాటికీ తెలంగాణ ప్రజలను మోసగించడమే. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఊసేలేదు. ఉపాధి హామీ పథకానికి గతేడాది కంటే నాలుగు రెట్లు తక్కువ కేటాయించడం తగదు.-బందు సాయిలు, సీపీఎం జిల్లా కార్యదర్శి, భూపాలపల్లి
సామాన్యులకు ప్రయోజనం లేదు
హనుమకొండ, ఫిబ్రవరి 1 : కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్తో సామాన్యులకు ఎలాంటి ప్రయోజనం లేదు. రైతుల ఉత్పత్తుల కొనుగోలుకు భరోసా ఇవ్వకపోవడం విచారకరం. మధ్య తరగతి, వేతన జీవులను నిరాశపరిచింది. బడ్జెట్లో పేద ప్రజలకు ఆదాయ వనరుల కల్పన, కనీస వేతనాలు పెంపు లేకవడం బాధాకరం. పన్నుల విధానంలో ఏమీ మార్పులు లేవు. డిజిటల్ కరెన్సీ మంచిదే అయినా సామాన్య ప్రజలు మోసపోయే ప్రమాదం ఉంది.-త్రిపురనేని గోపిచంద్, సీనియర్ చార్టెడ్ అకౌంటెంట్