ఖిలావరంగల్, జూలై 20 : చారిత్రక ఓరుగల్లు కోటకు పచ్చలహారం తొడిగినట్లు పచ్చదనంతో అలరారుతోంది. రాష్ర్టాన్ని హరితవనంగా తీర్చిదిద్దే యజ్ఞంలో భాగంగా రెండో విడుతలో నాటిన 4,225 మొక్కలు ఏపుగా పెరిగి ఇక్కడి మట్టికోటను నందనవనంగా మార్చేశాయి. కోట చుట్టూ నాలుగు వరుసల్లో ఉన్న చెట్లు ఇటు పర్యాటకులకు పచ్చదనంతో పాటు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
ఆరు కిలోమీటర్ల మేర మొక్కలు..
12 కిలోమీటర్ల చుట్టూ ఉన్న మట్టికోటకు సుమారు ఆరు కిలోమీటర్ల మేర ‘కుడా’ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. రావి, మర్రి, చింత, వేప, కదంబ, మారేడు, మామిడి, నేరేడు, బొడ్డు మల్లెలు, తదితర పూల మొక్కలను రెండో విడుత హరితహారంలో భాగంగా మట్టికోటకు ఆనుకొని నాలుగు వరుసల చొప్పున నాటారు. వేసవి కాలంలో తీవ్ర నీటి ఎద్దడి ఉన్నప్పటికీ ఏకశిల చిల్డ్రన్స్ పార్క్ నిర్వాహకులు తీగల శ్రీధర్ స్థానిక వ్యవసాయ బావుల నుంచి నీటిని తీసుకొచ్చి మొక్కలకు అందించారు. వ్యవసాయ బావి నుంచి కిలోమీటరు వరకు నీటిని డ్రిప్ పద్ధతిన మొక్కలకు నీటిని పెట్టేవారు. అక్కడి నుంచి మరో మోటరును బిగించి నీటిని మరో కిలోమీటరు వరకు తరలించి వేసవిలో మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో నేడు మొక్కలన్నీ వృక్షాలుగా మారాయి.
50వేల మొక్కలకు అవకాశం..
కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్న మట్టికోటలో ప్రస్తుతం 4,225 మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. అయితే మట్టికోటకు ఆ శాఖ హద్దులు నిర్ణయించి జిల్లా అధికార యంత్రాంగానికి ఇస్తే మరో 50వేల మొక్కలు కోటకు నాటే అవకాశముందని స్థానికులు పేర్కొంటున్నా రు. కిలోమీటరుకు 1,800 మొక్కలు చొప్పున కోట లోపలి చుట్టూ నాటితే 12 కిలోమీటర్లకు సుమారు 21వేల మొక్కలు నాటాల్సి వస్తుంది. కోట అవతలి భాగాన అగడ్త వైపు కూడా 21వేల మొక్కలు నాటే వీలుంది. కేంద్ర పురావస్తు శాఖ అనుమతి లభిస్తే శతృదుర్భేద్యమైన
మట్టికోట హరితవనమవుతుందని స్థానికులు భావిస్తున్నారు.