జనగామ : జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కేంద్రంలో రైతుబంధు సంబురాలు అంబరాన్నంటాయి. బోనాలు, ట్రాక్టర్ ర్యాలీలు, ఒగ్గు కళాకారుల డప్పు చప్పుళ్లతో ఉత్సవాలను హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో రైతులతో కలిసి జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కేక్ కట్ చేసి, సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..రైతుబంధు పథకం ఉత్సవాలను రాష్ట్రం మొత్తం ఒక పండుగ లాగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. రైతుల బాధలు తెలిసిన నిజమైన నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు. స్వతహాగా రైతుబిడ్డ కావడంతో రైతుల కష్టాలను తెలుసుకొని పెట్టుబడి సాయం అందజేస్తున్నారని తెలిపారు.
ఇలాంటి పథకం ప్రపంచంలో మరెక్కడా లేదన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమన్వయ సమితి అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి, పార్టీ కార్యకర్తలు, రైతులు, వ్యవసాయ మార్కెట్ అధికారులు పాల్గొన్నారు.