మొన్నటిదాకా బీజేపీని విమర్శించిన నీవు ఇప్పుడు ఎట్ల చేరుతవ్..?
వ్యక్తులు కాదు.. వ్యవస్థ ముఖ్యం
హుజూరాబాద్పై సీఎం ప్రత్యేక దృష్టి
అన్ని విధాలా అభివృద్ధి చేసుకుందాం
వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్
జమ్మికుంటలో పర్యటన.. సమీక్షా సమావేశాలు
జమ్మికుంట, జూన్ 12: మతాల మధ్య చిచ్చుపెట్టే బీజేపీలో ఈటల చేరబోతున్నాడని, అలాంటి మతతత్వ పార్టీలో చేరే ‘ఈటల’కు ఇక్కడ స్థానం లేదని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. నాడు మంత్రిగా నల్ల చట్టాలు, టీకాల వ్యవహారంపై బీజేపీని విమర్శించిన తీరును మరిచిపోయావా..? కమ్యూనిస్టు భావజాలం ఉన్న నీవు బీజేపీలో ఎలా చేరుతావని ఈటలను ప్రశ్నించారు. శనివారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కోరపల్లి, వెంకటేశ్వర్లపల్లి, పాపయ్యపల్లి, విలాసాగర్, సైదాబాద్, తనుగుల, శంభునిపల్లి, గండ్రపల్లి గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఆయా గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలో అనేక పదవులు అనుభవించిన ఈటల, దుర్బుద్ధితో బీజేపీలో చేరుతున్నాడని ఆరోపించారు.
వ్యక్తులు కాదు.. వ్యవస్థే ముఖ్యం
వ్యక్తులు ప్రధానం కాదని, వ్యవస్థ మాత్రమే ముఖ్యమని అరూరి తేల్చి చెప్పారు. హుజూరాబాద్ నియోజకవర్గంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని, అన్ని విధాలా అభివృద్ధి చేసుకుందామని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా చేయని అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు అందించిన ఘనత సీఎం కేసీఆర్దేనని తెలిపారు. కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమం దూసుకుపోతున్నదని, బీజేపీ, కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో అమలు కావడం లేదన్నారు. అభివృద్ధి ఆగదని, సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తామన్నారు. ఎవరికైనా అనారోగ్య సమస్యలుంటే తెలియజేయాలని, దగ్గరుండి పరిష్కరిస్తానని చెప్పారు. అంతకుముందు ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు అందించిన సలహాలు, సూచనలు స్వీకరించి, సమస్యలు, అభివృద్ధి పనులను అడిగి తెలుసుకున్నారు. అన్నింటికీ సీఎం కేసీఆర్ ఉన్నారని గుర్తుచేశారు. సమీక్షలో సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, వరంగల్ డీసీబీబీ చైర్మన్ రవీందర్రావు, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు లింగారావు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.