వరంగల్, నవంబర్ 24: నగరంలో అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. స్మార్ట్సిటీ, సీఎంఈవై, డీఆర్ఎఫ్ తదితర పథకాల నిధులతో చేపట్టిన పనుల పురోగతిపై వరంగల్లోని కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో బుధవారం ఆమె బల్దియా, కుడా, ఇరిగేషన్ అధికారులతో సమీక్షించారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పనుల్లో వేగం పెంచాలన్నారు. స్మార్ట్రోడ్లు, నాలా వెంబడి నిర్మించే రిటైనింగ్ వాల్స్, రోడ్ల ప్యాచ్ వర్కులు గడువులోగా పూర్తి చేయాలన్నారు. వడ్డేపల్లి బండ్ అభివృద్ధి, పబ్లిక్ గార్డెన్ సుందరీకరణ, గ్రంథాలయాల నవీకరణను త్వరగా పూర్తి చేయాలన్నారు. అమృత్ పార్కులను ఎలక్ట్రికల్, హార్టికల్చర్, ఇంజినీరింగ్ అధికారులు సమన్వయంతో క్షేత్రస్థాయిలో పరిశీలించి అవసరమైన పనులు చేపట్టాలని సూచించారు. గ్రేటర్ పరిధిలోని ఫుట్పాత్లపై టైల్స్ పూర్తిగా ధ్వంసమయ్యాయని, వెంటనే మరమ్మతు పనులు చేపట్టాలని ఆదేశించారు. విలీన గ్రామాల్లో బావులకు ఫెన్సింగ్ నిర్మించి గ్రేటర్ కార్పొరేషన్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆమె అధికారులకు సూచించారు. సమావేశంలో బల్దియా ఎస్ఈ సత్యనారాయణ, సిటీ ప్లానర్ వెంకన్న, కుడా ప్రాజెక్ట్ అధికారి అజిత్రెడ్డి, స్మార్ట్సిటీ ప్రాజెక్ట్ మేనేజర్ ఆనంద్ వోలేటి, ఇరిగేషన్ ఈఈ ఆంజనేయులు, బల్దియా ఈఈలు శ్రీనివాసరావు, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్, భీమ్రావు, డీఈ, ఏఈ, టౌన్ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు.
క్షేత్రస్థాయిలో సమస్యల పరిశీలన
వరంగల్ అండర్ రైల్వేగేట్ ప్రాంతంలోని పలు డివిజన్లలో కమిషనర్ ప్రావీణ్య పర్యటించారు. శివనగర్, చింతల్, తెలంగాణ కాలనీలో సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.