తోటలను పరిశీలించిన ఉద్యానశాఖ శాస్త్రవేత్తలు
పురుగు ఆశించిన పూలు, కాయల నమూనాల సేకరణ
తామర పురుగుగా వెల్లడించిన బెంగళూరు శాస్త్రవేత్తలు
ఇతర దేశాల నుంచి వచ్చినట్లు ధ్రువీకరణ
ముదురు తోటల్లో వేగంగా వ్యాప్తి
వరంగల్, నవంబర్ 24(నమస్తేతెలంగాణ) : మిరపను కొత్త రకం పురుగు ఆశించింది. పరిశీలించిన ఉద్యానశాఖ శాస్త్రవేత్తలు దీన్ని తామర పురుగుగా గుర్తించారు. ఇతర దేశాల నుంచి ఇది తొలిసారి ఇక్కడకు వచ్చినట్లు కనుగొన్నారు. కొద్ది రోజుల నుంచి మిరప తోటల్లో తామర పురుగు ఉధృతి పెరిగినట్లు బుధవారం వెల్లడించారు. ఈ పురుగు తోటలోని పూలపై ఆశించి రెక్కలు, కేసరాల నుంచి రసాన్ని పీల్చుతున్నది. దీంతో పూలు వాడి రాలిపోతున్నాయి. కాయ ఏర్పడడం లేదు. ఆకులు, పూలు, కాయలపై కూడా ఆశించి నష్టం కలిగిస్తున్నది. మూడు రోజుల క్రితం హైదరాబాద్లోని కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు నర్సంపేట మండలంలోని తోటలను ఉద్యానశాఖ జిల్లా అధికారి శ్రీనివాసరావుతో కలిసి పరిశీలించారు.
ఇన్నాళ్లూ మిరప పంటలో తెల్లదోమ, ఎర్రనల్లి, శనగ పచ్చపురుగు, లద్దెపురుగు ఆశించి నష్టం కలిగించేవి. ఈ ఏడాది అనూహ్య రీతిలో తామర పురుగు ఆశించింది. ప్రస్తుతం మిరప చేలల్లో పూలపై ఆశిస్తున్న ఈ కొత్త రకం తామర పురుగులు నలుపు రంగులో ఉండి పొడవు ఒక ఎంఎం కంటే తక్కువ పరిమాణంలో ఉంటున్నాయి. పంటకు నష్టం కలుగుతుండడంతో ఆందోళన చెందుతున్న జిల్లాలోని మిరప రైతులు కొద్ది రోజుల క్రితం ఉద్యానశాఖ అధికారుల దృష్టికి తెచ్చారు. మిరప తోటలను సందర్శించి పరిశీలించిన ఉద్యానశాఖ అధికారులు కొత్త రకం పురుగు కావడంతో హైదరాబాద్లోని కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలకు సమాచారమిచ్చారు. మూడు రోజుల క్రితం ఈ విశ్వవిద్యాలయం నుంచి శాస్త్రవేత్తలు అనిత, భాస్కర్, సురేశ్ నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లి, దాసరిపల్లి, బానోజీపేట గ్రామాల్లోని మిరప తోటలను ఉద్యానశాఖ జిల్లా అధికారి శ్రీనివాసరావుతో కలిసి పరిశీలించారు.
పురుగు జీవిత చక్రం 20-25 రోజులు..
ముదురు తోటల్లో ఈ కొత్తరకం తామర పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లు, చపాట మిర్చి, ఎండు మిర్చి రకాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు గుర్తించారు. చపాట రకం మిరప తోటలో మరింత ఎక్కువగా ఉందన్నారు. పూత, కాయ దశలో ఉన్న తోటల్లో అధికంగా ఉందని, పూలపై గుడ్లు పెడుతుండడం వల్ల పురుగు ఉధృతి వేగంగా వ్యాపిస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు. పురుగు ఆశించిన కొమ్మలు, పురుగులు, గుడ్ల నమూనలను సేకరించారు. మంగళవారం బెంగళూరులోని కీటక పరిశోధన స్థానానికి పంపారు. తామర పురుగులు జీవిత చక్రం 20 నుంచి 25 రోజుల్లో పూర్తి చేసుకుంటాయని, తల్లి పురుగులు దాదాపు 150 గుడ్లు పెడుతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. వాటి నుంచి పిల్ల పురుగులు బయటకు వస్తాయని, రసాన్ని పీల్చి నష్టం కలిగిస్తాయన్నారు. తామర పురుగులు పరోక్షంగా వైరస్లను ఒక మొక్క నుంచి మరో మొక్కకు వ్యాప్తి చేస్తాయని చెప్పారు. ఈ పురుగులు ఆశించినప్పుడు ఆకు ముడత పైకి ఉంటుందని, ఈ నేపథ్యంలో దీన్ని పై ముడత అని, నల్లి ఆశిస్తే కింది ముడతగా పరిగణిస్తారని తెలిపారు. తామర పురుగు ఆశించిన కాయలపై చారలు ఏర్పడి కాయలు సరిగ్గా ఎదగకుండా చిన్నవిగా ఉండిపోతున్నాయని గుర్తించారు.
విచక్షణా రహితంగా వాడొద్దు..
వరంగల్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, ఖమ్మం, కొత్తగూడెం, ఆదిలాబాద్, నల్గొండ, నాగర్కర్నూల్ తదితర జిల్లాల్లో రైతులు మిరప పంట సాగు చేస్తున్నారు. రైతులు విచక్షణా రహితంగా మిరప తోటలపై పురుగు మం దులు వాడొద్దని విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సూచించారు. రైతులు వాడే ఎక్కువ పిచికారీలతో వాటి సహజ శత్రువులు చనిపోతాయని, వాటికి నిరోధక శక్తి ఎక్కువై అవి ఏ పురుగు మం దులకు లొంగకుండా వాటి సంఖ్య ప్రమాదకర స్థాయికి చేరే అవకాశం ఉందని ఉద్యానశాఖ జిల్లా అధికారి శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తామర పురుగు నివారణకు వేపనూనె 10,000 పీపీఎంను లీటరు నీటిలో కలిపి ఈ పురుగు ఆశించిన మిరప తోటపై పిచికారీ చేయాలని రైతులకు సూచించారు. రైతులు సామూహికంగా ఎక్కవ సంఖ్యలో నీలిరంగు, పసుపు రంగు అట్టలను పొలంలో పెట్టుకోవటం ద్వారా వీటి తల్లి పురుగులను నివారించుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. తామర పురుగు రైతులు వాడే అన్ని రకాల పురుగు మందులను తట్టుకునే సామర్థ్యం కలిగి ఉన్నందున పురుగు మందుల ద్వారా వీటిని నివారించడం కష్టమని, బాసియానా మందు ఐదు గ్రాములను లీటరు నీటిలో కలిపి కూడా పిచికారీ చేయవచ్చని తెలిపారు.