జనగామ రూరల్, అక్టోబర్ 22 : వృత్తిదారుల సంక్షేమానికి పాటుపడుతున్న తెలంగాణ సర్కారు గొర్రెల పెంపకం దారుల కోసం రాయితీలిస్తున్నది. గొల్లకురుమలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే మొదటి విడుతలో సబ్సిడీపై జీవాలను పంపిణీ చేసింది. రెండో విడుతలో లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో 20 గొర్రెలు, పొట్టేలుతో కూడిన యూనిట్ ధర రూ.1.25 లక్షల నుంచి రూ.1.75 లక్షలకు చేరింది. దీంతో గతంలో ఉన్న రాయితీని నుంచి రూ.93 వేల నుంచి రూ.1.31 లక్షలకు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. జిల్లాలో 194 సొసైటీలుండగా వీటిలో 21 వేల మందికిపైగా సభ్యులున్నారు. మొదటి విడుతలో 10,520 మందికి జీవాలను పంపిణీ చేశారు. రెండో విడుతలో 10,954 మందికి అందించేలా పశుసంవర్ధశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
గొల్లకురుమల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నది. ఇప్పటికే జిల్లాలోని 194 గొర్రెల పెంపకందారుల సొసైటీల్లో మొదటి విడుతలో 10,520 మందికి జీవాలను పంపిణీ చేశారు. రెండో విడుతలో 10,954 మందికి పంపిణీ చేసేందుకు సర్కారు చర్యలు తీసుకుంటున్నది. నిబంధనల్లో పలు మార్పులు చేసింది. 20 గొర్రెలు, పొట్టేలుతో కూడిన యూనిట్ ధర పెరిగిన నేపథ్యంలో రాయితీని పెంచేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించింది. ప్రస్తుతం గొర్రెల యూనిట్ ధర రూ. 1.25 లక్షల నుంచి రూ. 1.75 లక్షలకు చేరుకుంది. ప్రభుత్వ రాయితీ రూ.93 వేల నుంచి రూ.1.31 లక్షలకు పెరగనుంది. మార్కెట్ ధరకు అనుగుణంగా మార్పులు చేసినట్లు పశుసంవర్ధకశాఖ అధికారులు చెబుతున్నారు. గొర్రెల కాపరులకు నాణ్యమైన యూనిట్లతో పాటు బీమా, దాణా సైతం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో 194 సొసైటీల్లో మొత్తం 21 వేల మందికిపైగా సభ్యులున్నారు. రెండో విడుత లబ్ధిదారుల జాబితాను అధికారులు ఇప్పటికే తయారు చేశారు.
పెరిగిన గొర్రెల యూనిట్ విలువ…
ప్రభుత్వం అందించే గొర్రెల యూనిట్లో 20 గొర్రెలు, పొట్టేలు అందజేసేందుకు గతంలో లభ్దిదారుల నుంచి రూ.31,250ను డీడీ రూపంలో తీసుకున్నారు. యూనిట్ ధర పెరుగడంతో మరో రూ. 12,500 చెల్లించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. లబ్ధిదారుల వాటాను పెంచినట్లుగానే సబ్సిడీని సైతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పథకం విధివిధానాలకు అనుగుణంగా డీడీలు చెల్లించిన వారంతా నూతన నిబంధనలకు అనుగుణంగా చెల్లిస్తున్నారు.
గొర్రెల పెంపకందారుల సొపైటీల బలోపేతం కోసం కృషి..
గతంలో గొల్లకురుమలు సొసైటీలు స్థాపించుకోవాలంటే పెద్ద తంతు ఉండేది. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కులవృత్తులకు పెద్దపీట వేశారు. గొర్రెల పెంపకందారుల సొసైటీల ఏర్పాటుకు నిబంధనలను సరళతరం చేశారు. ఫలితంగా పైసా ఖర్చు లేకుండా సభ్యత్వ రుసుముతో గ్రామాల్లో సొసైటీలు ఏర్పడ్డాయి. 18 సంవత్సరాలు నిండిన వారంతా ఇందులో సభ్యత్వం తీసుకున్నారు. త్వరలోనే రెండో విడుత గొర్రెల యూనిట్ల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పశుసంవర్థకశాఖ ఇప్పటికే డీడీలు చెల్లించిన మార్గదర్శకాల ప్రకారం యూనిట్లు అందించనుంది.
జీవాలే జీవనాధారం..
గొర్రెల పెంపకం మావృత్తి. సీఎం కేసీఆర్ సార్ కులవృత్తులను కాపాడడం కోసం మాకు గొర్రెల యూనిట్లు అందజేశారు. మొదటి విడుతలోనే మా గ్రామానికి వంద యూనిట్లు వచ్చాయి. దీంతో మంద పెద్దది అయ్యింది. గొర్రెలను కాస్తు కుటుంబాన్ని సాదుకుంటున్న. జీవాలతో అనేక మందికి మేలు జరిగింది.
-దేవునూరి అచ్చయ్య, ఎల్లంల గ్రామం,