భీమదేవరపల్లిలో వెయ్యేళ్ల కిందటి రాటన స్తంభాలు
వాగు ఒడ్డున మోట విధానంనాడు వ్యవసాయానికి ఊతం
‘గాథాసప్తశతి’లో ఉదక యంత్రాలుగా ప్రస్తావన
రెండు వేల ఏళ్ల నుంచే వినియోగం
భీమదేవరపల్లి, డిసెంబర్ 18 : ఇప్పుడంటే ప్రాజెక్టులు.. చెరువులు.. కాలువలు.. బావులు.. మోటర్ల ద్వారా ఎవుసానికి పుష్కలంగా నీళ్లందుతున్నాయి. మరి ఇవన్నీ లేని వేల ఏళ్ల క్రితం.. పొలాలకు జలాలు ఎలా పారాయో చెప్పేందుకు సాక్ష్యాలు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. ప్రాచీన నీటి పారుదల పద్ధతిని కళ్లెదుట కట్టే రాటన స్తంభాలు మన పల్లెల్లో అక్కడక్కడ దర్శనమిస్తున్నాయి. నాటి వ్యవసాయానికి ఊతంలా నిలిచిన వెయ్యేళ్ల కిందటి మోట స్తంభాలు భీమదేవరపల్లిలో వెలుగుచూశాయి. ‘శాతవాహనుల కాలంలో ఉదక యంత్రాలను వాడేవారు’ అని హాలుడు రాసిన ‘గాథాసప్తశతి’లోనూ వీటి ప్రస్తావన ఉండగా కాల క్రమంలో వచ్చిన పెను మార్పులతో ఇవి కనుమరుగై వాటి విశిష్టత కూడా ఎవరికీ తెలియకుండా పోయింది.
ఇప్పటి మాదిరిగా ఆ కాలంలో కరంట్ లేదు.. నీళ్లు తోడే ఆధునిక యంత్రాలు, బోర్లు లేవు.. వాగులు, ఏరులు, నీరున్న ప్రాంతంలో గాడి, గాడిలో గిరక లేదా కదురు బిగించి, నిలిపిన రాతి స్తంభాల మీద అడ్డంగా ఓవైపు తోలు లేదా ఇనుప రేకులతో చేసిన బొక్కెన, మరో వైపు బరువు పెట్టి తాడుతో గుంజే ఏర్పాట్లు చేసుకుని నీటిని తోడుకుని వ్యవసాయం చేసేవారు. ఈ విధానాన్ని రాటనం (మోట) అని పిలిచేవారు. ప్రాచీనకాలంలో నీటిని తోడేందుకు రాటనం ప్రధాన భూమిక పోషించేది. సుమారు రెండు వేల ఏళ్ల క్రితం నుంచి ఈ పద్ధతి అమలులో ఉన్నట్లు చరిత్రకారుల ద్వారా తెలుస్తున్నది.
వాగు ఒడ్డున వెలుగులోకి..
ప్రాచీన రాటనాలకు వాడిన గాడి స్తంభాలు భీమదేవరపల్లి మండలంలోని ములుకనూరు- భీమదేవరపల్లి గ్రామాల సరిహద్దులో వెలుగుచూశాయి. భీమదేవరపల్లి మండల కేంద్రంలోని భీమేశ్వరాలయం పక్కన చెరువు గట్టు సమీపంలో నిలువాటి రాటన స్తంభం(ఖని) ఉంది. ఈ ప్రాంతానికి సమీంలోనే వాగు ఉంది. ఈ వాగు భీమదేవరపల్లి, ములుకనూరు సరిహద్దులో ఉంది. వాగు ఒడ్డున అతి ప్రాచీనమైన మరో స్తంభం బయటపడింది. ఇది దాదాపుగా భూమిలో కూరుకుపోయింది. ఇవి సుమారు వెయ్యేళ్ల కిందట వాడిన స్తంభాలు అయి ఉంటాయని చరిత్రకారులు చెబుతున్నారు. వాగు ఒడ్డున రాటనాలను ఏర్పాటు చేసుకొని రైతులు పంటలకు నీళ్లు పారించేవారని తెలుస్తున్నది.
రాటనం వాడకం ఇలా..
పొడవాటి రాళ్లతో రాటన స్తంభాలను తయారు చేస్తారు. స్తంభానికి పైవైపు గాడిని తొలిచి, గిరక లేదా కదురు తిరిగేందుకు ఆ గాడికి రెండు దిక్కులా రంధ్రాలు చేస్తారు. తరువాత నీటిని తోడేందుకు గాడిలోని గిరక లేదా కదురు మీద కదిలే ఒక పొడవాటి కర్రను ఉపయోగించేవారు. ఆ కర్రకు ఓ వైపు తోలు లేదా ఇనుపరేకుల బొక్కెన కట్టి రెండోవైపు బరువు పెట్టి తాడుతో కిందకు పైకి ఆడించేవారు. వేగంగా, ఎక్కువగా నీరు తోడాల్సి వచ్చినప్పుడు ఆ కట్టె పైన ఓ మనిషి ఎక్కి గడ సాయంతో అటూఇటూ నడుస్తూ నీటిని తోడేవాడు. నీటి ప్రవాహం ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా ఈ పద్ధతిని ఉపయోగించేవారు. ఇలాంటి నీటి యంత్రాన్నే కొన్ని చోట్ల ‘యాతం’ అని అంటారు. మన ప్రాంతంలో రాటనాలు అని, స్తంభాలను రాటన స్తంభాలు అని పిలిచేవారు. వ్యవసాయ బావిలో పైభాగాన వృత్తాకారంలో ఉండే బకెట్లను అమర్చుతారు. నేలమీద తిరిగే చక్రానికి ఒకటి లేదా రెండు ఎడ్లు కట్టి తాడుతో లాగడం ద్వారా వృత్తాకారంలో ఉన్న బకెట్లు గుండ్రంగా తిరుగుతూ పంట పొలాలకు నీరందించేవి. ప్రాచీన ఇరిగేషన్ పద్ధతుల ఆనవాళ్లు ఖమ్మం జిల్లా రాజేశ్వరీపురంలో ఇప్పటికీ పదిలంగా ఉన్నాయని చరిత్రకారుడు కట్టా శ్రీనివాస్ తెలిపారు. రాటన(మోట) స్తంభం, ప్రాచీన సాగునీటి వ్యవసాయ పద్ధతుల గురించి ఆయన నిశితంగా పరిశోధించారు.
రాటనం అతి ప్రాచీన పద్ధతి
శాతవాహనుల కాలంలో ఉదక యంత్రాలను వాడేవారని హాలుడు రాసిన ‘గాథాసప్తశతి’ వల్ల తెలుస్తున్నది. తెలంగాణ శాసనాల్లో రాటనాల వాడకం గురించి పలుచోట్ల ప్రస్తావనలున్నాయి. రాటనాల ద్వారా వ్యవసాయానికి నీరందించడమనేది అతి ప్రాచీన సాగునీటి వసతి. సుమారు రెండు వేల ఏళ్ల కిందటి నుంచి ఈ పద్ధతి ఉంది. కాలక్రమేణా వ్యవసాయంలో పెనుమార్పులు వచ్చాయి. ఇప్పటికీ అక్కడక్కడా ఈ రాటన స్తంభాలు పల్లెల్లో కనిపిస్తున్నాయి. ప్రాచీన వ్యవసాయ విధానానికి ఈ రాటన స్తంభాలు మూలాధారాలు. వీటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత.
-శ్రీరామోజు హరగోపాల్, కొత్త చారిత్రక బృందం కన్వీనర్