మోడీ ప్రభుత్వం పద్ధతి మార్చుకోవాలి
యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలి
కనీస మద్దతు ధర ప్రకటించాలి
ఇతర దేశాలకు ఎగుమతి చేసే బియ్యానికి ఇన్సెంటివ్లు ఇవ్వాలి
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
జయశంకర్ భూపాలపల్లి, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రైతులపై మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయం చేస్తున్నదని, పద్ధతి మార్చుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హెచ్చరించారు. శనివారం ఆయన జిల్లా కేంద్రంలోని క్యాం పు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో పండించిన ధాన్యాన్ని షరతులు లేకుండా కొనుగోలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణలో రా రైస్ తక్కువ ఉంటుందని, అలాంటి పరిస్థితుల్లో బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయమని చెప్పడం సరికాదన్నారు. కనీస మద్దతు ధరతో పాటు బాయిల్డ్ రైస్ తీసుకునేలా చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రిని ఎమ్మెల్యే కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు అంగా నిలుస్తూ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నదని చెప్పారు. పంటల దిగుబడిని చూసి కేంద్రం కళ్లుకుట్టి సమస్యలు సృష్టిస్తోందని ఆరోపించారు. ఢిల్లీలో కూర్చుని కాగితాలపై ప్రకటన చేయడం కాదని, రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలపై సమీక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పడించిన బియ్యాన్ని ఇతర దేశాల ఎగుమతి కోసం ఇన్సెటివ్లను ప్రకటించాలన్నారు.
భూపాలపల్లికి ఔటర్ రింగ్ రోడ్డు
జిల్లా కేంద్రానికి ఔటర్ రింగ్రోడ్డు నిర్మాణానికి అనుమలు వచ్చినట్లు ఎమ్మెల్యే గండ్ర తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంగా, మున్సిపాలిటీగా మారడంతో రవాణా సౌకర్యం పెరిగి ట్రాఫిక్ సమస్య తలెత్తుతున్నదని, జాతీయ రహదారికి అనుసంధానంగా ఔటర్ రింగ్ రోడ్డును మంజూరు చేయాలని సీఎం కేసీఆర్ను కోరగా అనుమతులు ఇచ్చినట్లు చెప్పారు. భూపాలపల్లి అనుసంధానంగా గతంలో సిరొంచ నుంచి చైన్నై వరకు జాతీయ రహదారిగా ఏర్పాటు చేసేలా కృషిచేసినట్లు చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డుకు ప్రతిపాదనలు పంపించాలని సింగరేణి, ఆర్అండ్బీ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. జిల్లా అభివృద్ధిలో భాగంగా రూ.55 కోట్లతో కొత్త ప్రభుత్వ వైద్యశాల, మెడికల్ కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రూ. 70 కోట్లతో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటా రక్షిత తాగు నీటి సరఫరా, రూ.5.5 కోట్లతో మూడు ఎకరాల్లో మోడల్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్, రూ. 2 కోట్లతో అధునాతన కమ్యూనిటీ హాల్, మరో కమ్యూనిటీ హాల్ కోసం జెన్కో అధికారులకు ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
మున్సిపాలిటి పరిధిలో ఐదుగురికి రూ.3.45 లక్షల విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కులు బాధితులకు ఎమ్మెల్యే గండ్ర అందజేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ సెగ్గం వెంకటరాణి, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, కౌన్సిలర్లు స్వామి, రవీందర్, రవి, రాజు, రేణుక, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్, మహిళా అధ్యక్షురాలు తిరుపతమ్మ, టీబీజీకేఎస్ నాయకుడు కొక్కుల తిరుపతి, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.